ETV Bharat / bharat

చైనాకు దీటుగా భారత బలగాల మోహరింపు!

author img

By

Published : May 25, 2020, 6:55 PM IST

వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్​ దౌత్య విధానంతోపాటు సైనికంగా దూకుడు ప్రదర్శిస్తోంది. పొరుగు దేశ అధికారులతో చర్చలు జరుపుతూనే చైనాకు సమానంగా కీలక స్థావరాల్లో సైన్యం సామర్థ్యాన్ని పెంచుతోంది. చైనా ఎలాంటి చర్యలకు దిగినా దీటుగా ఎదుర్కోనేందుకు సిద్ధమవుతోంది.

Chinese troops
చైనాకు దీటుగా భారత బలగాల మోహరింపు!

లద్ధాఖ్​ సెక్టార్​లో వాస్తవాధీన రేఖ వెంబడి వివిధ ప్రాంతాల్లో 5 వేల మంది బలగాలను చైనా మోహరించింది. భారత సైన్యం కూడా చైనా స్థాయిలో బలగాలను మోహరిస్తోంది. ఇతర ప్రాంతాల్లోనూ చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అతిక్రమణలకు పాల్పడకుండా నిరోధించడానికి భారత్​ తన బలాన్ని పెంచుతోంది.

ప్రస్తుతం చైనా తన బలగాలతో వాస్తవాధీన రేఖకు ఆవలి వైపున భారీ సన్నాహకాలు చేస్తోంది. భారత సైన్యానికి చెందిన దౌలత్ బేగ్ ఓల్డీలోని 81, 114 బ్రిగేడ్​ పరిధిలోని ఎల్​ఏసీకి అతి సమీపంలో బలగాలను మోహరించింది చైనా.

చైనా దూకుడు..

భారత సైన్య అధికారుల ప్రకారం పాంగాంగ్​ సో సరస్సు, ఫింగర్ ప్రాంతాల్లోని భారత భూభాగంలోకి చైనా భారీ వాహనాలను తరలించింది. గాల్వన్​ నాలా ప్రాంతంలో భారత్​ స్థావరాలకు 10 నుంచి 15 కిలోమీటర్ల సమీపంలోకి వచ్చి గుడారాలు ఏర్పాటు చేశారు.

భారత స్థావరాలకు ఎదురుగా తమ భూభాగంలో చైనా రహదారులు నిర్మిస్తోంది. భారత్​ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా మౌలిక సదుపాయాల నిర్మాణాల విషయంలో పొరుగు దేశం తీరుమార్చుకోవటం లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

నిర్మాణాలపై దృష్టి..

గాల్వన్​లో గస్తీ పాయింట్​ 14 వద్ద భారత్​ వంతెన నిర్మిస్తోంది. దీనిపై చైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అక్కడ తన బలాన్ని పెంచుకుంటోంది. ఏ సమయంలోనైనా ఈ ప్రాంతంలో భారత్​ 250 మందిని మోహరించే అవకాశం ఉంది. చైనా దూకుడుకు కళ్లెం వేసుందుకు భారత్​ దీటుగా నిర్ణయం తీసుకుంటోంది.

దౌలత్ బేగ్ ఓల్డీ సెక్టార్​లోని వైమానిక స్థావరం సాయంతో తూర్పు లద్ధాఖ్​ సెక్టార్​లోని చాలా ప్రాంతాలకు బలగాలను తరలిస్తోంది భారత్. చైనా దృష్టి సారించలేని దౌలత్​ బేగ్​లో వైమానిక క్షేత్ర నిర్మాణం ప్రతిపాదనను మళ్లీ తెరపైకి తెచ్చింది.

చైనాకు దీటుగా..

70 బ్రిగేడ్​ అధీనంలోని తూర్పు లద్ధాఖ్​, హిమాచల్​ సెక్టార్​, సెంట్రల్​ సెక్టార్​లో భారత సైన్యం భారీగా బలగాలను మోహరిస్తోంది. చైనా ఎలాంటి దూకుడు చర్యలకు పాల్పడినా వెంటనే చెక్​ పెట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది.

అయితే క్షేత్ర స్థాయి కమాండర్​లతోపాటు సీనియర్ అధికారులు చైనాతో ఏర్పడిన ప్రతిష్టంభనపై చేస్తోన్న చర్చలు కొలిక్కి రావటం లేదు. చైనా మొండి వైఖరి వల్ల ఇందులో ఎలాంటి పురోగతి లేదని తెలుస్తోంది. అందుకే భారత్​ కూడా సైనిక పరంగా ముందంజ వేస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చూడండి: భారత్​, చైనా సరిహద్దు వివాదం- 10 కీలకాంశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.