ETV Bharat / bharat

కాంగ్రెస్​లో మళ్లీ అంతర్యుద్ధం- కారణం ఆ 'లేఖ'!

author img

By

Published : Aug 23, 2020, 4:44 PM IST

సీడబ్ల్యూసీ సమావేశానికి ముందు పార్టీ సీనియర్​ నేతలు రాసిన ఓ లేఖ.. కాంగ్రెస్​ శ్రేణుల్లో తీవ్ర కలకలం రేపింది. పార్టీ నాయకత్వ లోపాన్ని ప్రశ్నిస్తూ.. అధ్యక్షురాలు సోనియా గాంధీకి పలువురు సీనియర్​ నేతలు, ఎంపీలు ఈ లేఖ రాసినట్టు సమాచారం. అయితే ఇది రాహుల్​ గాంధీకి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర అని వర్గం ఆరోపిస్తోంది. అసలు లేఖలో ఏముంది? సోమవారం జరగనున్న భేటీపై దీని ప్రభావం తప్పదా?

Uproar over 'letter politics' of senior leaders in Congress ahead of crucial CWC meet
కాంగ్రెస్​లో మరో అంతర్యుద్ధం.. కారణం ఆ 'లేఖ'?

కాంగ్రెస్​కు కాబోయే సారథి ఎవరు? రాహుల్​ గాంధీ తిరిగి అధ్యక్ష బాధ్యతలు చేపడతారా? పార్టీ అధిష్ఠానం ఏదైనా అనూహ్య నిర్ణయం ప్రకటిస్తుందా? ఇప్పుడు అందరివీ ఇవే ప్రశ్నలు. అందరి ఆసక్తి సోమవారం జరగనున్న కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంపైనే. దశాబ్దాల చరిత్ర గల పార్టీ.. నాయకత్వ లోపంతో అత్యంత బలహీనంగా మారిన తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్​ నేతలు రాసినట్టుగా చెబుతున్న ఓ 'లేఖ' తెరపైకి వచ్చింది. అదే ఇప్పుడు పార్టీలో మరో అంతర్యుద్ధానికి దారి తీసినట్టు తెలుస్తోంది. అసలు ఆ లేఖలో ఏముంది? ఆ లేఖను ఎవరు రాశారు?

5 పాయింట్​ అజెండా...

కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీకి.. కొందరు పార్టీ సీనియర్​ నేతలు, ఎంపీలు, సీడబ్ల్యూసీ సభ్యులు ఓ లేఖను పంపినట్టు సమాచారం. కాంగ్రెస్​ పునరుద్ధరణకు చేపట్టాల్సిన అంశాలను(5పాయింట్​ అజెండా) ఆ లేఖలో వారు పేర్కొన్నట్టు తెలుస్తోంది. అందులోనే పార్టీ దయనీయ పరిస్థితిపై వారు ప్రశ్నల వర్షం కురిపించారు. సీడబ్ల్యూసీకి ఎన్నికలు నిర్వహించాల్సిందేనని డిమాండ్​ చేశారు. వీటితో పాటు పార్టీలో క్రియాశీలక నాయకత్వానికి ఉన్న ఆవశ్యకతను వివరించారు.

ఇదీ చూడండి:- 'గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తులకే కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలు'

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. ఆ 5పేజీల లేఖను ఇద్దరు సీనియర్​ నేతలు రాయగా.. దానిపై చర్చించిన అనంతరం మిగిలిన వారు సంతకాలు చేశారు. అయితే సోనియా-రాహుల్​పై ఎవరూ ప్రత్యక్షంగా విర్శలు చేయనప్పటికీ.. పార్టీ హైకమాండ్​పై తమ అసంతృప్తి, అవిశ్వాసాన్ని అందులో వెలిబుచ్చినట్లు తెలుస్తోంది.

లేఖ వ్యవహారంపై మౌనం...

రాజ్యసభలోని ప్రతిపక్ష నేత గులామ్​ నబీ ఆజాద్​, సీనియర్ నేతలు ఆనంద్​ శర్మ, కపిల్​ సిబల్​, మనీశ్​ తివారీ, శశి థరూర్​, జితిన్​ ప్రసాద్​, వీరప్ప మొయిలీ, సందీప్​ దీక్షిత్​, ప్రమోద్​ తివారీ, పీజే కురియన్​ తదితరులు లేఖపై సంతకం చేసినట్టు సమాచారం. అయితే ఇది నిజమని చెప్పడానికి మాత్రం వీరెవ్వరూ ముందుకు రాలేదు. అదే సమయంలో తమకు అలాంటి లేఖ అందినట్టు కాంగ్రెస్​ కూడా అంగీకరించడం లేదు.

అయితే.. పేరు బయటపెట్టడానికి ఇష్టం లేని ఓ నేత మాత్రం ఈ లేఖపై స్పందించారు. ఈ పూర్తి వ్యవహారంలో తాను కూడా భాగస్వామినేనని వెల్లడించారు. రాష్ట్ర స్థాయిలోని మాజీ పీసీసీ అధ్యక్షులు కూడా ఇందులో భాగమని తెలిపారు. అయితే.. లేఖలో ఉన్న అన్ని అంశాలకు ప్రతి నేత అంగీకరించినట్టు కాదని.. కానీ సమస్యలను, ముఖ్యంగా నాయకత్వ లోపంపై కచ్చితంగా చర్చ జరిగి, ఓ పరిష్కారాన్ని కనుక్కోవాలని వారందరూ భావిస్తున్నట్టు పేర్కొన్నారు.

అంతర్యుద్ధం...

ఈ లేఖపై అధికారిక ప్రకటనలు లేనప్పటికీ.. ఇప్పటికే దీనిపై అంతర్యుద్ధం మొదలైనట్టు కనపడుతోంది. లేఖపై మీడియాలో వస్తున్న కథనాలను ఖండిస్తూ.. ఇవన్నీ రాహుల్​ గాంధీకి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలని మండిపడ్డారు కాంగ్రెస్​ నేత సంజయ్​ నిరుపమ్​.

ఇదీ చూడండి:- కాంగ్రెస్​ వెబ్​సిరీస్​ 'ధరోహర్'​ తొలి ఎపిసోడ్ విడుదల

మరోవైపు సోమవారం జరిగే సీడబ్ల్యూసీ సమావేశంలో ఈ లేఖ ప్రస్తావన వస్తే.. ఆ పరిణామాలు గొడవకు దారి తీస్తాయని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.

'రాహుల్​ రాకపోతే.. అంతే'

అదే సమయంలో రాహుల్​ గాందీ మళ్లీ పగ్గాలు చేపట్టాలన్న డిమాండ్లు కూడా భేటీలో బలంగా వినిపించే అవకాశాలు ఉన్నట్టు కనపడుతోంది. ఈ విషయంపై కాంగ్రెస్​ జాతీయ కార్యదర్శి చల్లా వంశీ చంద్​ రెడ్డి.. సీడబ్ల్యూసీ సభ్యులకు లేఖ రాశారు. రాహుల్​ గాంధీని అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికోవాలని డిమాండ్​ చేశారు.

"రాహుల్​ గాంధీని పార్టీ అధ్యక్షుడి ప్రకటించడంలో ఇంకా ఆలస్యమైతే.. పార్టీ పురోగతికి ఊహకందని హాని జరుగుతుంది. కాంగ్రెస్​ కుటుంబ స్ఫూర్తి దెబ్బతింటుంది. దేశ సేవకు కట్టుబడి ఉన్న మన కార్యకర్తల్లో సందేహాలు మొదలవుతాయి. వాటిని తొలగించి, పార్టీకి ఓ ఆశాకిరణంగా ఉండటానిక రాహుల్​ గాంధీని అధ్యక్షుడిగా తిరిగి ఎన్నుకోవాల్సిందే."

--- చల్లా వంశీ, కాంగ్రెస్​ జాతీయ కార్యదర్శి.

అయితే... పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగితే కాంగ్రెస్​ చీలిపోతుందని.. దాని బదులు అందరూ ఓ ఏకాభిప్రాయానికి వచ్చి ఒకరికి అవకాశమివ్వడం శ్రేయస్కరమని అభిప్రాయపడ్డారు సీనియర్​ నేత సల్మాన్​ ఖుర్షీద్​. అయితే రాహుల్​ గాంధీ ఏ పదవిలో ఉన్నా.. ఆయనకు తమ పూర్తి మద్దతు లభిస్తుందని పేర్కొన్నారు.

దేశ రాజకీయాల్లో రాహుల్​ గాంధీ ఇటీవలి కాలంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. కరోనా వైరస్​, లాక్​డౌన్​, చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా.. పార్టీ నేతలు, యువజన కాంగ్రెస్​ సభ్యుల సహకారాన్ని కూడగడుతున్నారు.

ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 11గంటలకు వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సీడబ్ల్యూసీ సమావేశం జరుగనుంది. పార్టీ కేంద్ర కార్యాలయం మార్పు, కొత్త కమిటీల నియామకం వంటి అంశాలను చర్చించినప్పటికీ... 'నాయకత్వం' హాట్​ టాపిక్​గా మారనుంది.

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.