ETV Bharat / bharat

'ఆర్థిక మంత్రి ఓ కాల నాగు- వెంటనే రాజీనామా చేయాలి'

author img

By

Published : Jul 5, 2020, 7:30 PM IST

TMC MP calls FM "venomous snake", BJP says he's talking "nonsense"
'ఆర్థికమంత్రి ఓ కాల నాగు.. వెంటనే రాజీనామా చేయాలి'

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ను.. తృణమూల్​ కాంగ్రెస్​ ఎంపీ కల్యాణ్​ బెనర్జీ విషపూరిత సర్పంతో పోల్చడం బంగాల్​లో రాజకీయ దుమారం రేపింది. దేశంలో ఆర్థిక వ్యవస్థ కుదేలైన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు కల్యాణ్​. అయితే ఆయన వ్యాఖ్యలు అర్థంలేనివి అని.. ఇలాంటి ఆరోపణలు చేసిన కల్యాణ్​పై కేసు వేస్తామని బంగాల్​ భాజపా శ్రేణులు చెబుతున్నారు.

బంగాల్​లో అధికార తృణమూల్​ కాంగ్రెస్​, ప్రతిపక్ష భాజపా మధ్య మరోమారు మాటల యుద్ధం నెలకొంది. టీఎంసీ ఎంపీ కల్యాణ్​ బెనర్జీ.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ను "విషపూరిత సర్పం"తో పోల్చడంపై భాజపా శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. టీఎంసీ సభ్యులు అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వారిని అదుపులో పెట్టడంలో విఫలమయ్యారని ఆరోపించారు.

'ఆర్థికమంత్రి ఓ కాల నాగు'

పెరుగుతున్న ఇంధన ధరలు, రైల్వే ప్రైవేటీకరణకు నిరసనగా బంకురలో ర్యాలీ నిర్వహించారు కల్యాణ్​ బెనర్జీ. ఈ నేపథ్యంలో నిర్మల రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు.

"ప్రజలను కాటేసి, చంపే కాల నాగు లాగే.. ఆర్థికమంత్రి విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను చంపేస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత దారుణమైన ఆర్థికమంత్రి మన దేశంలో ఉన్నారు. నిర్మల వెంటనే రాజీనామా చేయాలి."

-- కల్యాణ్​ బెనర్జీ, తృణమూల్​ కాంగ్రెస్​ ఎంపీ.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపైనా తీవ్ర విమర్శలు చేశారు కల్యాణ్​. నూతన భారతాన్ని సృష్టిస్తానని వాగ్దానం చేసిన మోదీ.. దేశ జీడీపీ వృద్ధి రేటును అమాంతం తగ్గించి.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.

'అవన్నీ అర్థం లేని మాటలు...'

కల్యాణ్​ బెనర్జీ వ్యాఖ్యలను భాజపా శ్రేణులు తిప్పికొట్టారు. కల్యాణ్​ బెనర్జీపై కేసు వేస్తామని తెలిపారు.

"టీఎంసీ నిలువెల్లా అవినీతి మయమైపోయింది. పార్టీ అంతర్గత కలహాలతో తీవ్ర ఒత్తడికి లోనయ్యి.. నేతలు అర్థంలేని మాటలు మాట్లాడుతున్నారు. పార్టీలో పరిస్థితులను కప్పిపుచ్చడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మేము ఇలాంటివి పట్టించుకోము."

-దిలీప్​ ఘోష్​,భాజపా రాష్ట్ర అధ్యక్షుడు.

కల్యాణ్​ బెనర్జీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు భాజపా అధికార ప్రతినిధి సంబిత్​ పాత్ర.

"దుర్గామాతను పూజించే రాష్ట్రం నుంచి వచ్చిన వ్యక్తి కల్యాణ్​. మమతా బెనర్జీ కూడా ఓ మహిళే. ఆమె వెంటనే ఆయనపై చర్యలు చేపట్టాలి. కానీ మమతా బెనర్జీ అలా చేస్తారని అనుకోవడం లేదు."

-- సంబిత్​ పాత్ర, భాజపా ప్రతినిధి.

ఇదీ చూడండి:- కొవ్వొత్తుల కర్మాగారంలో పేలుడు.. ఏడుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.