ETV Bharat / bharat

వలసకూలీల ఉపాధి కల్పనపై సుప్రీం తీర్పు వాయిదా

author img

By

Published : Jun 5, 2020, 6:00 PM IST

వలస కూలీలకు సంబంధించి కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలను అందరినీ 15 రోజుల్లోగా వారివారి స్వస్థలాలకు చేర్చాలని స్పష్టం చేసింది. వలస కూలీల ఉపాధి కల్పనపై జూన్​ 9న తీర్పు ఇవ్వనుంది.

migrant labourers
వలస కార్మికులు

లాక్​డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలను స్వరాష్ట్రాలకు చేర్చడం, వారికి ఉపాధి కల్పన అంశాలపై తీర్పును ఈ నెల తొమ్మిదికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. వలస కార్మికులను వారి సొంత ప్రాంతాలకు తరలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 15 రోజుల సమయం ఇవ్వాలనుకుంటున్నట్లు అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

దేశంలో వలస కూలీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సుమోటోగా స్వీకరించిన సుప్రీం.. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్‌ ఎస్​కే కౌల్, జస్టిస్‌ ఎంఆర్​షా ధర్మాసనం విచారణ చేపట్టింది. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా విచారణ చేపట్టిన ధర్మాసనం.. వారి వివరాల నమోదుకు రిజిస్ట్రేషన్, ఉపాధి కల్పనకు చర్యలు చేపట్టే విధంగా ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయనుంది.

4,200 శ్రామిక్ రైళ్ల ద్వారా..

వలస కూలీలను తరలించేందుకు కేంద్రం తీసుకున్న చర్యలను సుప్రీంకు నివేదించారు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా. జూన్‌ 3 వరకు 4,200 శ్రామిక్‌ రైళ్లను వలసదారుల కోసం నడిపినట్లు కోర్టుకు తెలిపారు. ఇప్పటివరకు.. కోటి మంది వలస కూలీలను స్వరాష్ట్రాలకు చేర్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్రాల నుంచి వచ్చిన వినతుల ప్రకారమే రైళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు కోర్టుకు విన్నవించారు మెహతా.

వలసకూలీలను తరలించేందుకు కేంద్రం నుంచి అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్లు కోర్టుకు వివరించారు.

కేంద్రంతో పాటు ఈ అంశంపై పలు రాష్ట్రాల వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం.. 15 రోజుల గడువు ఇవ్వాలని అనుకుంటున్నట్లు ప్రకటించింది.

ఇదీ చూడండి: సమ్మర్​ స్పెషల్​: సోంపు షర్బత్​ సింపుల్​ రెసిపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.