ETV Bharat / bharat

రైతన్నలతో చర్చలకు ప్రభుత్వం సిద్ధం: అమిత్​ షా

author img

By

Published : Nov 28, 2020, 9:27 PM IST

రైతన్నలతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్రమంత్రి అమిత్​ షా ప్రకటించారు. అన్నదాతల సమస్యలు, డిమాండ్​లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో రైతులు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో అమిత్​ షా ఈ వ్యాఖ్యలు చేశారు.

Ready to deliberate on every problem and demand, assures Home Minister Amit Shah to protesting farmers
రైతన్నలతో చర్చలకు ప్రభుత్వం సిద్ధం: అమిత్​ షా

దేశ రాజధాని రైతుల నిరసనలపై కేంద్ర హోం మంత్రి అమిత్ ‌షా స్పందించారు. ప్రభుత్వం చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. డిసెంబర్‌ 3న కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నేతృత్వంలో చర్చలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అన్నదాతలకు సంబంధించిన ప్రతి సమస్య, డిమాండ్‌ పరిష్కారానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని వెల్లడించారు. శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతులు 'ఛలో దిల్లీ' కార్యక్రమం చేపట్టారు. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లలో నగరంలోనికి వచ్చారు. చట్టాలను వెనక్కి తీసుకొనే వరకు రాజధానిలోనే బైఠాయిస్తామని హెచ్చరించారు. వీరంతా ప్రధాన రహదారుల్లో నిరసన వ్యక్తం చేస్తుండటంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో విశాలమైన స్టేడియాల్లోకి వచ్చి శాంతియుతంగా నిరసన తెలియాలని రైతులతో పోలీసులు చర్చించారు. అందుకు సంసిద్ధత వ్యక్తం చేసినప్పటికీ ఇంకా కొందరు రైతులు రహదారులపైనే ఉన్నారు. నిరసనల్లో ఎక్కువగా పంజాబ్‌ రైతులే ఉండటం గమనార్హం.

'రైతులతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అన్నదాతల ప్రతి సమస్య, డిమాండ్లను మేం పరిష్కరిస్తాం. డిసెంబర్‌ 3న వ్యవసాయ శాఖా మంత్రి చర్చలు చేపడతారు. చలి ఉన్నప్పటికీ చాలా ప్రాంతాల్లో రైతులు హైవేలపై ట్రాక్టర్లు, ట్రాలీల్లోనే ఉన్నారు. విశాలమైన స్టేడియాల్లోకి వారిని తరలించేందుకు దిల్లీ పోలీసులు సిద్ధంగా ఉన్నారు. దయచేసి అక్కడికి వెళ్లండి. అక్కడ కార్యక్రమాలు చేపట్టేందుకు పోలీసులు అనుమతిస్తారు. డిసెంబర్‌ 3కు ముందే చర్చలు చేపట్టాలంటే వెంటనే నిరసనలు ఆపేయండి. మరుసటి రోజే సమావేశానికి నేను హామీ ఇస్తున్నాను' అని అమిత్‌ షా రైతులకు విజ్ఞప్తి చేశారు.

'అది సరికాదు..'

కేంద్ర హోంమంత్రి అమిత్​ షా.. షరతులు పెట్టి చర్చలకు పిలవడం సరికాదని భారతీయ కిసాన్​ యూనియన్​ పంజాబ్​ రాష్ట్ర అధ్యక్షుడు జగ్జిత్​ సింగ్​ పేర్కొన్నారు. ఎలాంటి షరతులు లేకుండా సహృదయంతో చర్చలకు పిలుపునిచ్చి ఉండేదని తెలిపారు. ఆదివారం రైతులతో సమావేశమై.. ప్రభుత్వంతో చర్చించే విషయంపై ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఇదీ చూడండి:- 'దిల్లీలోనే ఉంటాం.. నిరసనలు కొనసాగిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.