ETV Bharat / bharat

'రాజీవ్‌ ఫౌండేషన్‌కు చైనా ఇచ్చిన విరాళం ఏం చేశారు?'

author img

By

Published : Jun 25, 2020, 9:11 PM IST

రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కు చైనా మూడు లక్షల డాలర్ల భారీ విరాళం ఇచ్చిందని ఆరోపించింది భాజపా. ఇంతకీ ఈ మొత్తాన్ని ఎందుకోసం ఖర్చుపెట్టారో ఎవరికైనా తెలుసా అని ప్రశ్నించింది. మధ్యప్రదేశ్‌లో జరిగిన వర్చువల్ ర్యాలీలో భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ వ్యాఖ్యలు చేశారు.

Cong slams BJP for questioning record on national security
'రాజీవ్‌ ఫౌండేషన్‌కు చైనా ఇచ్చిన డబ్బంతా ఏం చేశారు?'

దేశంలో పరిశోధనలు, స్వేచ్ఛాయుత వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు చైనా నుంచి రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌ 2005-06 మధ్య విరాళాలు స్వీకరించడం ఆశ్చర్యపరిచిందని నడ్డా అన్నారు. ‘చైనా ఎంబసీ, ప్రజా గణతంత్ర చైనా నుంచి రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌ 3 లక్షల డాలర్ల విరాళం తీసుకోవడం విస్మయపరిచింది. దేశంలో పరిశోధనలు, స్వేచ్ఛాయుత వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఈ నిధులు ఉపయోగించాలి. ఇక్కడ చాలా అవినీతి జరిగింది. ఈ విరాళంతో ఏయే పరిశోధనలు నిర్వహించారో కాంగ్రెస్‌ పార్టీ చెప్పాలి’ అని ఆయన డిమాండ్‌ చేశారు.

కొవిడ్‌-19, గల్వాన్‌ లోయలో చైనాతో ఘర్షణ అంశాలపై ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ పదేపదే విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ‘భారతీయ జనసంఘ్‌, భాజపా చాలాకాలం ప్రతిపక్షంలో ఉన్నాయి. 1962 యుద్ధం, 1965 బంగ్లాదేశ్‌ విముక్తి పోరాటంలో మేం కేంద్ర ప్రభుత్వానికి బాహాటంగా మద్దతిచ్చాం. కానీ కార్గిల్ ‌యుద్ధం జరిగేటప్పుడు కాంగ్రెస్‌ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేసి దానికి హాజరవ్వలేదు’ అని నడ్డా అన్నారు.

విరాళాల అంశంపై వివరణ ఇవ్వని కాంగ్రెస్‌ బదులుగా భాజపాపై ఎదురుదాడికి దిగింది. చైనా ఆక్రమణ అంశం నుంచి ప్రజలను దారిమళ్లించేందుకు ఆ పార్టీ అవలంభిస్తున్న వ్యూహంగా దీనిని అభివర్ణించింది. రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, ఎంబసీ అధికారులతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటున్న చిత్రాలు ప్రస్తుతం వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి:సరిహద్దు ఘర్షణపై చైనా రాయబారి శాంతి వచనాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.