ETV Bharat / bharat

'కాంగ్రెస్​ వల్ల సొంత పార్టీకే కాదు.. దేశానికే కీడు!'

author img

By

Published : Feb 10, 2021, 10:05 PM IST

PM Modi
'కాంగ్రెస్​ వల్ల సొంత పార్టీకే కాదు.. దేశానికే కీడు!'

సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల పట్ల పార్లమెంటు, ప్రభుత్వం చాలా గౌరవం కల్గిఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చకు లోక్‌సభలో సమాధానమిచ్చిన మోదీ.. రైతులు పాత వ్యవసాయ మార్కెటింగ్‌ వ్యవస్థలను అనుసరిస్తామని భావిస్తే ఆ దిశగా వెళ్లవచ్చని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా.. కాంగ్రెస్‌ పార్టీపై ఘాటు విమర్శలు చేసిన ప్రధాని.. దేశాన్ని విభజించి, గందరగోళపరిచే కాంగ్రెస్‌.. సొంత పార్టీకి మాత్రమే కాకుండా దేశానికి కూడా ఏ మేలుచేయదని మండిపడ్డారు.

నూతన వ్యవసాయ చట్టాలపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అభయమిచ్చారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చకు సమాధానమిచ్చిన ప్రధాని... ఈ ప్రసంగం దేశ సంకల్ప శక్తిని చాటిచెప్పిందని అన్నారు. భారత్‌ గొప్ప శక్తిగా ఎదిగేందుకు కృషి చేస్తోందని తెలిపిన మోదీ.. ఆ దిశగానే ఆత్మనిర్భర్‌ భారత్‌ నినాదాన్ని తీసుకువచ్చినట్లు వెల్లడించారు. ఔషధ తయారీ రంగంలో దేశం ఇప్పటికే ఆత్మనిర్భర్‌ సాధించిందని, భారత్‌ ప్రపంచానికి ఆశాకిరణంగా మారిందని మోదీ తెలిపారు.

అందుకే కొత్త చట్టాలు..

కరోనా నుంచి దేశ ప్రజల ప్రాణాలను దేవుడే కాపాడాడన్న ప్రధాని.. ముందుండి పోరాటం చేసిన వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులే ఆ దేవుళ్లేనని అభివర్ణించారు. కొవిడ్​ తర్వాత దేశ ప్రజల ప్రణాళికలు మారాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలపై స్పందించిన ప్రధాని.. దేశ వ్యవసాయ రంగాన్ని మార్చడానికే వీటిని తెచ్చినట్లు వివరించారు. చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల పట్ల గౌరవం ఉందని, వారితో చర్చలకు సిద్ధమని మరోసారి ప్రకటించారు. రైతులు పాత వ్యవసాయ మార్కెటింగ్‌ చట్టాలను పాటిస్తామని కోరుకుంటే పాటించవచ్చని స్పష్టం చేశారు. సాగు చట్టాలపై తన సమాధానం సమయంలో కాంగ్రెస్ లోక్‌సభ నుంచి వాకౌట్‌ చేయగా.. ఆ పార్టీ వైఖరి పట్ల ప్రధాని ఘాటు విమర్శలు చేశారు. రాజ్యసభలో కాంగ్రెస్‌ సీనియర్‌లు తన ప్రసంగం వింటూ ఉంటే లోక్‌సభలో ఆ పార్టీ వాకౌట్‌ చేసిందని మండిపడ్డారు. దేశాన్ని విభజించి, గందరగోళపరిచే కాంగ్రెస్‌.. సొంత పార్టీకే కాకుండా, దేశానికి కూడా ఏ మేలు చేయదని విమర్శించారు.

లోక్​సభలో మోదీ ప్రసంగం

"కరోనా సమయంలో మూడు వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చాం. సాగును బాగు చేసే చర్యలను కొనసాగించడం చాలా అవసరం, కీలకం. అనేక సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సవాళ్ల నుంచి వ్యవసాయ రంగాన్ని బయటకు తీసుకువచ్చేందుకు నిరంతరం ప్రయత్నం చేయాలి. వ్యవసాయరంగం భవిష్యత్తులో ఎదుర్కోబోయే సవాళ్లను ఇప్పటి నుంచే ఎదుర్కోవాలి. వ్యవసాయ చట్టాలపై లోక్‌సభలో చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ సభ్యులను చూశాను.

అయితే.. వారు చట్టాల రంగు నలుపా లేక తెలుపా అన్న దానిపై మాత్రం చాలా చర్చ జరిపారు. దానికంటే చట్టాల్లోని విషయం గురించి, ఉద్దేశాల గురించి చర్చ జరిపితే బాగుండేది. దానివల్ల రైతులకు కూడా మంచి సందేశం వెళ్లి ఉండేది. ఆందోళన చేస్తున్న ప్రతి రైతు భావనను ఈ సభ, ప్రభుత్వం గౌరవిస్తుంది. సాగు చట్టాల్లో ఏవైనా లోపం ఉన్నా, దాని వల్ల రైతులకు నష్టం కల్గుతుందని భావించినా వాటిని మార్చడానికి అభ్యంతరం ఏముంటుంది.?"

- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

ఇదీ చదవండి: 'అధికార మార్పును కోరుకోవడం లేదు- చర్చలకు సిద్ధమే'

భారత్​ను ఉన్నత స్థానంలో నిలిపే సంకల్పం దిశగా..

2022లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని గుర్తు చేశారు ప్రధాని. ఈ కార్యక్రమం నేపథ్యంలో అభివృద్ధి దిశగా ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకోవాలని సూచించారు. 2022 నుంచి వందేళ్ల వేడుకలు జరిగే 2047 వరకు ప్రపంచంలో భారత్‌ను సమున్నత స్థానంలో నిలిపే ఆలోచనలు చేయాలని పిలుపునిచ్చారు.

"75వ స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహించుకునే దిశగా భారత్ చాలా దగ్గరగా ఉంది. 75వ స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించుకోవడం ప్రతి భారతీయుడికి గర్వకారణం మాత్రమే కాదు.. మరింత ముందుకు సాగేలా చేసుకునే ఉత్సవం కూడా. అందువల్ల మనం సమాజ వ్యవస్థలో ఎక్కడున్నా, దేశంలోని ఏ మూలన ఉన్నా.. సామాజిక, ఆర్థిక వ్యవస్థలో మన స్థానం ఎక్కడ ఉన్నా సరే.. కానీ 75వ స్వాతంత్ర్య వేడుకల ద్వారా కొత్త ప్రేరణను పొంది, కొత్త సంకల్పం తీసుకుని వందేళ్ల స్వాతంత్ర్య వేడుకలు జరిగే 2047 వరకు.. 25ఏళ్లలో దేశాన్ని ఎక్కడికి తీసుకువెళ్లాలో సంకల్పం తీసుకోవాలి. ప్రపంచంలో భారత్‌ స్థానాన్ని ఎక్కడ ఉంచాలో సంకల్పించుకోవాలి. ఈ సంకల్పం ప్రతి భారతీయుడి హృదయంలో ఉండాలి. ఈ వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ఈ పవిత్ర భూమిపై ఉంది."

- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత్‌ ఓ దేశంగా ఎదగలేదన్న బ్రిటీషు వారి మాటలను తప్పని నిరూపించామని మోదీ అన్నారు.

ఇదీ చదవండి: 'సాగు చట్టాల వల్ల ఏం నష్టం జరిగింది?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.