ETV Bharat / bharat

లాభదాయకంగా పసుపు సేంద్రీయ సాగు

author img

By

Published : Dec 19, 2020, 8:05 AM IST

organic cultivation, turmeric, odisha farmers
లాభదాయకంగా పసుపు సేంద్రీయ సాగు

పసుపు కేవలం ఆరోగ్యప్రదాయినే కాదు ఎందరికో జీవనాధారం కూడా. ఇందుకు ఒడిశాలోని కోరాపుట్​ జిల్లా రైతులే ఉదాహరణ. తరాల నుంచి పసుపును సాగు చేస్తూ లభాలబాటలో నడుస్తున్నారు. సేంద్రీయ పద్ధతిని అనుసరిస్తున్న రైతులను ప్రోత్సహించేందుకు ఓఆర్ఎంఏయస్ అధికారులు ఇటీవలె ప్రాససింగ్ యూనిట్​లను నెలకొల్పారు.

లాభదాయకంగా పసుపు సేంద్రీయ సాగు

ఎన్నో సుగుణాలు కలిగిన పసుపును...భారత్‌లో ఎక్కువగా వంటకాల్లో వినియోగిస్తారు. పసుపు వేయని కూర కంటికింపుగా కనిపించదనడం అతిశయోక్తి కాదు. పసుపులోని ఔషధ గుణాలు...శరీరంలో రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయి. ఇన్ని విలువలున్న పసుపు...ఒడిశా, కోరాపుట్ జిల్లాలోని కొండప్రాంతంలో ఉన్న తిమజోలా గ్రామస్థులకు బతుకుదెరువునిస్తోంది. ఈ గ్రామంలో ఉండే దాదాపు 100 కుటుంబాల్లో ఎక్కువశాతం పసుపునే పండిస్తారు. ఎన్నో తరాలుగా పసుపు సాగే వీరికి జీవనాధారం. తాతలు, ముత్తాతల కాలం నుంచి ఇదే సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. అది కూడా ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా, పూర్తి సేంద్రీయ పద్ధతుల్లోనే. గ్రామంలోని 70 నుంచి 80 ఎకరాల్లో పండించే పసుపు అంతా....పాతకాలం నాటి సంప్రదాయ పద్ధతుల్లోనే సాగవుతోందని గ్రామరైతులు చెప్తున్నారు. సేంద్రీయ ఎరువులు వాడి పండించిన ఈ పసుపునకు..రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలో మంచి డిమాండ్ ఉంది. గ్రామస్థులూ మంచి లాభాలే ఆర్జిస్తున్నారు.

"మొదట్లో వ్యాపారులు మా వద్ద పసుపు కొనుగోలు చేసేవారు. గతేడాది నుంచే అటవీశాఖ అధికారులు అన్ని గ్రామాల రైతుల నుంచి పసుపు పంట కొంటున్నారు."

-- సుకాంతి పాస్కా, పసుపురైతు

"అటవీ శాఖ నుంచి గతేడాది మా పంటకు మంచి ధర లభించింది. పోయినసారి 90 రూపాయలకు అమ్మితే, ఈసారి 100 రూపాయలకు కొనుగోలు చేశారు. కానీ మంచి లాభాలు రాలేదు. మా బ్యాంకు అకౌంట్లలో డబ్బు వేస్తారు."

--భవానీ పాస్కా, పసుపురైతు

లక్ష్మీపూర్‌లో పండే పసుపులో నూనెశాతం ఎక్కువ. ఎలాంటి రసాయన ఎరువులూ వాడకుండా పండిస్తున్నందున పుష్కలమై ఔషధ గుణాలుండే ఈ పసుపునకు వినియోగదారుల నుంచి విపరీతమైన డిమాండ్ వస్తోంది. తిమజోలా సహా...మరో 30 గ్రామాల్లోని రైతులు ఈ పద్ధతులనే అనుసరించి పసుపు సాగు చేస్తున్నారు. ఏడాదికి 100 టన్నులకు పైగా పసుపు...ఈ ప్రాంతం నుంచి దేశంలోని వివిధ మార్కెట్లకు చేరుతోంది. 5.67 నుంచి 6.64శాతం కర్క్యుమిన్ ఉంటుందని ఒడిశా గ్రామీణాభివృద్ధి, మార్కెటింగ్ సంఘం.. ఓఆర్​ఎంఏయస్​ జిల్లా అధ్యక్షుడు రోషన్ కార్తీక్ చెప్తున్నారు. నాణ్యతపరమైన పరీక్షల కోసం లఖ్‌నవూలోని సీఎస్​ఆర్​, ఎన్​బీఆర్ఐ శాస్త్రవేత్తల వద్దకు పంపిస్తున్నట్లు చెప్పారు. సేంద్రీయ పద్ధతుల్లో పసుపు సాగు చేస్తున్న రైతులను ప్రోత్సహించేందుకు ఓఆర్​ఎంఏయస్ అధికారులు...బాయిలర్, డ్రైయర్ యంత్రాలతో ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పారు.

"అప్పటితో పోలిస్తే...ఇప్పుడు రైతులకు మంచి లాభాలు వస్తున్నాయి. ప్రాసెసింగ్ బాగా జరుగుతోంది. నాణ్యతలో ఎలాంటి లోపం రాకుండా చూస్తున్నారు. నాణ్యమైన పసుపు ఉత్పత్తి చేస్తున్నందునే ఒడిశా సహా...ఇతర ప్రాంతాల్లోనూ తిమజోలా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది."

--వసంత్ ప్రధాన్, వలంటీరు

"బాయిలర్, డ్రయ్యర్‌లతో ప్రాసెసింగ్ కేంద్రం ఏర్పాటు చేసింది జిల్లా యంత్రాంగం. మౌలిక సదుపాయాలు, యంత్రాలు ఇప్పటికే వారికి అందుబాటులో ఉన్నాయి. ఈ పసుపునకు మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పిస్తున్నాం. ఎక్కువ సంపాదించేందుకు రైతులకూ ఉపయోగకరంగా ఉంటోంది."

-- రోషన్ కార్తిక్, ఓఆర్‌ఎంఏఎస్ జిల్లా అధికారి

పుష్కలమైన ఔషధ గుణాలున్న పసుపు...ప్రజలకు ఆరోగ్యప్రదాయిని. పండించిన రైతులకు మంచి ఆదాయ వనరు. స్థానిక మార్కెట్లలోనే కాదు...విదేశీ మార్కెట్లలోనూ ఈ ఆర్గానిక్ పసుపు గుర్తింపు తెచ్చుకుంది. ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఇతర సదుపాయాలు కల్పించి, సేంద్రీయ పసుపు సాగును ప్రోత్సహించాలని రైతులు కోరుకుంటున్నారు.

ఇదీ చదవండి : బంగాల్ చేరుకున్న అమిత్ షా- 2 రోజుల పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.