ETV Bharat / bharat

ఆమె రొట్టెలకు భలే గిరాకీ.. 200 మందికి ఉపాధి

author img

By

Published : Nov 21, 2020, 10:32 AM IST

Updated : Nov 21, 2020, 10:47 AM IST

ఉత్తర కర్ణాటకలోని ఓ ప్రాంతం వివిధ రకాల రొట్టెలకు ప్రసిద్ధి. ఇక్కడి మహిళలు రకరకాల రొట్టెలు తయారుచేయడంలో సిద్ధహస్తులు. ఒక్క నిర్ణయం జీవితాన్నే మార్చేస్తుందనేందుకు ఈ గాథ నిదర్శనం. ఖాళీ జేబు, ఆకలితో ఉన్న కడుపు జీవిత పాఠాలు నేర్పిస్తుందన్న మాటలు నిజమని నిరూపిస్తోంది ఓ మహిళ. రొట్టెలు చేసి తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్న మహాదేవి.. ఎంతోమంది మహిళలకు జీవనాధారం కల్పించింది.

KARNATAKA LADY MAHADEVI
ఆమె రొట్టెలకు భలే గిరాకీ.. 200 మందికి ఉపాధి

రొట్టెల వ్యాపారంతో 200 మందికి ఉపాధి కల్పిస్తున్న మహాదేవి

కర్ణాటలోని కాలాబర్గికి చెందిన మహాదేవి.. చిన్నవయసులోనే భర్తను కోల్పోయింది. ఆ సమయంలో ఇద్దరు పిల్లలతో జీవితాన్ని నెట్టుకురావడం చాలా కష్టంగా మారింది ఆమెకు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న మహాదేవి.. ఓసారి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. అయితే.. ముఘల్కోడ్​కు చెందిన ఓ స్వామీజీ ఆమెలో ధైర్యం నింపి, రొట్టెలు అమ్ముకుని జీవనం సాగించాలని సలహా ఇచ్చాడట. ఆయన ఆశీస్సులతో రొట్టెల తయారీ ప్రారంభించిన మహాదేవి.. ప్రస్తుతం 200 మంది మహిళలు తమ కాళ్లపై తాము నిలబడగలిగేలా చేసింది.

"32 ఏళ్ల నుంచీ నేనీ పని చేస్తున్నాను. జొలిగే అప్పోరా ఆశీర్వాదంతో రొట్టెలు చేయడం ప్రారంభించాను. నాదగ్గర ప్రస్తుతం 150 నుంచి 200 మంది వరకు పనిచేస్తున్నారు."

- మహాదేవి, యజమాని

రూ. 3కే రొట్టె..

మహాదేవి వంటశాలలోని మహిళలు వేల కొద్దీ రొట్టెలు, చపాతీలు, ధపాతీలు, హోలిగే తయారుచేస్తారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో సాధారణంగా ఒక్కో రొట్టెను 10 నుంచి 12 రూపాయలకు విక్రయిస్తారు. కానీ.. మహాదేవి 3 రూపాయలకే ఒక రొట్టె అందిస్తోంది. ఈ పనిని ఓ సేవగా భావిస్తున్న ఆమె.. భోజనం కొనుక్కునే స్థోమత లేనివారికి ఉచితంగానే రొట్టెలు అందిస్తోంది. ఆకలితో బాధపడేవారెవరూ ఉండొద్దన్నదే తన లక్ష్యమని చెప్తోంది మహాదేవి. విద్యార్థులకైతే ఒక రూపాయి లేదా రెండు రూపాయలకే రొట్టెలు అమ్ముతోంది.

విదేశీయులూ మెచ్చి..

ఏ హోటల్లో అయినా ఒక పూట భోజనానికి కనీసం 60 నుంచి 70 రూపాయలు ఖర్చవుతుంది. కానీ.. మహాదేవి దగ్గర అయితే 20 రూపాయల్లోపే ఎవరైనా కడుపునిండా తినొచ్చు. ఈ రొట్టెలు కాలాబర్గిలోనే కాదు.. ఇతర జిల్లాల్లోనూ ప్రత్యేకత చాటుకుంటున్నాయి. విదేశాల్లో నివసించే వాళ్లు సైతం ఇక్కడి నుంచి రొట్టెలు కొనుగోలు చేసి తమతో తీసుకెళ్తారు.

"200 మంది వరకు ఇక్కడ పనిచేస్తున్నారు. మా యజమాని మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. ఇక్కడ ఉద్యోగంలో చేరిన తర్వాత నా కుటుంబాన్ని గౌరవప్రదంగా పోషించుకోగలుగుతున్నాను. నా కుటుంబం ఆర్థికంగా స్థిరపడింది."

- రొట్టెల తయారీదారు

కొన్నేళ్ల క్రితం కుంగుబాటుకు గురై.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న మహాదేవి.. సొంతంగా ఓ కంపెనీ ఏర్పాటు చేయడమే కాకుండా.. 200 మంది మహిళలకు ఉపాధి కల్పించడం అభినందనీయం.

ఇదీ చదవండి: 25 ఏళ్లపాటు కాసే 'డ్రాగన్​ఫ్రూట్స్​' గురించి తెలుసా?

Last Updated : Nov 21, 2020, 10:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.