ETV Bharat / bharat

నడిరేయిలో 'పృథ్వీ-2' ప్రయోగం విజయవంతం

author img

By

Published : Oct 16, 2020, 10:27 PM IST

అణ్వాయుధాలు మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న పృథ్వీ-2 క్షిపణిని మరోసారి రాత్రి పూట పరీక్షించింది భారత సైన్యం. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ క్షిపణి.. ఒడిశాలోని బాలాసోర్​ టెస్ట్​ రేంజ్​ నుంచి విజయవంతంగా పరీక్షించారు. చీకట్లో క్షిపణి తీరును పర్యవేక్షించినట్లు అధికారులు స్పష్టం చేశారు.

Prithvi-2 missile
నడిరేయులో పృథ్వీ-2 అణుక్షిపణి ప్రయోగం

నడిరేయిలో పృథ్వీ-2 క్షిపణి ప్రయోగం మరోసారి విజయవంతమైంది. అణ్వాయుధాలు మోసుకెళ్లే సత్తా ఉన్న ఈ క్షిపణిని.. శుక్రవారం ఒడిశా బాలాసోర్​లోని చాందీపుర్​ టెస్ట్​ రేంజ్​ నుంచి ప్రయోగించింది భారత సైన్యం. లాంచ్ కాంప్లెక్స్-3 నుంచి ఓ మొబైల్ లాంచర్ ద్వారా క్షిపణిని పరీక్షించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రయోగాన్ని డీఆర్​డీఓ పర్యవేక్షించింది. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ అని.. క్షిపణి వెళ్లే మార్గాన్ని రాడార్లు, ఎలెక్ట్రో ట్రాకింగ్ సిస్టమ్​ల ద్వారా పరిశీలించామని డీఆర్​డీఓ అధికారులు తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్​ 24న, గతేడాది నవంబర్​ 20న పృథ్వీ క్షిపణిని చీకటిలోనే పరీక్షించారు.

సత్తా అదుర్స్​..

పూర్తి స్వదేశీ సాంకేతికతతో తయారైన ఈ క్షిపణి.. ద్రవ ఇంధనం(లిక్విడ్ ప్రొపల్షన్​)తో నడుస్తుంది. 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సునాయసంగా మట్టుబెట్టగలదు. ఉపరితలం నుంచి ఉపరితల లక్ష్యాలను ఛేదించగల తొలి వ్యూహాత్మక క్షిపణి ఇదే. అంతేకాదు రెండు ఇంజిన్​లు కలిగిన పృథ్వీ-2 క్షిపణి.. 500-1000 కిలోల వార్​హెడ్లను మోసుకెళ్లగలదు. లక్ష్యాలను ఛేదించడానికి అధునాతన ట్రాజెక్టరీ వ్యవస్థ ఇందులో ఉంది. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్​మెంట్​ ప్రోగ్రామ్​ ద్వారా పృథ్వీ క్షిపణిని 2003లో సైన్యానికి అందించింది డీఆర్​డీఓ.

ఇదీ చూడండి: డీఆర్​డీఓ 'స్మార్ట్​' ప్రయోగం విజయవంతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.