ETV Bharat / bharat

'ఉల్లి ధరల కట్టడికి మార్కెట్లోకి లక్ష టన్నుల బఫర్​ స్టాక్​'

author img

By

Published : Oct 29, 2020, 11:23 AM IST

ఆకాశానంటుతున్న ఉల్లి ధరల నుంచి ఉపశమనం కల్పించేందుకు కేంద్రం వద్ద ఉన్న లక్ష టన్నుల స్టాక్​ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు చెప్పారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​. సరైన సమయంలో ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించి.. దిగుమతులకు మార్గం సుగమం చేసినట్లు తెలిపారు.

Narendra Singh Tomar
నరేంద్ర సింగ్​ తోమర్​

దేశంలో ఉల్లి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ధరల నియంత్రణకు చర్యలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ప్రజలకు ధరల నుంచి ఉపశమనం కల్పించేందుకు గానూ కేంద్ర నిల్వలు (బఫర్​ స్టాక్​) నుంచి లక్ష టన్నుల ఉల్లిని మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​.

మధ్యప్రదేశ్ ఇండోర్​ జిల్లా ధర్మపురిలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు తోమర్​.

" ఉల్లి ధరల పెరుగుదలపై కేంద్రం ఇప్పటికే చర్యలు చేపట్టింది. నాఫెడ్​ ద్వారా కేంద్రం ఆధ్వర్యంలోని లక్ష టన్నుల బఫర్​ స్టాక్​ను విడుదల చేయనున్నాం. సరైన సమయంలో ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించాం. అలాగే దిగుమతులకు మార్గం సుగమం చేశాం."

- నరేంద్ర సింగ్​ తోమర్​, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి.

నూతన వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్​ రెండు నాలుకల ధోరణి అవలంబిస్తోందని ఆరోపించారు తోమర్. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు తమ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకునే వీలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.

పవార్​ విమర్శలు

కేంద్ర ప్రభుత్వ విధానాల ద్వారానే దేశంలో ఉల్లి ధరలు ఆకాశానంటుతున్నాయని ఆరోపించారు ఎన్​సీపీ అధినేత, కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి శరద్​ పవార్​. వ్యాపారుల వద్ద ఉల్లి నిల్వలపై విధించిన నిషేధంపై కేంద్రంతో మాట్లాడనున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి: రాష్ట్రాలకు కేంద్రం 'ఉల్లిపాయల ఆఫర్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.