ETV Bharat / bharat

'2015 నుంచి రైతుల ఆదాయ లెక్కలు లేవు'

author img

By

Published : Sep 24, 2020, 8:12 AM IST

వ్యవసాయ కుటుంబాల ఆదాయానికి సంబంధించి అందుబాటులో ఉన్న తాజా సమాచారం 2012-13 నాటి ఎన్​ఎస్​ఓ సర్వే మాత్రమేనని కేంద్రం స్పష్టం చేసింది. 2015 నుంచి రైతుల ఆదాయ పెరుగుదలపై ఎలాంటి అంచనాలు అందుబాటులో లేవని తెలిపింది.

thomar
నరేంద్రసింగ్ తోమర్

వ్యవసాయ కుటుంబాల ఆదాయం ఏటా ఎంతమేర పెరిగిందన్న అంచనాలు 2015 నుంచి అందుబాటులో లేవని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు. రైతు కుటుంబాల ఆదాయానికి సంబంధించి అందుబాటులో ఉన్న తాజా సమాచారం 2012-13 నాటి ఎన్​ఎస్​ఓ సర్వే మాత్రమేనని స్పష్టం చేశారు.

2015 నుంచి వ్యవసాయ కుటుంబాల ఆదాయం ఏటా ఎంతమేర పెరిగింది? రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన ప్రభుత్వం అందుకు ఏ సంవత్సర ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకుంది? 2024 నాటికి లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏటా రైతు ఆదాయం ఎంత మేర వృద్ధి చెందాలి? రైతు ఆదాయం రెట్టింపు లక్ష్యాన్ని 2022 నుంచి 2024కి మార్చడానికి కారణమేంటి? అని కాంగ్రెస్ సీనియర్ ఎంపీ కపిల్ సిబల్ అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు తోమర్ ఈ మేరకు సమాధానమిచ్చారు.

"2012-13లో జాతీయ సాంఖ్యక కార్యాలయం వ్యవసాయ కుటుంబాల ఆదాయ పరిస్థితులపై నిర్వహించిన సర్వేలో వెల్లడైన సమాచారాన్ని బట్టి 2015-16ను ప్రామాణిక సంవత్సరంగా తీసుకొని 2022కల్లా ఆదాయాన్ని రెట్టింపు చేయాలని 'రైతుల ఆదాయ రెట్టింపు కమిటీ' లక్ష్యాన్ని నిర్దేశించింది. స్థిర ధరల ప్రకారం ప్రామాణిక సంవత్సరం నుంచి ఏటా రైతుల ఆదాయం 10.4 శాతం మేర వృద్ధి చెందుతుందని అంచనా వేసి 2022కల్లా ఆదాయాన్ని రెట్టింపు చేయొచ్చని భావించి దాన్ని లక్ష్యంగా నిర్ణయించింది. అందువల్ల ఈ లక్ష్యాన్ని 2022 నుంచి 2024కి మార్చే ప్రతిపాదన ఏమీ లేదు."

- నరేంద్రసింగ్ తోమర్

ఏపీ బకాయిలు..

2019 ఖరీఫ్ పంటలకు సంబంధించిన ప్రధానమంత్రి ఫసల్​ బీమా యోజన కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.1,302.65 కోట్ల సబ్సిడీ చెల్లించాలని ఉన్నట్లు తోమర్ తెలిపారు. రాష్ట్రం తన వాటా కింద రూ.1,335.92 కోట్ల సబ్సిడీ చెల్లించాలని ఉండగా ఇప్పటివరకూ కేవలం రూ.33.27 కోట్లు మాత్రమే చెల్లించినట్లు చెప్పారు.

తెలంగాణ బకాయిలు..

తెలంగాణ ప్రభుత్వం 2018 ఖరీఫ్ నుంచి 2019-20 రబీ సీజన్ వరకు రూ.467.39 కోట్ల సబ్సిడీ చెల్లించాల్సి ఉన్నట్లు వెల్లడించారు. 2018 ఖరీఫ్​లో రూ.143.53 కోట్లు, 2018-19 రబీలో రూ.9.03 కోట్లు, 2019 ఖరీఫ్​లో రూ.291.02 కోట్లు, 2019-20 రబీలో రూ.23.82 కోట్ల సబ్సిడీ మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు.

యూరియా కొరత లేదు..

ఈ ఏడాది ఖరీఫ్​ సీజన్​లో ఏ రాష్ట్రానికి యూరియా కొరత రాలేదని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానంద గౌడ తెలిపారు. ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం 6.67 లక్షల మెట్రిక్ టన్నులు అడిగితే 8.83 లక్షల టన్నులు (32.38 శాతం అధికం) అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం 8.93 మెట్రిక్ టన్నులు అడిగితే 10.98 లక్షల మెట్రిక్​ టన్నులు (22.95 శాతం అధికం) సరఫరా చేసినట్లు పేర్కొన్నారు.

దేశంలో అన్ని రాష్ట్రాలూ కలిపి154.43 లక్షల మెట్రిక్ టన్నులు కోరగా 204.28 (32.27 శాతం) లక్షల టన్నులు అధికంగా సరఫరా చేసినట్లు చెప్పారు.

ఇదీ చూడండి: ఖగోళంలో ప్రపంచ దేశాల 'ఖనిజాల వేట'!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.