ETV Bharat / bharat

రాహుల్​తో పొసగకే పొగ రాజేత- ఆ లేఖకు కారణమిదే!

author img

By

Published : Aug 25, 2020, 9:55 AM IST

Congress leaders are dissent against Rahul Gandhi
రాహుల్​తో పొసగకే పొగ రాజేత

కాంగ్రెస్​ పార్టీలో మరోసారి నాయకత్వ సంక్షోభం నెలకొంది. పార్టీకి చెందిన కొందరు సీనియర్​ నేతలు నాయకత్వ మార్పిడిపై అధినేత్రి సోనియాకు లేఖ రాయడం చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆ నాయకులు ఆ లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది? కాంగ్రెస్​లో వారికి వచ్చిన ఇబ్బందులు ఏమిటి? రాహుల్​కు ఆ సీనియర్​ నాయకులకు పొసగట్లేదు అనడంలో వాస్తవమెంత?

అంతర్గత సంక్షోభాలు, అసమ్మతి రాజకీయాలు కాంగ్రెస్​కు కొత్తేమీ కాదు. ప్రస్తుతమూ అలాంటి పరిస్థితే నెలకొంది. పార్టీని సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలని కోరుతూ.. 23 మంది ప్రముఖ నేతలు అధ్యక్షురాలికి లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. లేఖలోని విషయాల మాట ఎలా ఉన్నా రాహుల్​ గాంధీతో వారికి అంతగా సత్సంబంధాలు లేకపోవడం ఇందుకు ఓ కారణంగా కనిపిస్తోంది.

అదే ఆసక్తికరం..

రాజకీయ వర్గాల విశ్లేషణ ప్రకారం.. పార్టీలో తమ స్థానాన్ని కాపాడుకోవడానికే వారు అసమ్మతి గళాన్ని వినిపించినట్టు తెలుస్తోంది. రాహుల్​ గాంధీ మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపడితే తమ పదవికి ముప్పు కలుగుతుందన్న భావనతోనే వారు ఈ లేఖ రాసినట్టుంది. రాహుల్​కు మళ్లీ పార్టీ బాధ్యతలు అప్పగించాలని పార్టీలో ఒక వర్గం గత కొంతకాలంగా డిమాండ్​ చేస్తోంది. అయితే అందుకు ఆయన నిరాకరిస్తూ వస్తున్నారు. సోదరి ప్రియాంక గాంధీ వాద్రా కూడా తాను ప్రధాన కార్యదర్శి పదవికే పరిమితమవుతానని, అంతకుమించి బాధ్యతలు తీసుకోనని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 'గాంధీ కుటుంబ సభ్యుల ప్రమేయంతో సమష్టి నాయకత్వం' అన్న భావన తెరపైకి వచ్చింది. దీనికి 23 మంది నాయకులు రాసిన లేఖ తోడైనందున పార్టీలోని విభేదాలు బహిర్గతమయ్యాయి. ఈ లేఖపై ఏ నాయకుడు ఏ కారణంతో సంతకం చేశారన్న అంశం ఆసక్తికరంగా మారింది.

గులాంనబీ ఆజాద్​:

రాజ్యసభలో విపక్షనేతగా వ్యవహరిస్తున్నారు. ఆయన పదవీకాలం 2021 ఫిబ్రవరి 10తో పూర్తవుతుంది. ఎగువసభకు మళ్లీ ఎన్నికయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఆయన తరవాత మల్లికార్జున ఖర్గేకు విపక్షనేత పదవి అప్పగించాలని రాహుల్​ గాంధీ భావిస్తున్నారు. పార్టీలో తన ఉనికిని కాపాడుకోవడానికే అన్ని స్థాయిల్లో పార్టీని ప్రక్షాళన చేయాలన్న డిమాండుకు మద్దతిచ్చారని తెలుస్తోంది.

మిలింద్​ దేవరా, ముకుల్​ వాస్నిక్​:

మహారాష్ట్రకు చెందిన ఈ ఇరువురు నేతలు గత కొంతకాలంగా రాహుల్​పై అసంతృప్తితో ఉన్నారు. మిలింద్​ దేవరా రాజ్యసభ స్థానాన్ని ఆశించగా.. దాన్ని పి. చిదంబరానికి కట్టబెట్టారు. దేవర కూడా భాజపావైపు చూస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు దళిత నాయకుడైన ముకుల్​ వాస్నిక్​కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని గత కొద్ది నెలలుగా ప్రచారం జరుగుతోంది. ఇది 'ప్రథమ కుటుంబా'నికి నచ్చకపోవడం వల్ల ఆయనకు ప్రాధాన్యం తగ్గించినట్టు తెలుస్తోంది.

రాజ్​బబ్బర్​, కపిల్​ సిబల్​, ఆనంద్​ శర్మ:

రాజ్​బబ్బర్​ రాజ్యసభ పదవీకాలం మే 25తో పూర్తికానుంది. ప్రస్తుతం ఆయన ఉత్తరాఖండ్​ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. మళ్లీ ఎన్నికయ్యే అవకాశాలు లేవు. గత ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తర్​ప్రదేశ్​ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. కపిల్​ సిబల్​, ఆనంద్​ శర్మల రాజ్యసభ పదవీకాలం 2022 వరకు ఉంది. అయితే వారు కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీలో సభ్యులు కారు. వారిపై రాహుల్​ గాంధీకి సదభిప్రాయం లేకపోవడం వల్ల.. పార్టీలో సముచిత స్థానం ఉండదని వారు అనుమానిస్తున్నారు.

జితిన్​ ప్రసాద:

వర్కింగ్​ కమిటీ సభ్యుడైన ఆయన ఉత్తర్​ప్రదేశ్​ పీసీసీ అధ్యక్ష పదవిని ఆశించారు. కానీ దానిని అజయ్​ లల్లూకు ఇచ్చారు. దీంతో రాహుల్​ గాంధీ అధ్యక్షుడైతే పార్టీలో తన స్థానం ఏమిటన్నదానిపై ఆయనలో అనుమానాలున్నాయి.

భూపీందర్​ సింగ్​ హుడా, హరియాణా మాజీ ముఖ్యమంత్రి:

తనకు బద్ధవిరోధి అయిన కుమారీ షెల్జాకు పీసీసీ పదవి ఇవ్వడం.. ఆయనకు ఏమాత్రం ఇష్టంలేదు. ఆ పదవి తనకే ఉండాలని ఆయన ఎప్పటినుంచో కోరుతున్నారు. లేఖపై సంతకాలు చేసిన ఇతర నేతలకు కూడా ఇలాంటి వ్యక్తిగత కారణాలే ఉన్నాయి.

ఇదీ చదవండి: ఆరు నెలల తర్వాతే కాంగ్రెస్​కు కొత్త సారథి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.