ETV Bharat / bharat

సీఎంలతో మోదీ భేటీ- లాక్​డౌన్​ కొనసాగిస్తారా?

author img

By

Published : May 11, 2020, 3:51 PM IST

దేశవ్యాప్తంగా విధించిన 54 రోజుల లాక్​డౌన్​ మరో వారంలో పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు ప్రధాని మోదీ. కరోనాపై పోరులో ఎలాంటి ప్రణాళికలు అమలు చేయాలి, ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణ గురించి చర్చిస్తారు.

PM Narendra Modi
లాక్​డౌన్​పై సీఎంలతో ప్రధాని మోదీ మంతనాలు

కరోనా నేపథ్యంలో విధించిన లాక్​డౌన్​ పొడిగించాలా? వద్దా అనే అంశంపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొన్నారు ప్రధాని మోదీ. లాక్‌డౌన్‌-3 మరో వారం రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ఈ భేటీపైనే అందరి దృష్టి ఉంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 4,200 కేసులు నమోదవ్వడం వల్ల మహమ్మారి కట్టడిపై మరిన్ని వ్యూహాలు రచించనున్నారు.

లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి ఐదోసారి సీఎంలతో సమావేశమయ్యారు మోదీ. తాజా వీడియో కాన్ఫరెన్స్‌ రెండు సెషన్ల వారీగా నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు తొలి సెషన్‌, సాయంత్రం 6 గంటల నుంచి రెండో సెషన్‌ ఉంది.

గతంలో నాలుగు సార్లు జరిగిన సమావేశంలో కొంతమంది సీఎంలకు మాత్రమే మాట్లాడే అవకాశం దక్కింది. ఈ రోజు సమావేశంలో అందరు సీఎంలకూ మాట్లాడే అవకాశం కల్పించనున్నట్టు సమాచారం. అయితే, లాక్‌డౌన్‌ను కొనసాగిస్తారా? సడలిస్తారా? అని దేశ ప్రజలంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

ఆర్థిక వ్యవహారాల అంశాలను పలు రాష్ట్రాలు.. ప్రధాని వద్ద ప్రస్తావించనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి పెంపు, ఎంఎస్‌ఎంఈ సహా పారిశ్రామిక రాయితీల అంశాలను ప్రధాని వద్ద లేవనెత్తే అవకాశం ఉంది. దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కేసుల తీవ్రతను బట్టి జోన్ల వారీగా కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ ఈ సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.