ETV Bharat / bharat

'మీడియాకు ప్రభుత్వాల బకాయిలు రూ.1,800 కోట్లు'

author img

By

Published : May 20, 2020, 7:13 PM IST

జర్నలిస్టుల సంఘాలు సుప్రీంకోర్టులో వేసిన వ్యాజ్యాలపై భారతీయ వార్తాపత్రికల సంఘం వివరణ ఇచ్చింది. లాక్​డౌన్​ కారణంగా మీడియా సంస్థలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని.. ఫలితంగా ఉద్యోగులపై వేటు, జీతాల కోత తప్పడం లేదని వివరించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మీడియా సంస్థలకు వందల కోట్లు బకాయి పడ్డాయని తెలిపింది.

SC-LOCKDOWN-MEDIA
మీడియాకు ప్రభుత్వాల బకాయిలు

పత్రికలు, మీడియా సంస్థలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా బకాయి పడ్డాయని సుప్రీంకోర్టుకు భారతీయ వార్తాపత్రికల సంఘం (ఐఎన్​ఎస్​) నివేదించింది. ప్రభుత్వ ప్రచార విభాగాలు యాడ్లకు సంబంధించి సుమారు రూ.1,800 కోట్లను చెల్లించలేదని వివరించింది.

ఈ సంక్షోభ సమయంలో పత్రికా యాజమాన్యాలకు ఈ డబ్బులు వస్తాయో లేదోనని సుప్రీంకోర్టు ఎదుట ఆందోళన వ్యక్తం చేసింది ఐఎన్​ఎస్​. మీడియా పరిశ్రమ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలపై న్యూస్ బ్రాడ్​కాస్టర్స్ అసోసియేషన్​ (ఎన్​బీఏ) అందించిన వివరాలను కోర్టుకు సమర్పించింది. ఎన్​బీఏ కూడా వేరుగా మరో ప్రమాణ పత్రాన్ని దాఖలు చేసింది.

"పరిశ్రమ అంచనాల ప్రకారం.. మీడియా సంస్థలకు డైరెక్టరేట్​ ఆఫ్ అడ్వర్టైసింగ్ అండ్ విజువల్ పబ్లిసిటీ (డీఏవీపీ) రూ.1,500 నుంచి రూ.1,800 కోట్లు బకాయి పడింది. ఇందులో రూ.900 కోట్ల వరకు పత్రికా సంస్థలకు చెందినవే. చాలా నెలలుగా ఇవి పెండింగ్​లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం చెల్లిస్తుందనే నమ్మకం కూడా లేదు."

- ఐఎన్​ఎస్​

దేశంలోని మూడు జర్నలిస్టు సంఘాలు దాఖలు చేసిన వ్యాజ్యంపై ఐఎన్​ఎస్​, ఎన్​బీఏకు నోటీసులు జారీ చేసింది జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం. వీటికి స్పందనగా ఎన్​బీఏ, ఐఎన్​ఎస్​ వివరణ ఇచ్చాయి.

"కరోనా వ్యాప్తి, లాక్​డౌన్​ వల్ల మీడియా పరిశ్రమ తీవ్రంగా ప్రభావితమైంది. మీడియా హౌసులన్నీ పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. ఈ అనుకోని విపత్తు సమయంలోనూ వార్తాసంస్థలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సాయం దక్కలేదు. ఆదుకునేందుకు కనీసం చర్యలు కూడా చేపట్టడం లేదు."

- ఎన్​బీఏ ప్రమాణ పత్రం సారాంశం

మరిన్ని సమస్యలు..

"ప్రభుత్వ ప్రకటనలు 80- 85 శాతం తగ్గిపోయాయి. ఇతర రంగాలకు చెందిన ప్రకటనలు కూడా 90 శాతం పడిపోయాయి. ఎఫ్​ఎంసీజీ, ఈ- కామర్స్, ఫినాన్స్, వాహనాల ప్రకటనలపైనే పత్రికలు భారీగా ఆధారపడతాయి. ఇవన్నీ ప్రస్తుత లాక్​డౌన్​ కారణంగా ప్రకటనలు ఇవ్వటం లేదు. ఆన్​లైన్​ వేదికల్లోనే యాడ్లు ఇస్తుండటమూ పత్రికలపై ప్రభావం చూపింది.

ప్రకటనలు లేకపోవటం వల్ల చాలా పత్రికలు పేజీల సంఖ్యను భారీగా తగ్గించాయి. చాలా మంది ఇతరులను ఇళ్లలోకి రానిచ్చేందుకు నిరాకరిస్తున్నారు. ఫలితంగా కొన్ని సంస్థలు పూర్తిగా ముద్రణను నిలిపేశాయి. " అని ఐఎన్​ఎస్​ వివరించింది.

"పత్రికల ఆదాయం ముఖ్యంగా ప్రకటనలపై ఆధారపడి ఉంటుంది. పత్రిక అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం చాలా స్వల్పం. ప్రభుత్వాలే కాకుండా డబ్బును ఆదా చేసేందుకు రాజకీయ పార్టీలు కూడా ప్రకటనలను నిలిపేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జర్నలిస్టు సంఘాలు వేసిన వ్యాజ్యాన్ని కొట్టివేయాలి" అని ఐఎన్​ఎస్​తోపాటు ఎన్​బీఏ సుప్రీంకోర్టును కోరింది.

రద్దు చేయాలని వ్యాజ్యం..

నేషనల్ అలయన్స్ ఆఫ్ జర్నలిస్ట్స్, దిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్, బృహన్ ముంబయి యూనియన్ ఆఫ్ జర్నలిస్టు సుప్రీంకోర్టులో ఇటీవల వ్యాజ్యాన్ని దాఖలు చేశాయి. లాక్​డౌన్​ కారణంగా మీడియా సంస్థలు తమ జర్నలిస్టులను తీసేస్తున్నారని.. జీతాల్లో కోత, సెలవులపై పంపిస్తున్నారని ఆరోపించాయి. మార్చి 25 తర్వాత అన్ని మీడియా సంస్థల యాజమాన్యాలు ఇచ్చిన ఆదేశాలను రద్దు లేదా నిలుపుదల చేయాలని వ్యాజ్యంలో కోరాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.