ETV Bharat / bharat

ఆ 25 జిల్లాల్లోనే 48 శాతం కరోనా మరణాలు

author img

By

Published : Oct 6, 2020, 9:29 PM IST

దేశంలో కరోనా తీవ్రతను వివరించింది కేంద్ర ఆరోగ్య శాఖ. భారత్​లో 25 జిల్లాల్లోనే 48శాతం కరోనా మరణాలు సంభవించినట్లు వెల్లడించింది. గత రెండు వారాలుగా కొవిడ్​-19 యాక్టివ్ కేసుల సంఖ్య 10 లక్షలకు దిగువకు చేరిందని తెలిపింది. రికవరీ రేటు 84శాతానికి పెరిగినట్లు పేర్కొంది.

48 pc of total COVID-19 deaths concentrated in 25 districts of 8 states: Health Ministry
ఆ 25 జిల్లాల్లోనే 48 శాతం కరోనా మరణాలు

దేశంలో కొన్నిరోజులుగా కరోనా కేసులు తగ్గతున్నా.. ప్రజలు మాత్రం భయాందోళనలను వీడడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ భారత్​లో వైరస్​ తీవ్రతకు సంబంధించిన సమాచారాన్ని వివరించింది. దేశంలో సంభవించిన కరోనా మరణాల్లో 48 శాతం 25 జిల్లాలలోనే నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ 25 జిల్లాల్లో 15 జిల్లాలు ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నాయన్న ఆరోగ్యశాఖ... కర్ణాటక, బంగాల్, గుజరాత్‌లలో రెండేసి జిల్లాలు.. తమిళనాడు, పంజాబ్, యూపీ, ఆంధ్రప్రదేశ్‌లలో ఒక్కో జిల్లా ఉన్నట్లు తెలిపింది

రెండోస్థానంలో..

ఇప్పటివరకు 56 లక్షల మంది కరోనా నుంచి కోలుకోగా రికవరీ రేటు 84శాతానికి పెరిగినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రపంచంలోనే అతి ఎక్కువ రికవరీలు మన దేశంలోనే నమోదైనట్లు తెలిపింది. 8 కోట్ల 10 లక్షల పరీక్షలతో.. ప్రపంచంలోనే ఎక్కువ నిర్ధరణ పరీక్షలు నిర్వహించిన దేశాల్లో రెండో స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది.

రికవరీలే ఎక్కువ

గత 2 వారాలుగా నమోదవుతున్న కేసుల కంటే కోలుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. సెప్టెంబర్ 16 నుంచి 22 తేదీల మధ్య 9.21 శాతంగా ఉన్న కరోనా పాజిటివిటీ రేటు... సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 6వ తేదీల మధ్య 6.82 శాతానికి తగ్గినట్లు వెల్లడించింది. సెప్టెంబర్ 2 నుంచి 8 వ తేదీల మధ్య రోజుకు సగటున 84 వేల 179 కేసులు నమోదైనట్లు తెలిపిన ఆరోగ్యశాఖ సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 6 మధ్య సగటున 77 వేల 113 కేసులు వెలుగుచూసినట్లు పేర్కొంది.

ప్రస్తుతమున్న యాక్టివ్ కేసుల్లో 77 శాతం మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్​, తమిళనాడు, యూపీ సహా10 రాష్ట్రాలలోనే ఉన్నట్లు పేర్కొంది. కరోనాపై ముందుండి పోరాడుతున్న వారి కోసం ప్రకటించిన 50 లక్షల బీమాను 95 కేసులలో చెల్లించామన్న ఆరోగ్యశాఖ... మరో 176 క్లెయిమ్‌లను పరిష్కరించాల్సి ఉందని వెల్లడించింది.

రాష్ట్రాల్లో కేసులు ఇలా...

  • కర్ణాటకలో కొత్తగా 9,993మందికి వైరస్​ సోకింది. 91మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6 లక్షల 57 వేలు దాటింది.
  • కేరళలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 7,871 కేసులు వెలుగు చూశాయి. వారిలో 111 వైద్య సిబ్బంది కూడా ఉన్నారు.
  • తమిళనాడులో ఒక్కరోజే 5,017కేసులు నమోదయ్యాయి. మరో 71మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 6 లక్షల 30 వేలు దాటింది.
  • బంగాల్​లో కొత్తగా 3,370 మంది కొవిడ్​ బారిన పడగా.. మరో 63మంది మృత్యువాతపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 77 వేలు దాటింది.
  • ఉత్తర్​ప్రదేశ్​లో ఒక్కరోజులో 3500మందికి వైరస్ సోకింది. మరో 61మంది మృతి చెందారు.
  • దిల్లీలో తాజాగా 2,676కేసులు నమోదయ్యాయి. మరో 39మంది చనిపోయారు. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 3 లక్షలకు చేరువైంది.
  • ఒడిశాలో మరో 2,673మంది వైరస్​ బాధితులుగా మారారు. 16మంది చనిపోయారు.
  • రాజస్థాన్​లో ఒక్కరోజే 2121మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 15మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య లక్షా 50వేలకు సమీపించింది.
  • గుజరాత్​లో కొత్తగా 1,335కేసులు నమోదవగా.. 10మంది మరణించారు.

ఇదీ చూడండి: 'రెండోసారీ కరోనా కొమ్ములు వంచిన దిల్లీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.