ETV Bharat / bharat

భగత్‌సింగ్‌ను తప్పించిన 'భార్య'!

author img

By

Published : Dec 17, 2021, 9:01 AM IST

Durgawati Devi Bhagat Singh: భారత స్వాతంత్య్ర చరిత్రలో మరచిపోలేని పుట.. లాహోర్‌ కేసు. బ్రిటిష్‌ పోలీసు అధికారి శాండర్స్‌ను కాల్చి చంపినందుకు... భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను బలి పీఠం ఎక్కించిన కేసు ఇదే! సంఘటన జరగ్గానే భగత్‌సింగ్‌ తన భార్య, పిల్లాడితో కలసి తప్పించుకున్నాడు. పెండ్లేకాని భగత్‌సింగ్‌కు భార్య ఎలా వచ్చింది? ఆసక్తికరమైన ఆ సంఘటనేంటో చూద్దాం రండి.

bhagat singh
భగత్‌సింగ్‌ను తప్పించిన 'భార్య'!

Durgawati Devi Bhagat Singh: 1928 డిసెంబరులో సరిగ్గా ఇదే రోజు.. 17వ తేదీ. లాహోర్‌లోని పోలీస్‌ స్టేషన్‌ నుంచి మోటార్‌ బైక్‌పై బయటకు వచ్చిన అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ జె.పి. శాండర్స్‌కు వీధి చివరి నుంచి వచ్చిన పిస్తోలు గుండు తాకింది. కిందపడగానే... బుల్లెట్ల వర్షం కురిసింది. అక్కడికక్కడే చనిపోయాడు శాండర్స్‌. తొలి బుల్లెట్‌ రాజ్‌గురుదైతే... తర్వాత ప్రాణంతీసిన తూటాలు భగత్‌సింగ్‌వి. పారిపోతుంటే... వెంటాడటానికి ప్రయత్నించిన పోలీస్‌ కానిస్టేబుల్‌ చన్నన్‌సింగ్‌ను కూడా కాల్చేశారు.

ఈ దాడికో నేపథ్యముంది. అప్పటికి కొద్దిరోజుల కిందటే.. సైమన్‌ కమిషన్‌కు వ్యతిరేకంగా లాహోర్‌లో ప్రదర్శన జరిగింది. లాలా లజపతిరాయ్‌ సారథ్యంలో సాగిన ఆ ప్రదర్శనపై సీనియర్‌ పోలీస్‌ సూపరింటెండెంట్‌ జేమ్స్‌ స్కాట్‌ ఆధ్వర్యంలోని బ్రిటిష్‌ పోలీసులు విరుచుకుపడ్డారు. విపరీతంగా కొట్టారు. స్కాట్‌ స్వయంగా లాలా లజపతిరాయ్‌పై చేయిచేసుకున్నాడు. తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చేరిన లాలా 1928 నవంబరు 17న మరణించారు. లాఠీదాడికి ప్రత్యక్ష సాక్షులైన భగత్‌సింగ్‌, ఆయన సహచరులు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. ఫలితమే శాండర్స్‌పై దాడి. నిజానికి వాళ్ల లక్ష్యం స్కాట్‌. కానీ అనుకోకుండా శాండర్స్‌ బయటకు రావటం వల్ల ఆయనపైనే దాడి జరిగింది. లాలాపై లాఠీఛార్జి జరిగినప్పుడు శాండర్స్‌ కూడా ఉన్నాడు.

శాండర్స్‌పై దాడి వార్త లాహోర్‌ అంతటా దావానలంలా వ్యాపించింది. కాల్పులు జరిపింది ఓ సిక్కు యువకుడని తెలుసుకుని బ్రిటిష్‌ ప్రభుత్వం గాలింపు ముమ్మరం చేసింది. ఎటుచూసినా పోలీసులే. అలాంటివేళ ఓ రోజు ఉదయం లాహోర్‌ రైల్వే స్టేషన్‌ పోలీసు కళ్లతో కిటకిటలాడుతోంది. చక్కగా గడ్డం గీక్కొని.. సూటూబూటూ వేసుకొని తలపై ఇంగ్లిష్‌ టోపీ పెట్టుకున్న ఆ యువకుడికి తోడు చేతిలో చేయి వేసుకున్న అందమైన యువ భార్య. అందరి కళ్లూ ఆమెపైనే నిలిచాయి. వెంట సొట్టబుగ్గల చిన్న పిల్లాడు. చూడచక్కని జంట అని అంతా కళ్లప్పగించి చూస్తుంటే అందరినీ దాటుకుంటూ ఠీవిగా ఆ కుటుంబం కాన్పుర్‌ వెళ్లే రైలులో ఫస్ట్‌క్లాస్‌ బోగీలో ఎక్కింది. రైలు కదిలిపోయింది. పోలీసు కళ్లు ఇంకా వెదుకుతూనే ఉన్నాయి.

భగత్‌సింగ్‌ భార్యగా అందరి దృష్టి మళ్లించి ఆయన్ను తప్పించిన ఆ మహిళ పేరు దుర్గాదేవి వోహ్రా! గుజరాత్‌కు చెందిన ఆమెకు... భగవతి చరణ్‌ వోహ్రాతో వివాహమైంది. భగవతి చరణ్‌ లాహోర్‌ కాలేజీలో చదివేటప్పుడు భగత్‌సింగ్‌, సుఖ్‌దేవ్‌లతో పరిచయం. రైల్వేలో ఉద్యోగం చేస్తూనే... బ్రిటిష్‌వారి అకృత్యాలపై ఆగ్రహంతో విప్లవ కార్యక్రమాల్లో పాలుపంచుకునేవాడాయన. లాహోర్‌లోని వీరిల్లు విప్లవ సంస్థ హిందుస్థాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఎస్‌ఆర్‌ఏ) కార్య కలాపాలకు అడ్డా. అలా దుర్గాదేవి కూడా వీరితో కలసి పనిచేసేవారు. శాండర్స్‌ను కాల్చిన రెండ్రోజుల తర్వాత... వీరింటికి వచ్చిన భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లు లాహోర్‌ నుంచి తప్పించుకోవటానికి దుర్గాదేవి సాయం కోరారు. ఫలితమే... ఆయన భార్యగా దుర్గాదేవి అవతారం ఎత్తటం. కాన్పుర్‌లో భగత్‌సింగ్‌ దిగిపోయాక... కోల్‌కతా వెళ్లి తన భర్తను కలుసుకొని జరిగింది వివరించారు దుర్గ.

అప్పటి నుంచి రహస్యంగానే భగత్‌సింగ్‌ బృందానికి సాయం చేస్తూ వచ్చారామె. 1929లో దిల్లీ అసెంబ్లీలో భగత్‌సింగ్‌ బాంబు పెట్టి దొరికిపోవటానికి ముందు కూడా ఆమె కలిశారు. 1930లో బాంబు తయారు చేస్తుంటే భగవతి చరణ్‌ మరణించారు. రహస్యంగా భర్త అంతిమసంస్కారాలు పూర్తి చేసిన ఆమె.. అజ్ఞాతంలోకి వెళ్లారు. హెచ్‌ఎస్‌ఆర్‌ఏ కార్యకలాపాలకు సహకారం మాత్రం ఆపలేదు. భగత్‌కు ఉరిశిక్ష ఖరారయ్యాక వైస్రాయ్‌ ఇర్విన్‌తో చర్చల్లో క్షమాభిక్ష గురించి ప్రస్తావించాలని గాంధీజీ దగ్గరకు వెళ్లి విజ్ఞప్తి చేశారు. 1932లో అరెస్టయి ఏడాది జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాక కొన్నాళ్లు కాంగ్రెస్‌లో పనిచేశారు. 1940 తర్వాత లఖ్‌నవూలో పాఠశాల ప్రారంభించి... రాజకీయాలకు దూరమయ్యారు.

ఇదీ చూడండి : 'అత్యాచారం అనివార్యమైతే.. ఆనందంగా ఆస్వాదించండి!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.