ETV Bharat / bharat

వాటిపై చర్చకు రాహుల్ పట్టు- నో చెప్పిన ఛైర్మన్!

author img

By

Published : Jul 14, 2021, 10:36 PM IST

rahul gandhi
రాహుల్ గాంధీ

పార్లమెంటరీ ప్యానెల్ సమావేశంలో చైనా, అఫ్గాన్, పాక్ నుంచి పొంచి ఉన్న సవాళ్లపై చర్చించాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పట్టుబట్టారు. అయితే, సమావేశం అజెండా వేరేది కావడం వల్ల.. ఆ చర్చకు స్థాయీ సంఘం ఛైర్మన్ నిరాకరించారు.

దేశభద్రతకు సంబంధించిన కీలక సమస్యలను పార్లమెంటరీ ప్యానెల్ మీటింగ్​లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేవనెత్తారు. చైనాతో ప్రతిష్టంభన, పాకిస్థాన్ నుంచి ఉగ్ర ముప్పు, అఫ్గాన్​లో తాలిబన్ల దురాక్రమణపై చర్చించాలని రాహుల్ డిమాండ్ చేశారు.

'కంటోన్మెంట్ బోర్డుల పనితీరుపై సమీక్ష' అజెండాతో రక్షణ రంగంపై ఏర్పాటైన పార్లమెంట్ స్థాయీ సంఘం సమావేశమైంది. ఈ నేపథ్యంలో రాహుల్ లేవనెత్తిన అంశాలు అజెండాలో లేనందున.. వాటిపై చర్చించేందుకు కమిటీ ఛైర్మన్, భాజపా నేత జువాల్ ఓరమ్ నిరాకరించారు. అయితే, కంటోన్మెంట్ బోర్డుల కంటే ప్రస్తుత సమస్యలపై ముందుగా చర్చించాల్సిన అవసరం ఉందని రాహుల్ పేర్కొన్నారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

"తూర్పు లద్దాఖ్​లో చైనాతో ప్రతిష్టంభన, పాకిస్థాన్ ఉగ్రవాదుల నుంచి ముప్పు, శ్రీలంకలో పెరుగుతున్న చైనా ప్రాబల్యం, తాలిబన్లు కొత్త ప్రాంతాలను ఆక్రమించుకోవడం వంటి సమస్యలను రాహుల్ ప్రస్తావించారు. ఇవి చాలా తీవ్రమైన సమస్యలని, వీటిపై చర్చించాలని పట్టుబట్టారు. కానీ, అజెండాలో లేనందున దీనికి ఛైర్మన్ నిరాకరించారు. కమిటీ ఏడాది అజెండా నిర్ణయించినప్పుడు రాహుల్ సహా ఏ కాంగ్రెస్ నాయకుడూ భేటీకి హాజరు కాలేదని ఛైర్మన్ పేర్కొన్నారు."

-సంబంధిత వర్గాలు

90 నిమిషాల పాటు మీటింగ్ కొనసాగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సమావేశం ముగియడానికి కొద్దిసమయం ముందు రాహుల్ వెళ్లిపోయారని స్పష్టం చేశాయి.

ఇదీ చదవండి: 'రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థిని కాను'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.