ETV Bharat / bharat

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు అంతా రెడీ- మణిపుర్, ధరల పెరుగుదలే విపక్షాల అస్త్రాలు!

author img

By

Published : Jul 19, 2023, 5:11 PM IST

Updated : Jul 19, 2023, 5:28 PM IST

Parliament Monsoon Session 2023 : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్ధమైంది. మణిపుర్​ హింసపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు ఎదురుచూస్తున్నాయి. ప్రతిపక్షాలు కోరిన ప్రతి అంశంపైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం చెబుతోంది.

Parliament Monsoon Session 2023
Parliament Monsoon Session 2023

Parliament Monsoon Session 2023 : 'ఎన్​డీఏ వర్సెస్​ ఇండియాగా' జాతీయ రాజకీయం మారిన నేపథ్యంలో గురువారం ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై ఆసక్తి నెలకొంది. మణిపుర్ హింస, ధరల పెరుగుదల వంటి కీలక అంశాలపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుపడుతున్నాయి. తొలి రోజు నుంచే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి.
పార్లమెంట్ సమావేశాల కోసం అన్ని ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం.. బుధవారం అఖిలపక్ష నాయకులతో సమావేశం నిర్వహించింది. ప్రతిపక్షాలు కోరిన ప్రతి అంశంపైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు పార్లమెంటరీ వ్యవహరాల మంత్రి ప్రహ్లాద్ జోషి. అన్ని పార్టీలతో బీఏసీ సమావేశం జరిగిందని.. ఇందులో మణిపుర్​ హింసతో పాటు మరో 31 అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

పార్లమెంట్ సమావేశాల ప్రారంభ రోజే.. మణిపుర్ అంశంపై వాయిదా తీర్మానం ఇస్తామని కాంగ్రెస్​ తెలిపింది. వీటితో పాటు ఒడిశా బాలేశ్వర్ రైలు ప్రమాదం, రాష్ట్రాల్లో వరదలు, నిరుద్యోగం, చైనా సరిహద్దు అంశాలపై చర్చ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు.. ప్రభుత్వం మొండి పట్టుదలను వీడి మధ్యమార్గంగా నడవాలని సూచించారు కాంగ్రెస్​ నేత జైరాం రమేశ్​. దిల్లీ ఆర్డినెన్స్​పై ప్రవేశపెట్టే బిల్లును కచ్చితంగా అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. ఇది రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం హక్కులను కాలరాయడమే అని విమర్శించారు. పార్లమెంటరీ వ్యవస్థలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న మార్గాలను.. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూనే ఉంటాయని చెప్పారు.

"మాలో కొత్త ఉత్సాహం వచ్చింది. మాకు కొత్త పేరు దొరికింది. ఇప్పుడు మేము ప్రతిపక్షం కాదు.. ఇండియా పార్టీ. పార్లమెంట్ సమావేశం జరిగే ప్రతిరోజు ఉదయం.. రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే ఛాంబర్​లో ప్రతిపక్ష పార్టీల నేతలు సమావేశం అవుతారు. ఆరోజు పార్లమెంట్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తారు."

--జైరాం రమేశ్​, కాంగ్రెస్​ నేత

మంగళవారం జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో.. మణిపుర్​ హింసపై చర్చనే ప్రథమ అంశంగా తీసుకోవాలని అన్ని పార్టీలు అంగీకరించాయన్నారు జైరాం రమేశ్. వందల మంది మరణించినా.. వేలాది మంది గాయాలపాలైనా.. ప్రధానమంత్రి మాత్రం నిశబ్ధంగా ఉన్నారని దుయ్యబట్టారు. హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి బీరెన్ సింగ్​ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. 8 చీతాల మృతిపై స్పందించిన ప్రధాని.. మణిపుర్​ అంశంపై ఎలాంటి స్పందన లేదని విమర్శించారు. ఈ అంశంపై చర్చలో ప్రధాని తప్పనిసరిగా పాల్గొనాలని డిమాండ్ చేశారు.

"మనల్ని మనం ప్రజాస్వామ్యానికి తల్లిగా పిలుచుకుంటాం. ప్రధానమంత్రి పార్లమెంట్​కు హాజరు కారు.. హాజరైనా కనీసం మాట్లాడరు. ప్రజల పరిస్థితులపై చర్చించరు. ఇలాంటి మనం ప్రజాస్వామ్యానికి తల్లిగా ఎలా పిలుచుకుంటాం? ధరలు, నిరుద్యోగం పెరుగుదల, చైనా సరిహద్దు అంశం​, అదానీ వ్యవహారంపై జేపీసీ అంశాలు మా అజెండాలో ఉన్నాయి. దిల్లీ ఆర్డినెన్స్​, అటవీ సంరక్షణ, జీవవైవిధ్య చట్టాల సవరణను అడ్డుకుంటాం. పలు రాష్ట్రాల్లో షెడ్యూల్డ్ తెగల జాబితా సవరణకు మద్దతిస్తాం. మేము పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరగాలనే సానుకూల ధృక్పథంతోనే ఉన్నాం."

--జైరాం రమేశ్​, కాంగ్రెస్​ నేత

ఇండియా కూటమి సమావేశం
మరోవైపు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు గురువారం సమావేశం కానున్నారు. ఇండియా ఫ్రంట్‌ ఏర్పాటు తర్వాత.. జరుగుతున్న తొలి సమావేశం ఇదే. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే ఛాంబర్‌లో ఈ సమావేశం జరగనుంది. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో చేపట్టాల్సిన అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారని ప్రతిపక్ష నేత ఒకరు వెల్లడించారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20న ప్రారంభమై ఆగస్టు 11న ముగియనున్నాయి.

Last Updated :Jul 19, 2023, 5:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.