ETV Bharat / bharat

సరిహద్దు వివాదంపై సుప్రీం కోర్టుకు అసోం సర్కార్​!

author img

By

Published : Jul 27, 2021, 5:17 PM IST

Updated : Jul 27, 2021, 6:05 PM IST

అటవీ భూభాగాన్ని దురాక్రమణ నుంచి రక్షించాలని కోరుతూ.. సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. అసోం-మిజోరం అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద ఘర్షణల నేపథ్యంలో అసోం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సరిహద్దు సమస్య తీవ్రతరమవుతున్న వేళ.. ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించనుంది కేంద్ర హోంశాఖ.

Assam CM Himanta Biswa Sarma
అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ

అసోం-మిజోరం మధ్య భగ్గుమన్న సరిహద్దు వివాదం.. సుప్రీంకోర్టుకు చేరే అవకాశం కనిపిస్తోంది. ఇరు రాష్ట్రాలకు సరిహద్దుగా భావిస్తున్న అంతర్గత అడవుల పరిరక్షణ కోసం దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు అసోం సీఎం హిమంత బిశ్వశర్మ తెలిపారు. నిషేధిత ప్రాంతంలో రోడ్ల నిర్మాణంతో పాటు ఝూమ్‌ సాగు కోసం చెట్లు నరికివేస్తున్నట్లు శాటిలైట్‌ చిత్రాల ద్వారా బయటపడినట్లు హిమంత తెలిపారు. అటవీ ప్రాంతాన్ని కాపాడేందుకు సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు చెప్పారు.

"అడవులను కాపాడాలని కోరుతూ.. సుప్రీంకోర్టుకు వెళ్లనున్నాం. ఇది భూ వివాదం మాత్రమే కాదు. అటవీ సంపద ఆక్రమణ సమస్య. అటవీ సంపదకు సంబంధించి రాజీపడేది లేదు. ఒకవేళ మిజోరం ఆధారాలు చూపిస్తే.. ఆ ప్రాంతాన్ని వెంటనే ఖాళీ చేయిస్తాం."

- హిమంత బిశ్వ శర్మ, అసోం సీఎం

ఝూమ్‌ సాగు అంటే.. వ్యవసాయ కార్యకలాపాల కోసం చెట్లు, ఇతర వృక్ష సంపదను నరికి నిప్పుపెడతారు. ఈశాన్య రాష్ట్రాల్లో చాలావరకు ఈ తరహా వ్యవసాయాన్ని అనుసరిస్తున్నారు.

అంగుళం కూడా వదలం...

ఒక్క అంగుళం భూమి కూడా వదులుకునేందుకు సిద్ధంగా లేమని హిమంత స్పష్టం చేశారు. ప్రజలు ఎన్నో త్యాగాలు చేశారని, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరిహద్దును కాపాడుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఇందుకు మిజోరం సరిహద్దుల్లో భద్రతను బలోపేతం చేసేందుకు కాచర్​, కరీమ్​గంజ్​, హైలాకాండి జిల్లాల్లో మూడు కమాండో బెటాలియన్లను మోహరించనున్నట్లు హిమంత తెలిపారు.

మూడు రోజులపాటు సంతాప దినాలు

మిజోరం-అసోం రాష్ట్రాల సరిహద్దుల్లో సోమవారం జరిగిన ఘర్షణల్లో ఆరుగురు అసోం పోలీసులు మరణించారు. వారి త్యాగాలకు గుర్తుగా మూడు రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర సర్కారు.

అసోం-మిజోరం మధ్య సరిహద్దు వివాదం సోమవారం హింసాత్మకంగా మారగా ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు సహా ఓ పౌరుడు మరణించారు. 60 మందికిపైగా గాయపడ్డారు.

'జోక్యం చేసుకోండి'

మిజోరం-అసోం రాష్ట్రాల సరిహద్దు వివాదంలో జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కేంద్ర హోంమంత్రి అమిత్​ షాకు లేఖ రాశారు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్​ గొగొయి. వివాదాస్పద సరిహద్దులో హింసతో ప్రజా భద్రతకు భంగం వాటిల్లుతుందని.. ఇది రాజ్యాంగ వైఫల్యం అని గొగొయి పేర్కొన్నారు.

కీలక భేటీ

అంతర్రాష్ట్ర సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో పాటు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి. దిల్లీలోని నార్త్​ బ్లాక్‌లో బుధవారం ఈ భేటీ జరగనుంది.

ఇదీచూడండి: అసోం-మిజోరం సరిహద్దు ఘర్షణలో ఆరుగురు పోలీసులు మృతి

Last Updated : Jul 27, 2021, 6:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.