రూటు మార్చిన చదువులు.. ప్రైవేటు నుంచి 'ప్రభుత్వ బడులకు'!

author img

By

Published : Nov 17, 2021, 10:42 PM IST

ASER finds students shifting from pvt to govt schools, most in UP & Kerala
ప్రైవేటు నుంచి ప్రభుత్వ బడులకు ()

ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు గణనీయంగా పెరిగినట్లు 'వార్షిక విద్యాస్థితి నివేదిక-2021' పేరుతో అసర్ చేపట్టిన సర్వేలో వెల్లడైంది.

దేశంలో గత కొంతకాలంగా ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు గణనీయంగా పెరిగినట్లు 'వార్షిక విద్యాస్థితి నివేదిక-2021' సర్వేలో వెల్లడయ్యింది. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్‌, కేరళ రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు అత్యధికంగా ఉన్నాయని తెలిపింది. విద్యాస్థితిని అంచనా వేసేందుకు దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో అసర్‌ సర్వే నిర్వహించింది. వీటిలో 76,706 కుటుంబాలు, 5 నుంచి 16ఏళ్ల మధ్య వయసున్న 75,234 మంది చిన్నారులను సర్వే చేసింది. కొవిడ్‌ తర్వాత తిరిగి తెరచుకున్న 4872 పాఠశాలలతో పాటు తెరచుకోని 2427 పాఠశాలల ఇంఛార్జీల నుంచి సమాచారం సేకరించినట్లు అసర్‌ పేర్కొంది.

'దేశవ్యాప్తంగా ప్రైవేటుతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెరుగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆరు నుంచి 14ఏళ్ల వయసున్న పిల్లలు ప్రైవేటు స్కూళ్లలో చేరడం 2018లో 32.5శాతం ఉండగా.. 2021నాటికి అది 24.4శాతానికి తగ్గింది' అని 16వ అసర్‌ వార్షిక నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో 2018లో ప్రభుత్వ పాఠశాలల్లో 64.3శాతం ఉండగా.. ప్రస్తుతం అది 70.3శాతానికి పెరిగిందని తెలిపింది. అన్ని తరగతులతో చేరికలతో పాటు.. బాలురు, బాలికల సంఖ్యలోనూ ఈ పెరుగుదల కనిపించిందని పేర్కొంది. అయినప్పటికీ ప్రైవేటు స్కూళ్లలో చేరేవారి సంఖ్య బాలురలోనే ఎక్కుగా ఉన్నట్లు గుర్తించింది. ఇక దేశంలో 2006 నుంచి 2014 వరకు ప్రైవేటు స్కూళ్లలో చేరికలు విపరీతంగా పెరిగాయి. ఆ సమయంలో ప్రైవేటులో చేరికలు 30శాతం పెరిగాయి. కానీ, ఈ ఏడాది కరోనా వైరస్‌ వల్ల ప్రైవేటులో చేరికలు మరింత తగ్గినట్లు తాజా సర్వే వెల్లడించింది.

వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ బడుల్లో చేరికల పెరుగుదల ఇలా..

  • ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యధికంగా 13.2శాతం పెరగగా.. కేరళలో 11.9శాతం పెరిగాయి.
  • రాజస్థాన్‌లో 9.4శాతం, మహారాష్ట్ర - 9.2శాతం, కర్ణాటక - 8.3శాతం, తమిళనాడు - 9.6శాతం, ఆంధ్రప్రదేశ్‌ - 8.4శాతం పెరుగుదల కనిపించింది.
  • తెలంగాణ - 3.7శాతం, బిహార్‌ - 2.8శాతం, పశ్చిమబెంగాల్‌ - 3.9శాతం, ఝార్ఖండ్‌ - 2.5శాతం ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెరిగాయి.
  • 6 నుంచి 14ఏళ్ల వయసు పిల్లల చేరికల్లో మాత్రం ఎటువంటి తేడా కనిపించలేదు. 15-16 ఏళ్ల పిల్లలు ప్రభుత్వ బడుల్లో చేరడం గణనీయంగా పెరిగింది. 2018లో ఈ చేరికలు 57శాతంగా ఉండగా.. 2021 నాటికి 67.4శాతానికి పెరిగాయి.
  • ఇదే సమయంలో బడిమానేసే పిల్లల సంఖ్య 12.1శాతం నుంచి 6.6శాతానికి తగ్గింది.
  • 2020లో పాఠశాలల్లో నమోదు చేసుకోని పిల్లల సంఖ్య 1.4శాతం నుంచి 4.6శాతానికి పెరిగింది.
  • ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, పంజాబ్‌, హరియాణా, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయి.
  • అదే ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు తగ్గుముఖం పట్టడంతో పాటు బడుల్లో నమోదు చేసుకోని చిన్నారుల సంఖ్య కూడా పెరిగింది.

ఇదీ చూడండి: Cabinet Decision today: 32వేల కి.మీ రోడ్ల నిర్మాణం- 7,287 గ్రామాల్లో టెలికాం టవర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.