ETV Bharat / bharat

Amritsar East: సిద్ధూ పంజా విసురుతారా? మజీఠియా షాక్ ఇస్తారా?

author img

By

Published : Feb 5, 2022, 10:47 AM IST

sidhu and bikram sing
సిద్ధూ పంజా విసురుతాడా? మజీఠియా షాక్ ఇస్తాడా?

Amritsar East: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అమృత్‌సర్‌ (తూర్పు) నియోజకంలో పోటీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నవజోత్‌సింగ్‌ సిద్ధూ సిట్టింగ్‌ స్థానం. ఆయనకు ప్రత్యర్థి బిక్రమ్‌సింగ్‌ మజీఠియా. పంజాబ్‌ రాజకీయాల్లో సిద్ధూ, మాజీ మంత్రి మజీఠియాల రాజకీయ వైరం ఉంది. వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.

Punjab Assembly Elections: పంజాబ్‌నే కాదు.. దేశవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తున్న నియోజకవర్గం అమృత్‌సర్‌ (తూర్పు). దీనికి కారణం.. ఇది పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నవజోత్‌సింగ్‌ సిద్ధూ సిట్టింగ్‌ స్థానం కావడమే కాదు.. ఇక్కడ బరిలో నిలుచున్న ప్రత్యర్థి బిక్రమ్‌సింగ్‌ మజీఠియా కూడా. పంజాబ్‌ రాజకీయాల్లో సిద్ధూ, మాజీ మంత్రి మజీఠియాల రాజకీయ వైరం ఉంది. వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అసెంబ్లీ సాక్షిగా చాలా సార్లు ఘర్షణ పడ్డారు. ఇక బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న సందర్భాలు కోకొల్లలు. ఒకరినొకరు వ్యక్తిగతంగా ద్వేషించే స్థాయికి చేరిన వీరి వైరం ఈనాటిది కాదు. సిద్ధూ భాజపాలో ఉన్నప్పటి నుంచీ ఉంది. శిరోమణి ఆకాలీదళ్‌ భాగస్వామి పార్టీగా భాజపా ఉన్న సమయంలోనూ మజీఠియాపై నవజోత్‌ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్‌లోకి చేరిన తర్వాత వాటికి మరింత పదును పెట్టారు. శిరోమణి అకాలీదళ్‌ అధినేత సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ బావమరిది కూడా అయిన మజీఠియాపై మాదకద్రవ్యాల కేసులు ఉన్నాయి. దీంతో సిద్ధూ ఒక దెబ్బకు రెండు పిట్టలన్నట్లు బిక్రమ్‌ సింగ్‌తో పాటు, అకాలీదళ్‌ నేతలనూ డ్రగ్‌ మాఫియా ఆరోపణలతో ఇరకాటంలో పెడుతూ వచ్చారు. దీంతో అకాలీ వర్గాల్లోనూ ఈ మాజీ క్రికెటర్‌పై పీకల్లోతు కోపం ఉంది. అందుకే మజీఠియాను ఆ పార్టీ రంగంలోకి దింపింది.

నిజానికి 'మాఝా జనరల్‌'గా పేరొందిన బిక్రమ్‌కు అమృత్‌సర్‌ తూర్పు నియోజకవర్గంతో సంబంధం లేదు. ఆయన మజీఠా సిట్టింగ్‌ ఎమ్మెల్యే. అక్కడి నుంచే మూడు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అయినా అక్కడ తన భార్యను రంగంలోకి దింపి సిద్ధూతో నేరుగా అమీతుమీ తేల్చుకోవటానికి సిద్ధమయ్యారు. 'ఇది గెలుపోటములకు సంబంధించిన విషయమే కాదు. ఒక అహంకార వ్యక్తికి ప్రేమించడం, పెద్దలను గౌరవించడం నేర్పించాలి. ఇది నా విద్యుక్త ధర్మం. అందుకే పోటీ చేస్తున్నా' అని మజీఠియా చెప్పడం బట్టే వీరిద్దరి మధ్య ఎంతగా వైరం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అమ్‌ ఆద్మీ పార్టీ తరఫున జీవన్‌ జ్యోత్‌ కౌర్‌, భాజపా అభ్యర్థిగా మాజీ ఐఏఎస్‌ అధికారి జగ్‌మోహన్‌సింగ్‌ రాజు పోటీ చేస్తున్నారు.

ఇదీ చదవండి: UP Election 2022: భాజపాకు సై.. యోగికి నై!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.