ETV Bharat / bharat

మీకు మొబైల్ వ్యసనం ఉందా? ఇక్కడకు వెళ్లాల్సిందే!

author img

By

Published : Oct 29, 2021, 3:13 PM IST

ప్రస్తుతం యువత మొబైల్​ వ్యసనానికి బానిసలవుతున్నారు అనటంలో ఎలాంటి సందేహం లేదు. క్షణం తీరిక దొరికినా సామాజిక మాధ్యమాల్లో కాలక్షేపం చేస్తున్నారు. ఈ క్రమంలో వారిని డిజిటల్‌ ప్రపంచానికి దూరంగా ఉంచేందుకు గుజరాత్​ అహ్మదాబాద్​లోని ప్రభుత్వ ఆస్పత్రిలో డిజిటల్ డీటాక్స్ సెంటర్ ​ ఏర్పాటైంది. మొబైల్ వినియోగానికి బానిసలైన చిన్నారులు, యువతీ యువకులకు ఇక్కడ ఉచితంగా చికిత్స అందిస్తున్నారు.

డిజిటల్ డీటాక్స్
Digital Detox

మీకు మొబైల్ వ్యసనం ఉందా..? ఇక్కడకు వెళ్లాల్సిందే!

ఓ పూట ఆహారం తీసుకోకుండానైనా ఉంటామేమో గానీ మొబైల్స్‌, ల్యాప్‌టాప్స్‌ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేం. ఇదీ డిజిటల్‌ ప్రపంచంలో మునిగితేలుతోన్న నేటి యువత వరుస. ఇలా రోజుకు 6 నుంచి 8 గంటలపాటు మొబైల్​లోనే యువత కాలం గడుపుతున్నారనటంలో అతిశయోక్తి లేదు. ఎక్కువ సమయం గ్యాడ్జెట్స్ వినియోగించటం వల్ల విద్యార్థులు, యువతీయువకుల్లో మెడనొప్పి, నడుంనొప్పి, కళ్ల సమస్యలతోపాటు మానసిక ఒత్తిడి, ఆందోళన అధికమవుతున్నాయి.

ఈ క్రమంలో యువతను డిజిటల్‌ ప్రపంచానికి దూరంగా(డిజిటల్ డీటాక్స్​) ఉంచేందుకు గుజరాత్​ అహ్మదాబాద్​లోని ప్రభుత్వ ఆస్పత్రిలో డిజిటల్ డీటాక్స్ సెంటర్​ను ఏర్పాటు చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. మొబైల్ వ్యసనానికి​ బానిసలైన చిన్నారులు, యువతీయువకులకు ఈ సెంటర్​లో ఉచితంగా చికిత్స అందిస్తున్నారు.

డిజిటల్ డీటాక్స్ అంటే ఏమిటి?

డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉండటం. మొబైల్, సామాజిక మాధ్యమాల వినియోగాన్ని క్రమంగా తగ్గించుకోవటం.

ఎవరు డీటాక్స్ సెంటర్​కు వెళ్లేందుకు అర్హులు?

వీటిలో ఏ రెండు సమస్యలతో బాధపడుతున్నా మీరు కచ్చితంగా డిజిటల్ డీటాక్స్ సెంటర్​ను సందర్శించాలి.

1. మొబైల్ ఫోన్ లేకుండా మీరు ఇంటి నుంచి బయటకు వెళ్లలేకపోవటం

2. ఎలాంటి కారణం లేకపోయినా అదే పనిగా మొబైల్​ను చెక్​ చేయటం

3. ఆహారం తీసుకునేటప్పుడు కూడా మొబైల్ ఫోన్ వాడటం

4. సామాజిక మాధ్యమాలను సందర్శించిన తర్వాత ఆత్రుత, డిప్రెషన్​కు లోనవ్వటం

5. మెసేజెస్​ లేదా కామెంట్స్​ లేదా పోస్ట్​లకు స్పందించాలన్న కోరిక బలంగా ఉండటం

6. మీరు ఒంటరిగా ఉన్నారని అనుకోవటం

" గుజరాత్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఈ మానసికో ఆరోగ్య ఆసుపత్రిలో 'డిజిటల్ వెల్​నెస్​ సెంటర్​'ను ప్రారంభించాం. ఇక్కడికి వచ్చే రోగులకు వృత్తి చికిత్స, పునరావాస ప్రక్రియ చేపడతాం. 5-22 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలు, యువకులు చికిత్స కోసం మా దగ్గరికి వస్తుంటారు. వారిని ముందుగా సైకియాట్రిస్ట్​కి చూపిస్తాం. ఈ మధ్యకాలంలో ఆన్​లైన్ క్లాసులకు హాజరవుతూ ఉండటం మూలాన పిల్లలు డిజిటల్ మీడియాకు బాగా అలవాటు పడిపోయారు. అది ఓ వ్యసనంలా మారింది. దీనివల్ల వారిలోని సహజ నైపుణ్యాలు ప్రభావితం అవుతున్నాయి."

-- విభా సలాలియా, సైకియాట్రిక్​ హెడ్ నర్సు

చికిత్స ఎలా అందిస్తారు?

మొబైల్ వినియోగానికి బానిసలైన యువత ఓపీడీలోని సైకియాట్రిస్ట్​ల దగ్గరకు పంపిస్తారు. ఆ తర్వాత సదరు వ్యక్తికి థెరపీ అవసరం అనిపిస్తే.. డీటాక్స్ సెంటర్​కు సిఫార్సు చేస్తారు. డీటాక్స్ సెంటర్​లోని వైద్యులు.. వ్యక్తి మానసిక పరిస్థితిని అంచనా వేసి వైద్యం అందిస్తారు. రిలాక్సేషన్ టెక్నిక్స్, బిహేవియర్​ థెరపీ, విద్యతో పాటు కొన్ని టాస్క్​లను ఇస్తారు. వీరితో పాటు తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్ ఇస్తారు.

దీంతో పాటు మొబైల్ ఫోన్​పై దృష్టి మరల్చకుండా.. ప్రార్థనలు, యోగా, మెడిటేషన్, వ్యాయామం చేయిస్తారు. ఈ చికిత్స 1-2 నెలల పాటు ఉంటుంది.

మొబైల్​ వినియోగానికి దూరంగా ఉండాలంటే..?

1. ఉదయం నిద్రలేవగానే మొబైల్​ఫోన్​ను పట్టుకోవద్దు

2. మొబైల్​లోని అన్ని యాప్స్ నోటిఫికేషన్స్​ అలర్ట్స్​ను ఆఫ్ చేసుకోవాలి. అవసరం లేని యాప్స్​ను తొలగించాలి.

3. నిద్రపోయేటప్పుడు ఫోన్​ను దగ్గరగా పెట్టుకోవద్దు.

4. మీ ఫోన్​లోని ఫోటోలను డిలీట్​ చేసి వాటిని క్లౌడ్​లో సేవ్ చేసుకోవాలి.

5. మీకు ఇష్టంలేని వ్యక్తులను ఫాలో అవ్వకండి

6. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు మొబైల్​ను తీసుకెళ్లొద్దు.

"వ్యక్తి మానసిక పరిస్థితిని అంచనా వేసి వైద్యం అందిస్తాం. అంతేకాక రిలాక్సేషన్ టెక్నిక్స్, బిహేవియర్​ థెరపీ, విద్యతో పాటు కొన్ని టాస్క్​లను ఇస్తాం. వీరితో పాటు తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్ అందిస్తాం. ఈ సమస్య ఉన్నవాళ్లు ఇంట్లో ఎవరితోనూ మాట్లాడరు. మొబైల్​లోనే కాలక్షేపం చేస్తుంటారు. పిల్లలు నిద్రాహారాలు మాని సామాజిక మాధ్యమాల్లో గడుపుతుంటారు."

-- విభా సలాలియా, సైకియాట్రిక్​ హెడ్ నర్సు

ప్రస్తుతం ఈ సెంటర్​లో 24 మంది యువత చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వ ఆస్పత్రి సైకియాట్రిక్​ హెడ్ నర్సు విభా సలాలియా తెలిపారు. 5 నుంచి 22 ఏళ్ల వయసు వారు ఈ సెంటర్​లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారన్నారు.

ఇదీ చూడండి: 'రేషన్​ తరహాలో సబ్సిడీపై గడ్డి.. గ్రామానికో షాప్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.