వాయుగుండం ప్రభావంతో.. రాష్ట్రంలో వర్ష బీభత్సం
వాయుగుండం ప్రభావం వల్ల రాష్ట్రంలో వర్షపాతం భారీగానే నమోదైంది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 24.3 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. విశాఖ, కృష్ణా జిల్లాలో 20సెంటిమీటర్ల వరకు వర్షం కురిసినట్లు వాతావరణశాఖ తెలిపింది. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవులో 24.3, రాయవరంలో 22.7 సెంటీమీటర్లు నమోదైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 20.2, శ్రీకాకుళం జిల్లాలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై వర్షపు నీరు నిలిచి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు అవస్థలు పడ్డారు.