'యువగళం' పాదయాత్రలో పోలీసుల అత్యుత్సాహం.. ఏం చేశారంటే..!
Nara Lokesh 'Yuvagalam' Padayatra updates: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్రలో పోలీసులు.. అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. అనంతపురం రూరల్లోని సిండికేట్ నగర్లో టపాసులు పేల్చి.. లోకేశ్కు స్వాగతం పలికేందుకు వచ్చిన టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. టపాసులు కాల్చొద్దని హెచ్చరించారు. టీడీపీ శ్రేణుల వద్ద ఉన్న టపాసులను బలవంతంగా లాక్కొని.. పోలీసు వాహనంలో తీసుకువెళ్లారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ శ్రేణులు తీవ్రంగా మండిపడ్డారు. తమ నాయకుడికి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లను చేయటం తప్పా అని ప్రశ్నిస్తున్నారు. రానురానూ పోలీసులు టీడీపీ కార్యకర్తల పట్ల విధిస్తున్న ఆంక్షలు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూర్తి వివవరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ యువగళం పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. 61వ రోజుకు చేరుకున్న పాదయాత్ర.. ఈరోజు పిల్లిగుండ్ల నుంచి నారా లోకేశ్ పాదయాత్రను కొనసాగించారు. దీంతో భారీగా రోడ్లపైకి వచ్చిన స్థానిక ప్రజలు.. లోకేశ్ను కలిసి తమ సమస్యలను వివరిస్తున్నారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ లోకేశ్ ముందుకు సాగుతున్నారు. ఈ మధ్యాహ్నం ఉరవకొండ నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర కొనసాగనుంది. ఈ క్రమంలో అనంతపురం జిల్లా పోలీసులు టీడీపీ కార్యకర్తల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి.