Demolished Temple Premises By Officials: వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణాన్ని కూల్చివేసిన అధికారులు
Published: May 17, 2023, 9:39 AM

Demolished Temple Premises By Officials : కృష్ణా జిల్లా నాగాయలంకలోని శ్రీరామపాద క్షేత్రంలో నిర్మా ణంలో ఉన్నవేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని పాత ఆలయ కట్టడాలను ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మంగళవారం పంచాయతీ అధికారులు కూల్చివేశారు. ఆలయ ధర్మకర్త గడ్డిపాటి నాగేశ్వరరావు కట్టడాలను కూల్చివేయకుండా కొంత సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. కానీ అధికారులు అందుకు ససేమిరా అంటూ జేసీబీతో కూల్చివేతకు ముందడుగు వేశారు.
ఆలయ నిర్మాణంలో గడ్డిపాటి నాగేశ్వరరావుకు మద్దతు పలుకుతున్న మాజీ ఎంపీపీ సజ్జ గోపాల కృష్ణ, టీడీపీ మండల అధ్యక్షుడు మెండు లక్ష్మణ రావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయకుండా అడ్డుకున్నారంటూ వారిని కోడూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ సమయంలో కొంత ఉద్రిక్తత పరిస్థతి నెలకొంది. పంచాయతీ అధికారులు కాసులకు కక్కుర్తిపడి వేంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని, ఓ ప్రముఖ వ్యక్తి ఈ తంతు నడిపిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త ఆరోపించారు. ఆ వ్యక్తి వల్ల తనకు ప్రాణ హాని ఉందని గతంలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాననీ, కానీ ఫలితం లేక పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.