Contract Employees Union Demands పెండింగ్ జీతాలు చెల్లించాలి.. హామీ మేరకు రెగ్యులరైజ్ చేయాలి: కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం
Contract Employees Union Demands: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు మినిమం టైం స్కేల్, పార్ట్ టైం, ఫుల్ టైం, కంటింజెంట్ ఉద్యోగుల్ని క్రమబద్దీకరించాలని కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. విజయవాడలో ఈ మేరకు జేఏసీ రాష్ట్ర సదస్సును నిర్వహించారు. జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ.. 1983, 1993 మధ్యలో మినిమం టైం స్కేల్తో విధులలో చేరిన వారిని క్రమబద్ధీకరించాలన్నారు. 2014 ముందు వరకూ ఉన్న వారిని రెగ్యులర్ చేసేందుకు క్యాబినెట్ ఆమోదించిందని.. వారి కంటే సీనియర్లైన తమను కూడా క్రమబద్ధీకరించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మినిమం టైం స్కేల్ ఉద్యోగులు సుమారు 3000 మంది ఉన్నారన్నారు. గ్రామ పంచాయతీలలో పని చేస్తున్న 490 మంది మినిమం టైం స్కేల్ ఉద్యోగులకు.. 29 నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే వారికి పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేసి.. తమ న్యాయమైన డిమాండ్లని ప్రభుత్వం పరిష్కరించాలని జేఏసీ నేతలు కోరారు.