No Result In Jaganannaku Chebudam: మట్టి తవ్వకాలపై 'జగనన్నకు చెబుదాం'లో ఫిర్యాదు.. అధికారులు వచ్చి వెళ్లగానే..
Complaint On Illegal Soil Excavation to Jaganannaku Chebudam : పల్నాడు జిల్లా అమరావతి మండలం యండ్రాయి గ్రామంలో రెండు రోజులుగా మైనర్ ఇరిగేషన్ చెరువులో అధికార పార్టీ నేతలు అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. దీనికి సంభందించి ఓ గ్రామస్థుడు 'జగనన్నకు చెబుదాం'లో ఫిర్యాదు చేశాడు. సంబంధిత అధికారులకు ఫిర్యాదును బదిలీ చేయడంతో.. మైనింగ్ అధికారులు క్షేత్ర స్థాయిలో చెరువును పరిశీలించారు. అధికారుల ఆదేశాల మేరకు మట్టి తవ్వకాలను వైఎస్సార్సీపీ నేతలు తాత్కాలికంగా నిలిపివేశారు. అధికారులు వెళ్లిన కొంతసేపటికే మరలా అక్రమ మట్టి తవ్వకాలును ప్రారంభించారు. ఈ లోపే సమస్య పరిష్కారం అయిందని ఫిర్యాదుదారుడి చరవాణికి సందేశం వచ్చింది. ఈ సందేశం చూసిన ఫిర్యాదుదారుడు, గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జగనన్నకు చెబుదాంలో ఫిర్యాదు చేసిన సమస్యలు పరిష్కారం కావడం లేదని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై సంబంధిత అధికారుల్ని విలేకర్లు ప్రశ్నించగా ఫిర్యాదుదారుడికి మాత్రమే వివరాలు తెలియజేస్తామని బదులు ఇచ్చాడు. దీంతో ఈ విషయం వివాదస్పదమవుతోంది.