Boat Overturned in Godavari: గోదావరిలో పడవ బోల్తా.. ఇద్దరు గల్లంతు
Published: May 23, 2023, 3:50 PM

Boat Overturned In Godavari River And Two Were Lost : పశ్చిమ గోదావరి జిల్లా వశిష్ట గోదావరిలో ప్రమాదం చోటుచేసుకుంది. వశిష్ట గోదావరిలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గల్లంతయ్యారు. కొబ్బరికాయల లోడుతో వెళ్తున్న సమయంలో పడవ ప్రమాదవశాత్తూ నదిలో మునిగిపోయింది. యలమంచిలి మండలం కంచు స్తంభంపాలెం నుంచి పడవపై కొబ్బరికాయల లోడుతో ఆచంట మండలం భీమలాపురం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పడవలో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. మరో ఇద్దరు మాత్రం గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో భీమలాపురం గ్రామానికి చెందిన కుడిపూడి పెద్దిరాజు, దొడ్డిపట్ల గ్రామానికి చెందిన శిడగం రమణగా గుర్తించారు. జడ్డు సత్య నారాయణ, తాడికొండ సాంబశివ రావు, దేవి నాగరాజు సురక్షితంగా బయటపడ్డారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు హూటాహూటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అధికారులు గజ ఈతగాళ్ల సహాయంతో గల్లంతైన కుడిపూడి పెద్దిరాజు, శిడగం రమణ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.