ఈ పండ్లను కలిపి తింటే యమ డేంజర్.. అస్సలు తినకూడని కాంబినేషన్లు ఇవే!

author img

By

Published : Mar 9, 2023, 6:23 AM IST

dangerous fruit combinations

శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలను మనం ఆహారం ద్వారా తీసుకోవాలి. మనం సాధారణంగా తీసుకునే ఆహారం ద్వారా పూర్తిస్థాయిలో పోషకాలు అందకపోతే అనారోగ్యం బారినపడాల్సి వస్తుంది. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వైద్యులు పండ్లను ఆహారంలో భాగంగా చేర్చుకోవాలని సలహా ఇస్తుంటారు. చాలామంది పండ్లను తినడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండగా.. కొంతమంది పండ్లను తీసుకునే విధానంలో చేసే తప్పు వల్ల అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. అదెలాగో తెలుసుకుందాం..!

ప్రతిరోజు ఒక యాపిల్ తింటే వైద్యుడి దగ్గరకు వెళ్లాల్సిన అవసరం రాదు అనే నానుడి అందరికీ తెలిసిందే. పండ్లను తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అంది, ఆరోగ్యంగా ఉండగలం అని అర్థం. అయితే పండ్లను తినే అలవాటు ఉన్న వారిలో కొంతమంది చేసే కొన్ని తప్పుల వల్ల అనారోగ్యం బారినపడుతున్నారు. అసలు పండ్లు తీసుకోవడంలో తప్పు ఎక్కడ జరుగుతుందో తెలుసా..!

పండ్లను నేరుగా తినడం అనేది అన్నింటి కంటే ఉత్తమమైన మార్గంగా వైద్యులు చెబుతారు. యాపిల్, అరటిపండు లాంటివి నేరుగా తినడం వల్ల శరీరానికి అన్ని రకాల పోషకాలు అందుతాయి. కానీ చాలామంది ఇలా నేరుగా తినడానికి ఇష్టపడకపోవచ్చు. దీంతో రకరకాల జ్యూస్​లు లేదంటే వేరే వాటితో కలిపి తినవచ్చు. సలాడ్​లు, చాట్​లు, షేక్​లు అంటూ వివిధ పేర్లుతో, రకరకాల కాంబినేషన్​ల్లో పండ్లను తీసుకుంటూ ఉంటారు. పండ్లను తీసుకోవడం అనేది ఆరోగ్యానికి మేలు చేసేదే అయినా పండ్లతో కలిపి కొన్ని పదార్థాలను తీసుకోవడం వల్ల.. శరీరానికి తీవ్రం నష్టం కలుగుతుంది. ఏ పండ్లను ఎలాంటి ఆహారాలతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి నష్టం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

క్యారెట్, ఆరెంజ్ కలిపి తీసుకోవడం:
మన ఆరోగ్యాన్ని కాపాడటానికి క్యారెట్, ఆరెంజ్ ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే వీటిని కలిపి తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి చేటు చేస్తాయి. వీటిని కలిపి తినకూడదు. అలాగే చాలామంది క్యారెట్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్​ను కలిపి తీసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కూడా తీవ్ర నష్టం కలుగుతుంది. ఈ కాంబినేషన్​ను తీసుకుంటే గుండెల్లో మంట పుట్టడం, మూత్రపిండాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

బొప్పాయి, నిమ్మకాయ:
సిట్రస్ జాతికి చెందిన నిమ్మకాయ వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. చాలామందికి తినే ఆహారంలో నిమ్మకాయను పిండుకొని తినే అలవాటు ఉంటుంది. అయితే కొంతమంది బొప్పాయి మీద నిమ్మకాయ పిండుకొని తినే అలవాటు కూడా ఉంటుంది. ఇది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. దీని వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలో తీవ్ర వ్యత్యాసం ఏర్పడుతుంది.

జామకాయ, అరటిపండు కాంబినేషన్:
పేదవాడి యాపిల్​గా పేరున్న జామకాయను ప్రతిరోజు తినడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వీలవుతుంది. అలాగే అనేక పోషకాలను కలిగిన అరటిపండును తినాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే ఈ రెండింటిని కలిపి తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి తీవ్ర నష్టం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నేరుగా కానీ, సలాడ్ రూపంలో, జ్యూస్ రూపంలో లేదంటే మరేదైనా రూపంలో తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి ముప్పు తప్పదని అంటున్నారు. దీని వల్ల శరీరంలో గ్యాస్ పెరుగుతుందని దీంతో పాటుగా తలనొప్పి కూడా వస్తుందని చెబుతున్నారు.

పాలు, ఆరెంజ్​లు:
ఎన్నో పోషకాలకు నెలవైన పాలను ప్రతిరోజు ఒక గ్లాస్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే పాలు, ఆరెంజ్​ను కలిపి తీసుకుంటే మాత్రం శరీరానికి నష్టం తప్పదు. ఈ కాంబినేషన్​ను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. ఫలితంగా అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లవుతుంది.

పాలు, పైనాపిల్:
పైనాపిల్​లో బ్రొమిలేన్ అనే ప్రత్యేక మూలకం ఉంటుంది. ఇది కేవలం పైనాపిల్​లో మాత్రమే ఉంటుంది. పైనాపిల్​ను పాలతో కలిపి తీసుకుంటే, పైనాపిల్​లోని బ్రొమిలేన్ అనారోగ్య సమస్యలను సృష్టిస్తుంది. ఫలితంగా కడుపులో గ్యాస్, కడుపు మంట, ఇన్ ఫెక్షన్, తలనొప్పి లాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

పండ్లను కూరగాయలతో కలిపి తీసుకోవద్దు:
పండ్లను చాలామందికి నేరుగా తినకుండా కూరగాయలతో కలిపి తింటుంటారు. నిజానికి పండ్లలో చక్కెర స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. పండ్లను కూరగాయలతో కలిపి తీసుకుంటే విషంలా మారతాయి. దీంతో విరేచనాలు, తలనొప్పి, ఇన్ ఫెక్షన్, కడుపు నొప్పితో పాటు ఇతర అనేక ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.