ETV Bharat / state

Illegal Layouts: ఎవడ్రా మనల్ని ఆపేది.. అక్రమ లేఅవుట్లతో రెచ్చిపోతున్న వైఎస్సార్​సీపీ నాయకులు

author img

By

Published : Jun 30, 2023, 8:14 AM IST

Updated : Jun 30, 2023, 11:01 AM IST

Unauthorised Layout: ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో అనధికార లేఅవుట్లు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేయడంతో పాటు ఇష్టారాజ్యంగా లే అవుట్‌లు ఏర్పాటు చేసి.. అందినకాడికి దోచుకుంటున్నారు. వెంచర్‌ల ముసుగులో ప్రభుత్వ భూములనూ వదలడం లేదు. పనిలో పనిగా సెటిల్ మెంట్లు చేస్తూ.. అక్రమ సంపాదన కోసం దాడులకు తెగబడుతున్నారు. ఈ అక్రమాల వెనుక అధికార పార్టీ నేతల హస్తముందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

Etv Bharat
Etv Bharat

అక్రమ లేఅవుట్లతో రెచ్చిపోతున్న వైఎస్సార్​సీపీ నాయకులు

Illegal Layouts : ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో అనధికార లేఅవుట్లు విచ్చలవిడిగా పెరిగి పోతున్నాయి. అధికార పార్టీ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారుల అవతారం ఎత్తి, ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేయడంతో పాటు, ఇష్టారాజ్యంగా లే అవుట్​లను ఏర్పాటు చేసి లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగం అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే లే అవుట్​లు ఏర్పాటు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా వెయ్యికి పైగానే అనధికార లే అవుట్​లు ఉన్నట్లు అంచనా. వెంచర్ల ముసుగులో ప్రభుత్వ భూములను కూడా అధికార పార్టీ నాయకులు కబ్జా చేస్తున్నారనీ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పనిలో పనిగా సెటిల్ మెంట్లు చేస్తూ అక్రమ సంపాదన కోసం పోటీపడి దాడులకు తెగబడుతున్న సందర్భాలు కడప నగరంలో వెలుగులోకి వస్తున్నాయి.

అధికార పార్టీ నేతల కొత్త అవతారం : ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో ఎటు చూసినా అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్నాయి. ప్రైవేటు స్థలాన్ని కొనుగోలు చేసి వాటిలో వెంచర్లు వేసి రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారుల సహకారంతో పక్కనే ఉన్న ప్రభుత్వ భూములను వెంచర్‌లలోకి కలిపేయడం లాంటివి కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. కొన్ని చోట్లయితే వైఎస్సార్సీపీ నేతలే రియల్ ఎస్టేట్ వ్యాపారుల అవతారమెత్తి భూ కబ్జాలకు పాల్పడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. దాదాపు 400 వరకు అనధికార లేఅవుట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటిలోని 200 అనధికార లే అవుట్ల యజమానులకు అధికారులు నోటీసులు జారీ చేసి 60 లక్షల రూపాయలు అపరాధ రుసుము వసూలు చేశారు. కానీ గుర్తించని వాటి సంఖ్య మూడు రెట్లు అధికంగానే ఉందనేది అనధికార సమాచారం. ఈ భూదందాలతోనే ఈ నెల 23న కడపలో వైఎస్సార్సీపీ నేత శ్రీనివాసుల రెడ్డిని దారుణంగా హత్య చేశారని ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.

వైఎస్సార్సీపీ నాయకులుకు నిబంధనలు ఉండవా? : రాజంపేట, రైల్వేకోడూరు, పుల్లంపేట, రామాపురం, రాయచోటి, పులివెందుల్లోనూ అనధికార లేఅవుట్లు వెలిశాయి. లేఅవుట్ అనుమతి పొందడానికి ముందుగా 3 శాతం రుసుము చెల్లించి ల్యాండ్ కన్వర్షెన్ చేయించుకోవాలి. రియల్ వెంచర్లలో 40 అడుగుల స్థలాన్ని రహదారి కోసం, 10 శాతం భూమిని ప్రజా ప్రయోజనార్థం ఖాళీగా వదిలి పెట్టాలి. మురుగు కాల్వలు, వీధి లైట్ల కోసం 2 శాతం స్థలం వదిలి పెట్టాలి. కానీ స్థిరాస్తి వ్యాపారుల ముసుగులో ఉన్న అధికార పార్టీ నేతలు మాత్రం ఈ నిబంధనలన్నింటినీ గాలికి వదిలేస్తున్నారు. నామమాత్రంగా స్థలం వదిలి మిగిలినదంతా ప్లాట్ల రూపంలో విక్రయించేస్తున్నారు.

ప్రభుత్వ భూములను వదలటం లేదని ఆరోపణ : సీకే దిన్నె ప్రాంతంలోని మూలవంక వద్ద 52 ఎకరాల్లో ఓ వైఎస్సార్సీపీ నేత రియల్ వెంచర్ వేసి స్థలాలు విక్రయిస్తున్నారు. అది ప్రభుత్వ స్థలమని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండటంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

'జిల్లా వ్యాప్తంగా అనేక అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అక్రమ లేఅవుట్​లో కనీస మోలిక సదుపాయాలు కల్పించడం లేదు. దీనిపై సమగ్ర విచారణ జరప వలసిందిగా కోరుతున్నాము.'- కడప ప్రజలు

Last Updated :Jun 30, 2023, 11:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.