ETV Bharat / state

Layouts Scam: పుట్టగొడుగుల్లా అక్రమ లేఅవుట్​లు.. అధికార పార్టీ నేతల సహకారంతో మూడు పువ్వులు ఆరు కాయలుగా వ్యాపారం

author img

By

Published : Jun 27, 2023, 1:34 PM IST

Illegal Layouts in AP: కొత్త జిల్లాల ఏర్పాటుతో రియల్ ఎస్టేట్ ఊపందుకుంది.. అక్కడా.. ఇక్కడా అని లేదు.. ఎక్కడ ఖాళీ ఉంటే.. అక్కడ ఖాళీ స్థలాలు ప్లాట్లుగా రూపాంతరం చెందుతున్నాయి. రియల్ మాఫియాకు అధికారపార్టీ కూడా అండగా ఉండటంతో.. అక్రమ లేఅవుట్​లు.. మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. అనుమతులు లేకపోయినా అధికార పార్టీకి చెందిన వారు లే అవుట్​లు వేసి కోట్లు దండుకుంటున్నారు.

Layouts Scam
Layouts Scam

Illegal Layouts in AP: పెరిగిన భూముల ధరలను సొమ్ము చేసుకొనే లక్ష్యంతో స్థిరాస్తి వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా వ్యవసాయ భూములను ఇళ్ల స్థలాలుగా మార్చేస్తూ కోట్ల రూపాయల దండుకొంటున్నారు. కర్ణాటక సరిహద్దులోని పుంగనూరు ప్రాంతంలో భూముల ధరలు రెట్టింపు అవ్వడంతో వ్యవసాయ భూములను ఇళ్ల స్థలాలుగా అనధికారికంగా లేఅవుట్​లు వేసి అనుమతులు లేకున్నా ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారు. స్ధలాల వద్ద ఇళ్లు కట్టే సమయానికి రోడ్లు, కాలువలు కన్పించక కొనుగోలుదారులు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. పుంగనూరులో అనధికార లేఅవుట్​లు వెలసిన తీరుపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం..

తారాస్థాయికిి చేరిన స్థిరాస్తి వ్యాపారుల అక్రమాలు: చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో స్థిరాస్థి వ్యాపారుల అక్రమాలు తారాస్థాయికి చేరాయి. స్థిరాస్తి వ్యాపారులు అనధికారికంగా వ్యవసాయ భూములను ఇళ్ల స్థలాలుగా లేఅవుట్​లు వేసి అనుమతులు లేకున్నా ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారు. వాస్తవాలను కప్పిపుచ్చి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. దీంతో కొనుగోలుదారులు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. ఇళ్లు కట్టుకుందామనే సరికి సరైన వసతులు లేక ఏమి చేయాలో పాలుపోని పరిస్ధితి ఉంది.

పుంగనూరు పట్టణ పరిధిలో 70 ఎకరాల్లో అక్రమ లేఅవుట్​లు వెలిశాయి. ఈ విషయం తెలుసుకున్న పురపాలక అధికారులు సుమారు 20 ఎకరాల్లో గల వ్యాపారులకు నోటీసులు అందజేశారు. నిబంధనల మేరకు జీవో నెం 275 ప్రకారం వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా తగిన రుసుం చెల్లించి రెవెన్యూ శాఖ ద్వారా అనుమతి పొందాలి. భూమికి సంబంధించిన దస్త్రాలపై ఎలాంటి తగాదాలు ఉండకుండా.. నిర్దేశిత స్థలంలో 10 శాతం భూమిని సామాజిక అవసరాలకు కేటాయించాలి. ఆ భూమిని పురపాలకశాఖకు రిజిస్టర్​ చేయాలి. లేఅవుట్​లలో అన్ని రకాల వసతులు కల్పించాలి. అయితే పుంగనూరు పట్టణ పరిధిలో అలాంటి నిబంధనలు అమలు కావడం లేదు.

పట్టణ పరిధిలోని భగత్ సింగ్ కాలనీ, రహ్మత్‍ నగర్, వినాయకనగర్, ఎన్జీవో కాలనీ, మినీ బైపాస్, వనమలదిన్నె, రామసముద్రం, కృష్ణమరెడ్డిపల్లె, రాగానిపల్లె మార్గాల్లో అక్రమ లేఅవుట్​లు వెలిశాయి. ఇప్పటికే పలువురు వ్యాపారులకు పురపాలక పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు నోటీసులు ఇచ్చినా వ్యాపారాలు, రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి.

అనుమతులు లేకుండా ప్లాట్లు వేసిన రిజిస్ట్రేషన్​ చేస్తున్న అధికారులు: బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం ప్రశాంతతకు మారుపేరు. సముద్ర తీరంలో సేదతీరేందుకు ప్రైవేటు అతిథిగృహాలు. ఏ అధికారి అయినా.. చిరుద్యోగి అయినా చీరాలలో పనిచేస్తే.. ఇక్కడే ఇల్లు కట్టుకుని స్థిరపడతారు.. ఒంగోలు నుంచి కత్తిపూడి వరకు 216 జాతీయ రహదారి చీరాల మీదుగా వెళుతుంది. ఈ నేపథ్యంలో చీరాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది. పంట పొలాలను సైతం ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్నారు. అయితే అనుమతులు లేకుండా ప్లాట్లు వేసి విక్రయాలు జరుపుతుండగా వాటిని అధికారులు రిజిస్ట్రేషన్లు కూడా చేస్తున్నారు. ఈ అక్రమ లేఅవుట్ల వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా అడిగితే అధికారులు డొంక తిరుగుడు సమాధానాలు ఇస్తున్నారు.

వేటపాలెం మండలం వేటపాలెం, చల్లారెడ్డిపాలెం, పాపాయిపాలెం, అక్కాయపాలెం, కొత్తపేట గ్రామ పంచాయతీ కార్యాలయాల పరిధిలో గ్రామ పంచాయతీ అనుమతిలేని లేఅవుట్స్, అపార్టుమెంట్స్‌ యజమానులకు జారీ చేసిన నోటీసుల నకళ్లను సమర్పించాలని సమాచార హక్కు చట్టం కింద ఒకరు అడిగితే.. ఈ నెల 16న పంచాయతీ కార్యదర్శి నుంచి విచిత్ర సమాధానం వచ్చింది. ‘అక్కాయపాలెం పంచాయతీలో అక్రమ లేఅవుట్ల యజమానుల పేర్లు అందుబాటులో లేవు. అందువల్ల నోటీసులు జారీ చేయలేదు’ అని ఆ పంచాయతీ కార్యదర్శి సమాధానం ఇచ్చారు. మరో ప్రశ్నకు.. 'గ్రామ పంచాయతీ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అనుమతి లేని లేఅవుట్లలో అపార్టుమెంట్లు నిర్మించలేదు' అని పేర్కొన్నారు. ఇంకో ప్రశ్నకు 'అక్కాయపాలెం గ్రామ పంచాయతీ అనుమతిలేని లే అవుట్లవద్ద గ్రామ పంచాయతీ సిబ్బంది ఆయా భూముల్లో ఏర్పాటు చేసిన బోర్డుల ఫొటోలను జతపరిచాం. వీటిని తొలగించినట్లు మాకు సమాచారం లేదు. దీనివల్ల ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు’ అని పేర్కొన్నారు.

దరఖాస్తుదారుడు మాత్రం..సమాధానం ఇచ్చే రోజు ఫొటోలు ఉంటాయని మరసటిరోజు కనిపించడంలేదని పేర్కొన్నారు. యజమానుల పేర్లు అందుబాటులో లేనందున నోటీసులు ఇవ్వలేదని సమాధానం ఇవ్వడం అధికార అసమర్థతకు నిదర్శనం. జిల్లా రిజిస్ట్రేషన్ అధికారులు కొన్ని సర్వే నెంబర్లు ఉన్న భూములు రిజిస్ట్రేషన్ చేయకూడదని చెప్పినా అవేమి పట్టనట్లు స్థానిక అధికారులు రిజిస్ట్రేషన్లు కూడా చేస్తున్నారు. అనధికార లే అవుట్లలో అధికార పార్టీ నాయకుల ఆశీస్సులు మెండుగా ఉండటంతో అక్రమ లే అవుట్ల వ్యాపారం జోరుగా సాగుతుంది.

యథేచ్చాగా అక్రమ లే అవుట్లు: పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలో అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అక్రమార్కులు అనుమతులు లేకుండానే వ్యవసాయ భూములను వెంచర్లుగా మార్చి రూ.కోట్లు గడిస్తున్నారు. వీరికి రాజకీయ నేతల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. పలువురు అధికారికంగా ల్యాండ్‌ కన్వర్షన్‌ కోసం దరఖాస్తు చేస్తున్నా.. తక్కువ విస్తీర్ణం చూపిస్తున్నారు. రియల్‌ వెంచర్లకు అనుమతులు లేకపోయినా.. విద్యుత్తు అధికారులు సరఫరా అందిస్తున్నారు. పల్నాడు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ నిబంధనల ప్రకారం.. విద్యుత్తు సరఫరా ఇవ్వకూడదు. వీరికి అధికారుల సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తున్నాయి. ప్లాట్ల విక్రయాలు అడ్డుకోవాల్సిన పంచాయతీ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడటం లేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.