ETV Bharat / state

మిస్టరీ వీడిన డీడీ అచ్చన్న మర్డర్ కేసు.. మీడియా ముందుకు నిందితులు..

author img

By

Published : Mar 26, 2023, 2:18 PM IST

DD Acchanna Murder Case: అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కడప పశు సంవర్ధశాఖ డిప్యూటీ డైరెక్టర్ అచ్చన్నది హత్యేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనలో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సోమవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు.

kadapa dalit officer dies in suspicious condition
మిస్టరీ వీడిన డీడీ అచ్చన్న మర్డర్ కేసు

DD Acchanna Murder Case: వైయస్సార్ కడప జిల్లాలో అనుమానాస్పద రీతిలో కడప పశు సంవర్ధకశాఖ డిప్యూటీ డైరెక్టర్​గా పనిచేస్తున్న దళిత ఉద్యోగి అచ్చన్న మృతి చెందిన ఘటన అధికార వర్గాల్లో సంచలనం రేపింది. అయితే ఈ ఘటనపై పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపిన పోలీసులు.. అచ్చన్నది హత్యేననే నిర్ధారణకు వచ్చారు. ఈ నెల 24న రామాపురం మండలం గువ్వల చెరువు ఘాట్​లో అనుమానాస్పద స్థితిలో లభ్యమైన అచ్చెన్న మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆ కేసు దర్యాప్తులో భాగంగా పలువురిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించగా.. అచ్చన్నది హత్యగా తేలినట్లు సమాచారం.

గత కొంతకాలంగా కడప పశు సంవర్ధక శాఖలో డిప్యూటీ డైరెక్టర్​గా పనిచేసే అచ్చన్నకు, అక్కడ ఏడీలుగా పనిచేసే మరో ముగ్గురు ఉద్యోగులకు మధ్య విధి నిర్వహణలో వివాదం నడుస్తోంది. ఈ వ్యవహారం గత ఆరు నెలలుగా జరుగుతోంది. ఈ విషయాన్ని పశు సంవర్ధకశాఖ వారు.. రాష్ట్రంలోని ఉన్నతాధికారులతో పాటు కలెక్టర్, ఎస్పీల దృష్టికి తీసుకుని వెళ్లారు. వారి మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు త్రిసభ్య కమిటీ కూడా విచారణ చేపట్టింది.

అయితే ఏడీలు విధి ప్రభుత్వ నిబంధనలు, ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించట్లేదని, దీంతో పాటు వైద్య సేవల్లో తనకు సహకారం అందించట్లేదంటూ.. డీడీ అచ్చన్న గవర్నమెంటుకు ముగ్గురు ఏడీలను సరెండర్ చేశారు. అయితే డీడీ అచ్చన్ననే తమను ఇబ్బందులకు గురి చేశారంటూ రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులకు డీడీలు ఫిర్యాదు చేశారు. దీంతో సెరెండర్ అయిన ఉద్యోగులను విధుల్లోకి చేర్చుకోవాలంటూ ఉన్నత స్థాయి అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. అయితే ఏడీలు వైద్యశాలలోకి రాగా.. డీడీ వారిని విధుల్లోకి చేర్చుకోలేదు.

ఈ విషయంపై అప్పట్లో ధర్నాలు కూడా జరిగాయి. అయితే ఉన్నట్లుండీ.. ఈ నెల 12వ తేదీ నుంచి డీడీ అచ్చన్న కనిపించకుండాపోయారు. ఆయనను సస్పెండ్ చేస్తూ 14వ తేదీన ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అదే రోజు అచ్చన్న కుటుంబ సభ్యులు అచ్చన్న కనిబడుటలేదని కడప పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అదృశ్యం కేసు నమోదు చేశారు. అయితే అచ్చన్న అదృశ్యమైన 13 రోజుల తర్వాత.. ఈనెల 24న అనుమానాస్పద స్థితిలో ఆయన మృతదేహం లభ్యమైంది.

దీంతో కార్యాలయంలో పనిచేసే సిబ్బందిని పోలీసులు విచారించగా హత్య కోణం వెలుగులోకి వచ్చింది. కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగితో పాటు మొత్తం నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. అచ్చన్నను కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు విచారణలో తేలింది. సోమవారం నిందితులను పోలీసులు.. మీడియా ఎదుట ప్రవేశ పెట్టనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.