శ్రీకాకుళం జిల్లా ఉద్దానం గతంలో వచ్చిన రెండు తుపాన్ల దెబ్బ నుంచి కోలుకోకుండానే మరో ఉపద్రవం వచ్చి పడింది. తెల్లదోమ కొబ్బరి తోటలపై ప్రతాపం చూపుతుండటంతో రైతులు విలవిల్లాడుతున్నారు. ఉద్యానవన పంటలు అధ్వాన్నంగా మారిపోతున్నాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కంటి మీద కునుకు లేకుండా విజృంభిస్తున్న తెల్లదోమ నియంత్రణకు ఎన్ని ప్రయత్నాలు చేసినా, నిరుపయోగంగా మారుతున్నాయని రైతులు వాపోతున్నారు. గతేడాది అక్కడక్కడ ఉన్న మహమ్మారి నెమ్మదించి, ఒక్కసారిగా కొబ్బరి తోటలపై విరుచుకుపడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కవిటి మండలం తీర ప్రాంత గ్రామాల్లో చిన్న మెుక్కను సైతం వదిలి పెట్టకుండా తెల్లదోమ నాశనం చేస్తోందని వాపోయారు.
ఒక్క కొబ్బరి తోటల్లోనే కాకుండా, జీడి, మామిడి, పనస, అరటి వంటి వాటిపైనా తెల్లదోమ ప్రభావం తీవ్రంగా ఉందని వారు తెలిపారు.
లక్షలాది కుటుంబాలు కేవలం కొబ్బరి సాగుపైనే ఆధారపడి ఉన్నాయనీ, ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: వైరల్: అన్నం బంతైతే ఇలాగే ఉంటుంది..!