ETV Bharat / state

పెన్‌కాక్‌ సిలాట్ క్రీడలో రాణిస్తున్న ఒంగోలు యువత.. ఆసియా యూత్‌ గేమ్సే లక్ష్యం!

author img

By

Published : Aug 18, 2021, 12:15 PM IST

pencock
పెన్‌కాక్‌ సిలాట్ క్రీడ

క్రీడల ద్వారా గుర్తింపు పొందేవారు కొందరైతే.. తమ వల్ల ఆటకు గుర్తింపు తీసుకురావాలనే వారు మరికొందరు. అలా.. తమ ప్రదర్శనలతో భారత్‌లో కనుమరుగవుతున్న పురాతన క్రీడకు పునర్వైభవం కల్పించేందుకు కృషి చేస్తున్నారు.. ఒంగోలు కుర్రాళ్లు. ఇండోనేషియా వంటి దేశాలు అదరగొడుతున్న పెన్‌కాక్‌ సిలాట్‌ క్రీడలో.. పతకాల వేట కొనసాగిస్తున్నారు. బరిలోకి దిగి పంచ్‌ కొడితే పతకం దిగిరావాల్సిందే..! అనే స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నారు.

పెన్‌కాక్‌ సిలాట్ క్రీడలో రాణిస్తున్న ఒంగోలు యువత.

చూస్తుంటే బాక్సింగ్‌లా ఉంది. కానీ, వీరు మాత్రం కుస్తీలా పోటీపడుతున్నారు. ఇంతకు ఇదేం ఆట అనుకుంటున్నారా ? ఈ క్రీడ పేరు పెన్‌కాక్‌ సిలాట్‌. మార్షల్‌ ఆర్ట్స్‌లో ఓ భాగం. ఇండోనేషియాలో బాగా ఆదరణ పొందుతున్న ఈ క్రీడలో భారత్‌ నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ పతకాలు సాధిస్తున్నారు ప్రకాశం జిల్లా యువ క్రీడాకారులు.

వాస్తవానికి ఈ క్రీడ చిత్తూరు- తమిళనాడు సరిహద్దుల్లో అప్పట్లో బాగా ప్రాచుర్యంలో ఉండేది. కాలక్రమేణ మన దగ్గర అంతరించిపోయినప్పటికీ.. మిగతా దక్షిణాసియా దేశాల్లో బాగా ఆదరణ దక్కించుకుంటోంది. ఇప్పుడిప్పుడే మన దేశంలో కూడా గుర్తింపు లభిస్తున్న ఈ క్రీడలో యువతను ప్రొత్సాహించేలా పెన్‌కాక్‌ సిలాట్‌ అసోసియేషన్‌ కృషి చేస్తోంది. అందులో భాగంగా.. ప్రకాశం జిల్లా ఒంగోలులో కొంత మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు.

ఒంగోలుకు చెందిన మనోజ్‌ సాయి వీరికి శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడున్న వారిలో కొందరు రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రతిభ చాటుతూ.. పతకాలు సాధిస్తున్నారు. మూడేళ్ళ క్రితం అమృత్ సర్‌లో జరిగిన జాతీయ క్రీడల్లో 60 మంది క్రీడాకారులు తెలుగురాష్ట్రాలనుంచి పాల్గొన్నారు. అందులో ఒంగోలుకు చెందిన క్రీడాకారులు 7 బంగారు పతకాలు సాధించగా, మరో 8 మంది ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నారు.

అంతర్జాతీయ పోటీల్లోనూ..

సింగపూర్‌లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లోనూ ఒంగోలు క్రీడకారులు అద్భుత ప్రదర్శన కనబర్చారు. ముగ్గురు క్రీడాకారులు బంగారు పతకం కైవసం చేసుకున్నారు. ఆ తరువాత... వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో కూడా పాల్గొని.. ప్రశంసలు దక్కించుకున్నారు.

ఆసియా యూత్‌ గేమ్సే లక్ష్యంగా..

కరోనా కారణంగా కొన్ని టోర్నీలు వాయిదా పడ్డాయి. అయినా సరైన డైట్‌ తీసుకుంటూ సాధన చేస్తున్నారు. త్వరలో జరగబోయే ఆసియా యూత్‌ గేమ్స్‌లో దేశానికి పతకం తీసుకు రావడమే లక్ష్యంగా శ్రమిస్తున్నారు.. ఈ మార్షల్‌ ఆర్ట్స్‌ కుర్రాళ్లు. మన దగ్గర క్రీడలంటే క్రికెట్‌, బ్యాడ్మింటన్ వంటివే గుర్తుకు వస్తాయి. కానీ, వాటికి మించిన క్రీడలు ఇంకా ఎన్నో ఉన్నాయి. మెున్నటి వరకు పెద్దగా ఎవరికి తెలియని .. జావెలిన్ త్రో కూడా నీరజ్‌ చోప్రా దెబ్బతో... అందరి నోళ్లలో నానుతోంది. అలా... తమ ప్రదర్శనల ద్వారా ఈ క్రీడకు మరింత ఆదరణ తీసుకువస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.. ఈ క్రీడకారులు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో ఏటా పాము కాటుకు ఎంత మంది బలవుతున్నారో తెలుసా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.