ETV Bharat / state

Extra Income Scam : ఘరానా మోసం.. అదనపు ఆదాయమని నమ్మించి.. 19 లక్షలు వసూలు.. చివరకు

author img

By

Published : May 24, 2023, 8:59 AM IST

cyber crime
విజయవాడ సైబర్​ క్రైం

Vijayawada Job Fraud : సైబర్‌ కేటుగాళ్లు యువతకు గాలం వేసి లక్షలు దోచేస్తున్నారు. రోజుకు ఓ గంట సేపు ఇంట్లోనే ఉండి పనిచేస్తే.. నెలకు వేలాది రూపాయలు సులభంగా సంపాదించవచ్చని వాట్సాప్‌ల ద్వారా సందేశాలు పంపి మోసాలకు పాల్పడుతున్నారు. పార్ట్ టైమ్ ఉద్యోగాల పేరిట.. కొందరు బడా కంపెనీల్లో ఉద్యోగాలిప్పిస్తామని.. యువతకు గాలం వేసి లక్షలు దండుకుంటున్నారు. నిజమని నమ్ముతున్న నిరుద్యోగులు ఉద్యోగాల ఆశతో మోసగాళ్ల వలలో చిక్కుతున్నారు. ఉద్యోగం లభిస్తే చాలనే ఆలోచనలో వెనక ముందు ఆలోచించకుండా మోసాలకు గురవుతున్నారు.

యువతకు గాలం వేసి లక్షలు దోచేస్తున్న సైబర్‌ కేటుగాళ్లు

Fraud in the Name of Extra Income : ఖాళీ సమయాన్ని ఆదాయంగా మార్చుకోండి. ఇంట్లో ఉండి కొద్దిసేపు పనిచేస్తే చాలు నెలకు భారీగా నగదు సంపాదించవచ్చని సైబర్ కిలాడీలు అమాయకులకు వల వేస్తున్నారు. విజయవాడలో సాఫ్ట్​వేర్​ ఉద్యోగిగా పనిచేస్తోన్న ఓ యువతికి.. ఓ రోజు ఆమెకు పార్ట్‌టైమ్‌ జాబ్‌ పేరిట మొబైల్‌కు సందేశం వచ్చింది. అందులో ఉన్న నెంబర్‌కు ఫోన్‌ చేయగా.. యూట్యూబ్‌లో వీడియోలను లైక్‌ చేస్తే.. డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని నమ్మించారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేయటమే కాకుండా.. ఇది కూడా చేస్తే మరింత సంపాదించవచ్చని ఆమె ఆశపడింది. మోసగాళ్లు చెప్పింది నిజమని నమ్మి వారు ఇచ్చిన వెబ్‌సైట్‌కు బ్యాంకు ఖాతా వివరాలు ఇచ్చింది. అనంతరం యూట్యూబ్‌లో మూడు వీడియోలు లైక్‌ చేసింది. ఆమె ఖాతాలో 150 రూపాయలు జమ చేశారు. మరో ఆరు వీడియోలను లైక్‌ చేస్తే.. 300 రూపాయలు ఖాతాలో జమ చేసి నమ్మించారు.

ఇదే కాకుండా బిట్ కాయిన్స్‌లో పెట్టుబడి పెడితే అధిక లాభం వస్తుందని చెప్పడంతో.. విడతల వారిగా యువతి 19 లక్షల రూపాయలు మోసగాళ్ల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసింది. 21 లక్షల రూపాయలు వస్తాయని వర్చ్యువల్‌గా చూపుతున్నా.. ఆ డబ్బును డ్రా చేసే అవకాశం లేకపోవడంతో దీనిపై ఆమె నిలదీయగా.. ఆ మొత్తాన్ని తిరిగి పొందాలంటే 12 లక్షల 95 వేల రూపాయలు కట్టాలని చెప్పారు. లేదంటే కట్టిన డబ్బు తిరిగి రాదని చెప్పడంతో.. మోసపోయానని భావించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

ప్రస్తుతం ఇటువంటి నేరాలు సాధారణంగా మారయని పోలీసులు చెబుతున్నారు. బాధితుల్లో ఎక్కువగా బీటెక్, వైద్యరంగానికి సంబంధించిన వాళ్లే ఉంటున్నారని తెలిపారు. మధ్యప్రదేశ్, బిహార్‌, రాజస్థాన్, హర్యానా, దిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్ నుంచి ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలాంటి నేరాలను అరికట్టాలంటే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. యూట్యూబ్ లింక్‌లు క్లిక్ చేస్తే, గూగుల్ రివ్యూలో పోస్ట్‌లు పెడితే నగదు వస్తాయని చెప్పే వారిని నమ్మొద్దని నిపుణులు చెబుతున్నారు.

" గూగుల్​లో రివ్యూ ఇవ్వమని, కామెంట్​ చేయమని, యూట్యూబ్​ వీడియోలకు లైక్​ కొట్టమని షేర్​ చేయమని ఇలా చేస్తున్నారు. ఇలా చేస్తే ఆదాయం వస్తుందని నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు. ఎప్పుడైనా సరే మనకు ఎదైనా వెబ్​సైట్​ సూచించినప్పుడు అది నకిలీదా, నిజమా కాదా అనే అంశాలు చెక్​ చేసుకోవాలి." -సాయి సతీష్, సైబర్ సెక్యూరిటీ నిపుణుడు

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.