ETV Bharat / state

పింఛన్​లో చెత్త పన్ను కోత... పురపాలిక సిబ్బంది, వాలంటీర్ల నిర్వాకం

author img

By

Published : Jun 2, 2022, 12:42 PM IST

Pension cut: కర్నూలు జిల్లాలో కొందరు లబ్ధిదారులకు పింఛన్‌లో కోత విధించి.. మిగతా సొమ్మునే వాలంటీర్లు అందజేశారు. కుటుంబానికి ఆసరాగా ఉండే పింఛన్​లో కోత విధించటంపై లబ్ధిదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త పన్ను కట్టనందునే పింఛన్​లో ఆ డబ్బును కోత విధించి.. మిగతాది అందజేసినట్లు వాలంటీర్లు తెలిపారు. చెత్త పన్ను కట్టకపోతే అమ్మఒడి, ఇతర పథకాలు రద్దు చేస్తారంటూ వాలంటీర్లు బెదిరిస్తున్నారని వాపోయారు.

pensions
pensions

వృద్ధులు.. వితంతువులు.. వికలాంగులకు ఇస్తున్న వైఎస్సార్‌ పింఛను కానుక నగదులో కోత పెడుతున్నారు. కుటుంబానికి ఆసరాగా ఉండే పింఛను సొమ్ములో చెత్త పన్ను వసూలు చేసి లబ్ధిదారులకు గుండెకోత మిగుల్చుతున్నారు. పురపాలిక సిబ్బంది, వాలంటీర్లు కలిసి చేస్తున్న నిర్వాకంతో కొందరు పింఛనుదారులు కన్నీరుమున్నీరయ్యారు. కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు, ఆదోని మున్సిపాల్టీల పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. చెత్త పన్ను కట్టకపోతే అమ్మఒడి, ఇతర పథకాలు రద్దు చేస్తారంటూ వాలంటీర్లు బెదిరింపులకు దిగారు.

ఎమ్మిగనూరులో రూ.2 లక్షలు : ఎమ్మిగనూరు మున్సిపాల్టీలో 34 వార్డులు ఉండగా, 9,450 మంది పింఛనుదారులున్నారు. తొలిరోజు 8,434 మందికి పింఛన్ల సొమ్ము పంపిణీ చేశారు. చెత్తపన్ను చెల్లించనివారి జాబితా తీసుకొని పారిశుద్ధ్య సిబ్బంది, వాలంటీర్లు బయలుదేరారు. పింఛను ఇచ్చే ముందు ఆ ఇంటిపై ఎన్ని నెలల చెత్త పన్ను బకాయి ఉందో అంత కోత విధించి మిగిలిన సొమ్ము చేతికి ఇస్తున్నారు. ఎమ్మిగనూరు పురపాలిక పరిధిలో ఒక్కరోజే రూ.2 లక్షల చెత్త పన్ను వసూలు చేశారు.

ఆదోనిలో రూ.65 వేలు : ఆదోని మున్సిపాల్టీ పరిధిలో పింఛను నగదులో చెత్త పన్ను పోను మిగిలింది చేతికిచ్చారు. 42 వార్డుల్లో 16వేల మంది పింఛనుదారులు ఉన్నారు. నెలకు రూ.45 చొప్పున బకాయిలున్న ఇళ్లకు వెళ్లి వసూలు చేశారు. ఈ మున్సిపాల్టీలో ఒక్కరోజే చెత్తపన్ను రూపంలో రూ.65వేలు ఖజానాకు వచ్చింది.

ఇంటి, కుళాయి పన్నుకూ ఇదే తీరు : ఇంటి, కుళాయి పన్ను వసూళ్లకూ పింఛన్లలోనే కోత పెట్టేందుకు పావులు కదుపుతున్నారు. పన్ను వసూళ్లలో వెనుకబడ్డారంటూ నందికొట్కూరు మున్సిపాల్టీ పరిధిలోని సచివాలయ అడ్మిన్లకు కమిషనర్‌ షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. దీంతో సచివాలయ అడ్మిన్లు పింఛనుదారులకు సొమ్ము ఇచ్చాక ఇంటి పన్ను తప్పనిసరిగా చెల్లించేలా సూచించాలని వాలంటీర్లకు తెలిపారు. లేదంటే వచ్చే నెలలో మీకు ఇచ్చే పింఛనులో పన్ను కట్టాలని హెచ్చరికలు చేయాలనడంతో ఇప్పటికే పలువురు బకాయిదారులకు ఆ విషయాన్ని చేర్చారు.

పింఛన్​లో కోత.. ఎందుకుని ప్రశ్నిస్తే.. అందుకేనని సమాధానం

చెత్త పన్ను కట్టకపోతే అమ్మఒడి రాదన్నారు

నా భర్త చనిపోయారు. ఇద్దరు పిల్లలను పింఛను నగదుతో పోషిస్తున్నా. అగరుబత్తీల తయారీకి వెళ్తే రోజుకు రూ.140 ఇస్తారు. పని ఉన్నరోజే కూలీ వస్తుంది. వాలంటీరు, పారిశుద్ధ్య సిబ్బంది పింఛనులో చెత్త పన్ను పోను మిగిలిన సొమ్ము ఇచ్చారు. ఇప్పుడు చెత్త పన్ను కట్టకపోతే అమ్మఒడి సొమ్ము రాదని బెదిరిస్తున్నారు. - హసీనా, వితంతు పింఛనుదారు, ఎమ్మిగనూరు

రూ.200 కోత వేస్తే ఎలా?
బాడుగ ఇంట్లో ఉంటున్నాం. భర్త పక్షవాతంతో మంచాన పడ్డారు. పింఛను పెంచింది అరకొరే. అందులోనూ చెత్త పన్ను పేరుతో రూ.200 కోత విధిస్తే ఎలా బతకాలి. వృద్ధాప్యంలో మమ్మల్ని ఇబ్బందులు పెడితే ఎలా? - మాబి, ఎమ్మిగనూరు

ఇదీ చదవండి: "తలకు.. తల".. పెదరాయుళ్ల తీర్పు.. వ్యక్తి దారుణ హత్య!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.