ఇక సమరమే..! ప్రభుత్వంపై కన్నెర్రజేస్తున్న ఉద్యోగ సంఘాలు..

author img

By

Published : Mar 5, 2023, 5:43 PM IST

ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం

Employees fire on Government : ఉద్యోగుల న్యాయమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఉద్యమ కార్యాచరణ అమలు చేస్తామని ఏపీజేఏసీ అమరావతి నేతలు హెచ్చరించారు. మరోవైపు ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లేలా సంస్థాగతంగా జరుగుతున్న తప్పిదాలపై లోకాయుక్తతో సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ డిమాండ్‌ చేశారు. తమ సమస్యలపై త్వరలో రాష్ట్రపతిని కలిస్తామని ఆయన వెల్లడించారు.

Employees fire on Government : ఉద్యోగుల న్యాయమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఉద్యమ కార్యాచరణ అమలు చేస్తామని ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు ఫణి రాజు కర్నూలులో తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని.. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ 5 నుంచి ఉద్యమాన్ని రోడ్లపైకి తీసుకొని వస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందని, పక్క రాష్ట్రాల ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల పరిస్థితిని చూసి జాలిపడేలా ఉందన్నారు. దీనికితోడు సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వ ఉద్యోగులపై వ్యంగంగా పోస్టులు పెడుతున్నారని చెప్తూ.. వాటిని దీటుగా ఖండించాలని ఉద్యోగులను కోరారు.

పీఆర్సీ ఇచ్చామని చెబుతున్న ప్రజాప్రతినిధులు.. ఉద్యోగులకు ఎలాంటి అలవెన్సులు అందుతున్నాయో బహిరంగంగా తెలుపగలరా అని జిల్లా అధ్యక్షుడు గిరి కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే మట్టి ఖర్చులు సైతం ఇవ్వడం లేదని ఆయన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి లిఖిత పూర్వకంగా హామీ వస్తేనే ఉద్యమం ఆపుతామని, లేని పక్షంలో ఉద్యమ కార్యాచరణ కొనసాగిస్తామని గిరికుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

ఉద్యోగులు గొంతెమ్మ కోరికలేవీ కోరడం లేదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతున్నాం. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, రావాల్సిన బకాయిలు అడుగుతున్నాం. ఏడాది కిందట చర్చల పేరిట పిలిచి హామీలిచ్చినా నేటికీ అవి నెరవేరకపోవడంతో ఉద్యమ కార్యాచరణకు సిద్ధమయ్యాం. మా జీవన విధానం దిగజారకుండా చూడమని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. - ఫణీపేర్ రాజు, ఏపీజేఎసీ అమరావతి, అసోసియేట్ చైర్మన్

లోకాయుక్తతో సమగ్ర విచారణ జరిపించాలి... ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లేలా సంస్థాగతంగా జరుగుతున్న తప్పిదాలపై లోకాయుక్తతో సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. విజయవాడలో నిర్వహించిన వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు తీర్మానించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ మీడియాకు తెలిపారు. ఉద్యోగుల అవకతవకలపై వివిధ దర్యాప్తు సంస్థలు చేపట్టే విచారణ నిష్పాక్షికంగా ఉండడం లేదని... ఉన్నతాధికారులు తప్పు చేసినా కింది స్థాయి అధికారులపైనే చర్యలు ఉంటున్నాయని ఆవేదన చెందారు. తప్పు చేయించిన ఉన్నతాధికారి భద్రంగా ఉంటున్నారని అన్నారు. లోకాయుక్తలో విశ్రాంత న్యాయమూర్తి ఉంటారు... అసలు వాస్తవాలు బయటకు వస్తాయని అభిప్రాయపడ్డారు. లోకాయుక్త కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వతంత్ర దర్యాప్తు సంస్థేనని అన్నారు.

రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘన... రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖ పునర్ వ్యవస్థీకరణ రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా జరగడం లేదని... రాష్ట్రపతిని కలిసి ఉత్తర్వుల ఉల్లంఘనలను వివరిస్తామన్నారు. ఉద్యోగుల సమస్యలపై తనతోపాటు ప్రతినిధులు గవర్నర్ ను కలిసినందున... రాష్ట్ర ప్రభుత్వం తమను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిందని చెప్పారు. కొన్ని తాబేదార్ సంఘాలు తమ సంఘం గుర్తింపు రద్దు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయని అన్నారు. వాణిజ్యపన్నులశాఖ సర్వీసెస్‌ అసోసియేషన్ ను నిర్వీర్య పరచాలని ప్రభుత్వం చూస్తోందని, ఉద్యోగుల ను సస్పెండ్ చేయడం ద్వారా భయపెట్టేందుకు ప్రయత్నించిందని తెలిపారు.

ఉద్యోగులపై బెదిరింపు చర్యలు మా ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీయలేవు. అవినీతి నిరోధక శాఖ పరిధిలోని కేసుల్లో ఉన్న వాళ్లని విచారణాధికారిగా నియమించి కింది స్థాయి ఉద్యోగులను సస్పెండ్ చేశారు.. రెగ్యులర్ ఉద్యోగులను సస్పెండ్ చేయాలని కాంట్రాక్టు ఉద్యోగి నివేదికలివ్వడం ఎక్కడా చూడలేదు. దీన్ని న్యాయస్థానంలో సవాల్ చేసి.. నిలుపుదల చేయించాం. వాణిజ్య పన్నుల ప్రాంతీయ కార్యాలయాల కోసం ఒక్క పైసా కూడా బడ్జెట్ కేటాయించ లేదు. బడ్జెట్ ఇవ్వకుండా కార్పోరేట్ ఆఫీసును తలదన్నే రీతిలో కార్యాలయాలు ప్రారంభించి ప్రయోజనం ఏముంది. - కేఆర్ సూర్యనారాయణ, వాణిజ్య పన్నులశాఖ సర్వీసెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు

ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.