'నిరంకుశత్వం దిశగా దేశం.. దర్యాప్తు ఏజెన్సీల టార్గెట్ విపక్షాలేనా?'

author img

By

Published : Mar 5, 2023, 10:13 AM IST

democracy to atocracy

దేశంలోని తొమ్మిది విపక్ష పార్టీల నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. దేశం ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం దిశగా పయనిస్తోందన్నారు. విపక్షాలను లక్ష్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు పనిచేస్తున్నాయని మండిపడ్డారు. గవర్నర్లు ప్రభుత్వాల్లో జోక్యం చేసుకోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.

దేశం ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం దిశగా పయనిస్తోందని ఆరోపిస్తూ తొమ్మిది విపక్ష పార్టీలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశాయి. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలను విపక్షాలను వేధించేందుకు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డాయి. దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా అరెస్టును వ్యతిరేకిస్తూ ఈ మేరకు ఉమ్మడి లేఖను మోదీకి పంపించాయి. సిసోదియాకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం లేకున్నా.. పక్కా టార్గెట్​తోనే ఆయన్ను అరెస్టు చేశారని ఆరోపించాయి. 2014 తర్వాత కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలన్నీ విపక్షాలను లక్ష్యం చేసుకొనే పనిచేశాయని ధ్వజమెత్తాయి.

"దిల్లీలో పాఠశాల విద్యలో మార్పులకు ఆద్యుడిగా మనీశ్ సిసోదియాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చింది. దేశంలో రాజకీయ వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయనేందుకు ఆయన అరెస్టు ఓ ఉదాహరణ. బీజేపీ పాలనలో భారత ప్రజాస్వామ్య విలువలు ఏ స్థాయిలో దాడికి గురవుతున్నాయో ప్రపంచం గుర్తిస్తోంది. ప్రభుత్వ ఏజెన్సీలు 2014 తర్వాత చేసిన అరెస్టులు, సోదాలు.. విపక్షాల లక్ష్యంగానే సాగాయి. 2014-15లో హిమంత బిశ్వ శర్మ (ప్రస్తుతం అసోం సీఎం)పై శారదా చిట్​ఫండ్ స్కామ్ కేసులో సీబీఐ, ఈడీ ముమ్మరంగా దర్యాప్తు చేశాయి. బీజేపీలో చేరిన తర్వాత ఆ కేసు పురోగతే లేదు. నారదా స్కామ్​లో పేర్లు వినిపించిన బంగాల్​లో సువేందు అధికారి, ముకుల్ రాయ్, మహారాష్ట్రలో నారాయణ్ రాణె వంటి వారి విషయంలోనూ ఇదే జరిగింది. మరోవైపు, ఎన్నికల సమయాల్లో విపక్షాల నేతలపై ఈడీ, సీబీఐ దాడులు ఉద్ధృతం కావడం స్పష్టంగా తెలుస్తోంది. ఇవన్నీ రాజకీయ ప్రోద్బలంతోనే జరిగాయని స్పష్టమవుతోంది. దర్యాప్తు సంస్థలను మీ ప్రభుత్వం విపక్షాలను వేధించేందుకే ఉపయోగించుకుంటోంది."
-విపక్షాల లేఖ

అదానీ- హిండెన్​బర్గ్ వ్యవహారంపైనా ప్రభుత్వాన్ని విపక్షాలు ప్రశ్నించాయి. ఎస్​బీఐ, ఎల్ఐసీ వంటి సంస్థలు ఓ సంస్థలో పెట్టుబడులు పెట్టడం వల్ల రూ.78 వేల కోట్లు కోల్పోయాయని ఆరోపించాయి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించాయి. ప్రాధాన్యాలను ప్రభుత్వం విస్మరిస్తోందని పేర్కొన్నాయి. దీంతోపాటు దేశ సమాఖ్య వ్యవస్థపై కేంద్రం యుద్ధం ప్రకటించిందని వ్యాఖ్యానించాయి.

"దేశవ్యాప్తంగా గవర్నర్ల వ్యవస్థ రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాల్లో పదేపదే గవర్నర్లు జోక్యం చేసుకుంటున్నారు. దిల్లీ, తమిళనాడు, బంగాల్, పంజాబ్, తెలంగాణ వంటి భాజపాయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కావాలనే పాలనను అడ్డుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దూరం పెరిగేందుకు గవర్నర్లు కారణమవుతున్నారు. సహకార సమాఖ్యా విధానానికి ఇది విరుద్ధం. ఫలితంగా గవర్నర్ల పాత్రపై ప్రజలు ప్రశ్నలు గుప్పించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది."
-విపక్షాల లేఖ

ప్రజాస్వామ్యంలో ప్రజల అధికారాలు, ఆకాంక్షలే అన్నిటికంటే కీలకమని విపక్షాలు పేర్కొన్నాయి. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహించాలని స్పష్టం చేశాయి. ఒక పార్టీకో, వ్యక్తికో భిన్నంగా ఉన్న భావజాలాన్ని సైతం గౌరవించాలని హితవు పలికాయి. ఈ లేఖపై బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఆప్ అధినేత కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, ఎన్సీపీ సుప్రీం లీడర్ శరద్ పవార్, శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సంతకాలు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.