నేడు మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ సభ.. పోలీసుల ఆంక్షలు

author img

By

Published : Mar 13, 2023, 6:01 PM IST

Updated : Mar 14, 2023, 6:25 AM IST

Etv Bharat

Jana Sena Formation Day Meeting : జనసేన ఆవిర్భావ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనసేన కర్తవ్యాలు, వారాహి నేపథ్యం, ప్రభుత్వ వైఫల్యాలు వివరిస్తూ ప్రత్యేక గీతం విడుదల కాగా, సభకు జనం సునామీలా తరలి వస్తారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఆర్థిక సంబంధాలతో కాకుండా ఆత్మీయ సంబంధాలతో జనం తరలిరానున్నారని పేర్కొన్నారు. ఇక.. సభ నేపథ్యంలో రహదారులపై ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని లేదని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా స్పష్టం చేశారు.

Jana Sena Formation Day Meeting : మంగళవారం (14వ తేదీ) మచిలీపట్నంలో జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభకు ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారీ జెండాను నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. సభకు దూర ప్రాంతాల నుంచి వచ్చే జన సైనికులు, వీర మహిళలకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సభకు అనుమతించిన పోలీస్ శాఖకు పార్టీ తరఫున ధన్యవాదాలు ప్రకటించారు.

జనసేన ఆవిర్భావ సభకు సైనికుల సన్నాహాలు

ప్రత్యేక గీతం: జనసేన ఆవిర్భావ సభకు ప్రత్యేక గీతం విడుదలైంది. 14వ తేదీన మచిలీపట్నంలో జరిగే ఆవిర్భావ సభకు పవన్ కల్యాణ్ వారాహి వాహనంలో వెళ్లనున్నారు. దీంతో వారాహి వాహన నేపథ్యంతో ఈ గీతాన్ని రూపొందించారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలు, అధికారపార్టీ నేతల ఆరాచకాలు, వైసీపీ సర్కారు తీరుతో ప్రజలు పడుతున్న కష్టాలను తెలియజెప్పేలా ఈ పాట సాగుతుంది.

వైఎస్సార్సీపీ పాలనలో బీసీల వెనుకబాటు.. బీసీల కోసం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో బీసీల అభివృద్ధిపై పవన్ కల్యాణ్ ప్రత్యేక శ్రద్ధ చూపడంపై జనసేన పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అణగారిన వర్గాలకు ఇప్పటివరకు జరిగిన అన్యాయంపై జనసేన సమావేశం ఏర్పాటు చేయడంతో వైసీపీ పార్టీలో వణుకు మొదలైందని అన్నారు. బీసీల లబ్ధి కోసం ఇప్పటివరకు ఏమేం ప్రయోజనాలు చేకురాయో చెప్పగలరా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో బటన్ నొక్కుడు పేరుతో 30 శాతం బీసీలకు అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బీసీ సోదరులు వైఎస్సార్సీపీకి తగిన గుణపాఠం చెబుతారన్నారు.

సభకు జన సునామీ.. ఈ నెల 14న మచిలీపట్నంలో జరగబోయే 10 వ జనసేన ఆవిర్భావ సభకు రాష్ట్ర ప్రజలందరూ వచ్చి సభను జయప్రదం చేయాలని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర రావు కోరారు. అధికారంలో ఉండి వైఎస్సార్సీపీ పెట్టుకున్న సభలకు ప్రజలు రాక విఫలమయ్యాయని విమర్శించారు. మచిలీపట్నంలో జరగబోయే జనసేన సభ... ఆర్థిక సంబంధాలతో కాకుండా... జన సంబంధాలతో జరుగుతుందని చెప్పారు. ఈ సభకు ప్రజలు సునామీలా తరలి వస్తారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వచ్ఛందంగా గెలవలేక అక్రమంగా సంపాదించిన డబ్బు కుమ్మరిస్తున్నారని, నోట్లు చల్లి గెలవాలని చూస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఆగడాలకు అంతులేకుండా పోయిందని మండిపడ్డారు.

ర్యాలీలు, సభలకు అనుమతి లేదు.. జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారిపై ర్యాలీలు, సభలు నిర్వహించడానికి అనుమతి లేదని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా స్పష్టం చేశారు. రేపు మచిలీపట్నం వద్ద నిర్వహించనున్న జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా జాతీయ రహదారిపై ర్యాలీలు, బహిరంగ ప్రదర్శనలు నిర్వహించడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని పేర్కొన్నారు. జాతీయ రహదారి పై ప్రయాణించే సామాన్య ప్రజలకు, అత్యవసర సర్వీసులకు ఎలాంటి అంతరాయం కలిగించరాదని సూచించారు. పోలీసు అనుమతులకు విరుద్ధంగా ర్యాలీలు, బహిరంగ ప్రదర్శనలు నిర్వహించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇవీ చదవండి :

Last Updated :Mar 14, 2023, 6:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.