ETV Bharat / state

CM Jagan review: గట్టి సంకల్పంతో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి.. సమీక్షలో సీఎం జగన్​

author img

By

Published : Jul 6, 2023, 7:00 PM IST

CM Jagan review : దరఖాస్తు చేసుకున్న వారికి ఇళ్ల పట్టాలు కేటాయించేందుకు భూములను సేకరించాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుని వీలైనంత త్వరగా సేకరణ పూర్తి చేయాలని నిర్దేశించారు. రాష్ట్రంలో మిగిలిన టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు.

ఇళ్ల నిర్మాణంపై సీఎం సమీక్ష
ఇళ్ల నిర్మాణంపై సీఎం సమీక్ష

CM Jagan review: టిడ్కో గృహ సదుపాయాల వద్ద వాణిజ్య సముదాయాలు, గృహాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసేందుకు సీఎం జగన్​ పచ్చజెండా ఊపారు. గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణంపై ఆరా తీశారు. ఇళ్ల ప్రగతిపై అధికారులు వివరాలు అందించారు. ఇప్పటివరకు 4 లక్షల24 వేల220 ఇళ్లు పూర్తయ్యాయని, ఆగస్టు 1 నాటికి 5 లక్షల ఇళ్లు పూర్తవుతాయని అధికారులు వెల్లడించారు. 5లక్షల 68 వేల 517 రూఫ్‌ లెవల్​లో ఉన్నాయని.. ఆ పైస్థాయిలో నిర్మాణంలో ఉన్న ఇళ్లు సహా వివిధ స్థాయిల్లో 9 లక్షల 56 వేల 369 ఇళ్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. కాలనీలు పూర్తవుతున్న కొద్దీ అన్ని రకాలుగా కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు కావాలని సీఎం ఆదేశించారు. ఇళ్ల నిర్మాణ వేగాన్ని ఇదే రీతిలో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

డిసెంబర్​లోగా పూర్తి చేయాలి.. కోర్టు కేసులు కారణంగా ఇళ్ల స్థలాల పంపిణీ నిలిచిపోయిన చోట ప్రత్యామ్నాయ భూముల సేకరణపై దృష్టి పెట్టాలని, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. డిసెంబరులోగా విశాఖలో ఇళ్లు పూర్తి చేయడానికి తగిన కార్యాచరణ రూపొందించాలని, ఏం కావాలన్నా వెంటనే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కొత్తగా ఇళ్లకోసం దరఖాస్తు చేసుకున్న వారికి పట్టాలు ఇచ్చేందుకు భూములను సేకరించాలని ఆదేశించారు. దీనిపై కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్న సీఎం.. వీటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్దేశించారు.

గట్టి సంకల్పంతో పూర్తి చేయాలి.. సీఆర్‌డీఏ పరిధిలో ఇళ్ల నిర్మాణం పనులు, దీనికి సంబంధించిన అంశాలను సీఎం చర్చించారు. రాజధానిలో 45 వేల 101 మంది ఆప్షన్‌–3 ఎంపిక చేసుకున్నారని అధికారులు తెలిపారు. ఇప్పటికే కాంట్రాక్టర్ల ఎంపిక సైతం పూర్తైందని అధికారులు తెలిపారు. అందరితోనూ బ్యాంకు ఖాతాలు తెరిచే ప్రక్రియ ప్రారంభమైందని అధికారులు తెలిపారు. నీటి సరఫరా, అప్రోచ్‌ రోడ్లు, విద్యుత్‌ సరఫరా తదితర పనులపై దృష్టి పెట్టామని అధికారులు తెలిపారు. సీఆర్‌డీఏ ప్రాంతంలో పేదలకు ఇళ్ల నిర్మాణంపై పిటిషన్లు, కోర్టు విచారణలో అంశాలపై సమావేశంలో చర్చించారు. గట్టి సంకల్పంతో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలన్న సీఎం.. దీనికోసం న్యాయపరమైన చర్యలన్నీ తీసుకోవాలన్నారు.

ప్రతిపాదనల పరిశీలన... టిడ్కో ఇళ్ల పైనా సమీక్షించిన సీఎం.. పలు ఆదేశాలిచ్చారు. ఇప్పటివరకూ 71 వేల 452 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఈనెలలో మరో 29 వేల 496 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించనున్నట్లు తెలిపారు. ఆగస్టులో 49 వేల 604 ఇళ్లు ఇస్తామని వెల్లడించారు. 300 చదరపు అడుగులు ప్లాట్లను ఉచితంగా ప్రభుత్వం ఇస్తున్నందున మిగిలిన కేటగిరీల్లోని 365, 430 చదరపు అడుగుల లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా దాదాపు 2వేల కోట్లు రుణాలుగా ఇప్పించామని అధికారులు తెలిపారు. టిడ్కో గృహ సముదాయాలను స్వయం సమృద్ధి దిశగా నడిపించాలని ఆదేశించిన సీఎం.. దీనికి సంబంధించి వివిధ ప్రతిపాదనలను పరిశీలించారు. వందల, వేల సంఖ్యలో గృహాలు ఈ కాలనీల్లో ఉంటున్నందున వారి అవసరాలను తీర్చేలా వాణిజ్య సముదాయాలను ఏర్పాటు చేసేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చారు. తొలిదశలో 15 టిడ్కో కాలనీల్లో ఇవి ఏర్పాటు చేయాలన్న సీఎం... మహిళల ఆధ్వర్యంలో వ్యాపార, వాణిజ్య సముదాయాలు ఏర్పాటు అయ్యేలా చూడాలని ఆదేశించారు. దీనివల్ల అందుబాటు ధరలతో సరుకులు అక్కడి పేదలకూ అందుతాయని, మహిళలకూ ఉపయోగం ఉంటుందన్నారు. అలాగే టిడ్కో గృహాలపై సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటుకూ సీఎం పచ్చజెండా ఊపారు.

Amaravathi Plots: అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు రెడీ.. మరో మూడు రోజుల్లో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.