Doctors and Staff Shortage in Hospitals: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుచేసిన 5 బోధనాసుపత్రులను.. వైద్యులు, ఇతర సిబ్బంది కొరత వేధిస్తోంది. ముందుచూపు లేని నియామకాలతో అస్తవ్యస్థ పరిస్థితి నెలకొంది. కొత్త బోధనాసుపత్రుల రాకతో.. ఉచితంగా ఇళ్ల వద్దనే రోగులకు ఉత్తమ సేవలు అందుతాయన్న సీఎం జగన్ మాటలు.. ఆచరణకు ఆమడ దూరంలోనే నిలిచాయి. వైద్యులు, సిబ్బంది కొరతతో రోగులను మెరుగైన వైద్యం కోసం బోధనాసుపత్రుల నుంచి సిఫార్సు కింద ఇతర ఆసుపత్రులకు పంపుతున్నారు. ఇతర ఆసుపత్రుల నుంచి వచ్చే కేసులను చూడాల్సిన బోధనాసుపత్రులే ఇలా చేస్తుండటం విడ్డూరంగా ఉంది.
ఏలూరు బోధనాసుపత్రిలో 305 పోస్టులకు గాను.. 136 ఖాళీగా ఉన్నాయి. ఇందులో 24కు గానూ 10 మంది వైద్యులే ఉన్నారు. 70 మంది గైనిక్ సీనియర్ రెసిడెన్సీలు అవసరం కాగా.. 10 మంది మాత్రమే ఉన్నారు. ఇంచుమించు ఇలాంటి పరిస్థితులే మిగతా 4 బోధనాసుపత్రుల్లోనూ ఉన్నాయి. ఏలూరు బోధనాసుపత్రిలో పనిచేసే సీనియర్ వైద్యుల్లో అత్యధికులు గుంటూరు, విజయవాడ నగరాల్లో నివాసముంటున్నారు. ఇక్కడ వైద్యులు ఓపీ సేవలకు మాత్రమే పరిమితమవుతూ.. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందాలని రోగులకు సూచిస్తున్నారు.
కడప ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఊడి పడిన స్లాబ్ పెచ్చులు - తప్పిన పెను ప్రమాదం
రిఫరల్ కేసులకు తగ్గట్లు అంబులెన్సులు కూడా లేవు. ముఖ్యమైన రేడియాలజిస్ట్ పోస్టు భర్తీ కానందున.. గర్భిణులు ప్రైవేటు కేంద్రాల్లో నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు. గత సెప్టెంబర్లో ఒ.మాణిక్యం అనే రోగికి తగిన వైద్యం అందించనందున ప్రాణాలు విడిచారు. ఓ మహిళకు శస్త్రచికిత్స సమయంలో కత్తెరను కడుపులోనే ఉంచి మరిచిపోగా.. కడుపునొప్పితో తిరిగి ఆసుపత్రికి గత ఆగస్టులో వచ్చినప్పుడు.. ఈ దారుణం బయటపడింది.
మచిలీపట్నం బోధనాసుపత్రికి రక్తహీనత, అధిక రక్తపోటు వంటి సమస్యలతో వచ్చేవారినీ.. విజయవాడ, గుంటూరు జీజీహెచ్లకు.. రోజూ సుమారు 10 కేసులను ఇతర ఆసుపత్రులకు పంపుతున్నారు. ఈ ఆసుపత్రిలో సీటీ, MRI స్కానింగ్తో పాటు.. అత్యాధునిక పరికరాలు ఉన్నందున చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రోగులు, గర్భిణులు ఇక్కడికి వస్తున్నారు. ఖరీదైన ఎకో, ఎండోస్కోపి, కొలనోస్కోపి పరికరాల ద్వారా రోగులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు సవ్యంగా సాగడం లేదు.
శిక్షణ కార్యక్రమాలు జరగక.. ఇతరత్రా కారణాలతో వీటి వినియోగం అంతంత మాత్రంగా ఉన్నందున.. రోగులు అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో రోజుకు ఓపీ 500 నుంచి 600 వరకు నమోదవుతోంది. జిల్లా ఆసుపత్రిగా ఉన్నప్పుడు ఓపీ 1200 వరకు నమోదయ్యేది. ప్రస్తుతం ఆసుపత్రిలో ఇన్పేషెంట్లుగా చేరేవారి సంఖ్య రోజుకు సగటున 60 వరకు ఉండగా.. గతంలో 100 వరకు నమోదయ్యేది.
రాజమహేంద్రవరం జీజీహెచ్లో వైద్య సేవల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నెల తొలి వారంలో రాజానగరం నియోజకవర్గానికి చెందిన ఓ మహిళ అనారోగ్య సమస్యతో వస్తే.. సంబంధిత వైద్యుడు అందుబాటులో లేరని.. అడ్మిషన్ ఇవ్వకుండా మాత్రలు ఇచ్చి.. వెనక్కి పంపారు. ఆమె ఆసుపత్రి గేటు దాటకుండానే మృతిచెందారు. జిల్లా ఆసుపత్రిగా ఉన్నప్పుడు.. ముఖ్య వైద్యాధికారులే.. రోగి పరిస్థితిని బట్టి.. అత్యవసర విభాగంలో ఇన్పేషెంట్లుగా చేర్చుకుని.. ప్రాథమిక చికిత్స అందించేవారు.
అనంతరం వారే పెద్దాసుపత్రులకు పంపిన సందర్భాలు ఉన్నాయి. ప్రమాదాల్లో గాయపడి ఆసుపత్రికి వచ్చేవారిని అక్కడి సిబ్బంది ప్రైవేటు ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు పంపుతూ కమీషన్లు పొందుతున్నారు. రిఫరల్ కేసుల్లో ఆర్థోకు చెందినవి ఎక్కువగా ఉంటున్నాయి. సీటీ స్కాన్ యంత్రం మంజూరై ఆసుపత్రికి చేరి 3 నెలలు దాటినా.. ఇప్పటివరకూ పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురాలేదు. రక్తపరీక్ష రిపోర్టుల్లో తప్పులు దొర్లుతున్నాయి. ఇటీవల డెంగీ, మధుమేహ కేసుల్లో ఈ వ్యవహారం వెలుగుచూసింది.
నంద్యాల జీజీహెచ్లో గతంలో రోజుకు 800 ఉండే ఓపీ ప్రస్తుతం 1200 వరకు పెరిగింది. జిల్లా ఆసుపత్రిగా ఉన్నప్పుడు గతంలో ప్రసవాలు చేయడానికి 8 మంది గైనకాలజిస్టులు ఉండేవారు. ప్రస్తుతం నలుగురే ఉన్నారు. గతంలో నెలకు 400కు పైగా జరిగే ప్రసవాలు ప్రస్తుతం 300 వరకే జరుగుతున్నాయి. గర్భిణీలకు చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా కర్నూలుకు రిఫర్ చేస్తున్నారు.
సర్వజన ఆసుపత్రిలోని ఎక్స్రే విభాగంలో గతంలో ఏడుగురు సిబ్బంది ఉండేవారు. ప్రస్తుతం నలుగురే ఉన్నారు. ఉన్న సిబ్బందే రేయింబవళ్లు విధులు నిర్వర్తించాల్సి ఉండటంతో పాటు వారే.. ఎక్స్రే, కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. బోధనాసుపత్రిగా మారినప్పటి నుంచి ఓపీ సేవలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పెంచారు. కానీ మధ్యాహ్నం ఒంటి గంటకే వైద్యులు సర్దుకుంటున్నారు.
విజయనగరం జీజీహెచ్లో ఓపీ ద్వారా వైద్య సేవలను రోజూ మధ్యాహ్నం 12:30కి ముగిస్తున్నారు. గతంలో రోజుకు 500 నుంచి 600 వరకు ఓపీ వచ్చేది. ఇందులో 100 వరకు ఐపీ ఉండేది. ఇప్పుడు రోజుకు 600 నుంచి 700 వరకు ఓపీ నమోదైతే.. 150 వరకు ఐపీ ఉంటోంది. ఎండోస్కోపి పరికరం ఉన్న.. పనిచేయడం లేదని చెప్పి వైద్యులు బయటకు పంపేస్తున్నారు. అల్ట్రాసౌండ్, ఎక్స్రే విభాగాల దగ్గర తరచూ రోగుల మధ్య నిత్యం తొక్కిసలాట జరుగుతోంది. గతంలో 200 పడకలకు ఉన్న సిబ్బందినే.. పెరిగిన 400 పడకలకు వాడుతున్నారు. పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉంది.