ETV Bharat / state

KR Surya Narayana Bail Petition: "కేఆర్​ సూర్యనారాయణపై కేసు రాజకీయ కక్ష సాధింపే".. విచారణ వాయిదా

author img

By

Published : Jul 12, 2023, 4:21 PM IST

KR Surya Narayana Anticipatory
KR Surya Narayana Anticipatory

KR Surya Narayana Anticipatory Bail Petition Updates: రాజకీయ కక్ష సాధింపుగానే కేఆర్​ సూర్యనారాయణపై కేసు నమోదు చేశారని ఆయన తరఫు న్యాయవాది సోము కృష్ణమూర్తి వాదనలు వినిపించారు. సూర్యనారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్​పై విజయవాడ కోర్టు విచారణ జరిపింది.

KR Surya Narayana Anticipatory Bail Petition Updates: ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్​పై విజయవాడ కోర్టు విచారణ జరిపింది. పిటిషనర్​ తరఫు న్యాయవాది సోము కృష్ణమూర్తి వాదనలు వినిపించారు. రాజకీయ కక్ష సాధింపుగానే పిటిషనర్​పై కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. గతంలో రెండు కమిటీలు ఈ అంశంపై విచారణ చేసి ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాయని.. ఆ నివేదికల్లో పిటిషనర్ పేరు లేదని కోర్టుకు తెలిపారు. ఉద్యోగుల జీతాల చెల్లింపుపై గవర్నర్​ను కలిసిన తర్వాతే కేసు నమోదు చేశారని న్యాయవాది వాదనలు వినిపించారు. పిటిషనర్​కు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. దీంతో తదుపరి విచారణను న్యాయస్థానం గురువారానికి(ఈ నెల 13) వాయిదా వేసింది. రేపు ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపించనున్నారు.

విజయవాడ పటమట పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు కోసం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపి జులై 7లోపు నిర్ణయం వెల్లడించాలని అనిశా కోర్టును జూన్​ 28న హైకోర్టు ఆదేశించింది. అనిశా కోర్టు నిర్ణయం వరకు సూర్యనారాయణపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టం చేసింది. సూర్యనారాయణ గతంలో దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్‌పై విజయవాడ 12వ అదనపు జిల్లా కోర్టు విచారణ పరిధి లేదంటూనే కేసు లోతుల్లోకి వెళ్లడాన్ని తప్పుపట్టింది. బెయిలు పిటిషన్​ను కొట్టేస్తూ జూన్‌ 15న ఆ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. బెయిలు పిటిషన్ను.. అనిశా కోర్టుకు బదిలీ చేయాలని 12వ అదనపు జిల్లా కోర్టును ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.సురేష్‌రెడ్డి ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

కేఆర్​ సూర్యనారాయణ విషయంలో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ పరిష్కరించే వరకు ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని, హైకోర్టు నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో పిటిషనర్‌కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని విజయవాడలోని ఫ్యామిలీ కోర్టు అభిప్రాయపడింది. ఇన్‌ఛార్జి కోర్టుగా తాము పనిభారంతో ఉన్నామని, ఈ పరిస్థితుల్లో బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సాధ్యపడడం లేదని పేర్కొంది. రెగ్యులర్‌ కోర్టు జడ్జి సెలవులో ఉన్నారని, ఇన్‌ఛార్జి కోర్టు అయిన ఎంఎస్‌జే న్యాయస్థానం జడ్జి కూడా ఓడీలో ఉండడంతో ఈ పిటిషన్‌ ఫ్యామిలీ కోర్టుకు వచ్చిందని న్యాయమూర్తి టి. వెంకటేశ్వర్లు గుర్తు చేశారు.

కేఆర్‌ సూర్యనారాయణ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ విజయవాడ ఫ్యామిలీ కోర్టులో విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది సోము కృష్ణమూర్తి వాదనలు వినిపిస్తూ... ఈనెల 7వ తేదీలోగా ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను పరిష్కరించాలని హైకోర్టు పేర్కొందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ.. బెయిల్‌ పిటిషన్‌ పరిష్కారం అయ్యే వరకు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించిన నేపథ్యంలో పిటిషనర్‌కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదన్నారు. రెగ్యులర్‌ న్యాయాధికారి ముందుకు ఈ బెయిల్‌ పిటిషన్‌ విచారణకు వచ్చేలా ఈనెల 11వ తేదీకి వాయిదా వేశారు. నిన్న విచారణ జరిపిన కోర్టు ఇవాళ్టికి వాయిదా వేసింది. ఈరోజు పిటిషనర్​ తరఫు న్యాయవాది వాదనలు వినిపించగా.. ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు వినిపించనున్న నేపథ్యంలో విచారణ గురువారానికి వాయిదా వేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.