ETV Bharat / state

పల్నాడు ప్రాంతంలో దాడులపై డీజీపీకి చంద్రబాబు లేఖ

author img

By

Published : Dec 19, 2022, 10:58 PM IST

Chandrababu
చంద్రబాబు

CBN Letter to DGP: పల్నాడు ప్రాంతంలో 2019 ఎన్నికల తరువాత టీడీపీ మద్దతుదారులపై జరిగిన దాడుల నుంచి తాజా మాచర్ల హింస వరకు వైసీపీ అరాచకాలు, పోలీసులు వైఫల్యం, భాగస్వామ్యం వివరిస్తూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు డీజీపీకి 7 పేజీల లేఖ రాశారు. 2020లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం నేతలపై జరిగిన దాడి, ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకున్న ఘటనలను లేఖలో ప్రస్తావించారు. పల్నాడు ప్రాంతంలో మూడున్నరేళ్లలో జరిగిన 16 రాజకీయ హత్యలు, పోలీసుల వైఫల్యం, లా అండ్ ఆర్డర్ సమస్యలను ప్రశ్నించారు. నిందితులతో పాటు సహకరించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

CBN Letter to DGP : మాచర్లలో ఈ నెల 16న జరిగిన వైసీపీ పాశవిక దాడిలో బాధితులను తక్షణమే ఆదుకొని వారికి న్యాయం చేయడం ప్రభుత్వ కర్తవ్యమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. అందుకు వెంటనే పలు డిమాండ్లను పరిష్కరించాలంటూ డీజీపీకి లేఖ రాశారు. వైసీపీ గూండాలతో కుమ్మక్కైన పోలీసు అధికారులపై లోతైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులకు మద్దతుగా నిలిచి వారికి న్యాయం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మాచర్ల టీడీపీ ఇంచార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డికి తగిన భద్రత కల్పించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పల్నాడు ప్రాంతంలో శాంతి భద్రతలు కాపాడేలా తగు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఓటు వేసినందుకు మాచర్ల నియోజకవర్గంలో దళితులపై వైసీపీ గూండాలు దాడి చేసి గ్రామాల నుంచి వెళ్లగొట్టారని చంద్రబాబు గుర్తు చేశారు. ఈ ఘటనలపై టీడీపీ సుదీర్ఘ రాజకీయ పోరాటం చేసినప్పటికీ, నేరానికి పాల్పడిన వారిపై పోలీసులు నేటికీ చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు. 2020లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో వైసీపీ గూండాలు పట్టపగలు మాచర్ల పట్టణంలో టీడీపీ నేతలపై దాడి చేసినా పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని మండిపడ్డారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పల్నాడు ప్రాంతంలో 16 మంది తెలుగుదేశం సానుభూతి పరులు, మద్ధతుదారులను హత్య చేశారని ఆరోపించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.