ETV Bharat / state

అప్పులే దిక్కు అన్నట్లుగా ఏపీ పరిస్థితి.. కాగ్​ ఆందోళన..!

author img

By

Published : Mar 15, 2023, 7:36 AM IST

DEBTS IN AP: రాష్ట్రం అప్పుల కుప్పగా మారుతోంది. అప్పు పుడితేనే రాష్ట్ర ప్రభుత్వానికి రోజు గడిచే పరిస్థితి తలెత్తిందని.. కాగ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక నిర్వహణ తీరును తప్పుబట్టిన కాగ్‌.. అప్పుల్లో సింహభాగం నిరుపయోగ ఖర్చులేనని తేల్చింది. అన్ని భారాలూ కలిపి 9 లక్షల కోట్ల రూపాయలకు పైనే ఉంటాయని స్పష్టం చేసింది. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రం సంక్షోభంలోకి చిక్కుకుంటుందని కాగ్‌ తేల్చి చెప్పింది.
DEBTS IN AP
DEBTS IN AP

అప్పులే దిక్కు అన్నట్లుగా ఏపీ పరిస్థితి.. కాగ్​ ఆందోళన..!

DEBTS IN AP: 2021 మార్చి నెల చివరి వరకు ఆంధ్రప్రదేశ్​ ఆర్థిక వ్యవస్థను విశ్లేషించిన కాగ్‌.. పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఏపీ అప్పుల పరిస్థితిపై పై కాగ్‌ గిరీష్‌ చంద్ర ముర్ము తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రిజర్వు బ్యాంకు కూడా అనేక అంశాలను తప్పుబట్టింది. ఆంధ్రప్రదేశ్‌కు అప్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వివిధ బ్యాంకులను కేంద్ర ఆర్థిక శాఖ హెచ్చరించింది. రుణాలను భరించే సామర్థ్యం ఏపీకి లేదని.. రుణం తీసుకుని పాత అప్పులు తీరుస్తున్నారని కాగ్‌ ఆక్షేపించింది. తీసుకున్న రుణాలను ఆస్తుల సృష్టికి, అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించాలని.. రుణాలపై వడ్డీలు చెల్లించేందుకు, రోజు గడిచేందుకు అప్పు తీసుకోవడం ఆర్థిక అస్థిరతకు దారితీస్తుందని హెచ్చరించింది.

సరైన వ్యూహం లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలకు తగ్గనున్న నిధులు: 2020-21 ఆర్థిక సంవత్సరం చివరికి మొత్తం బకాయిలు జీఎస్​డీపీలో 35 శాతానికి మించకూడదని ఎఫ్​ఆర్​బీఎమ్​(FRBM) చట్టం చెబుతోందన్న కాగ్‌.. 2021 మార్చి 31 నాటికి అప్పులు 35.30శాతం ఉన్నాయని తేల్చింది. బడ్జెట్‌లో చూపించకుండా బయటి నుంచి తీసుకునే రుణాలనూ పరిగణిస్తే ఇది 44.04 శాతం అవుతుందని స్పష్టం చేసింది. 2021 మార్చి 31 నాటికి ఉన్న పరిస్థితుల ప్రకారం రాబోయే ఏడు సంవత్సరాలలో 45.74 శాతం అంటే.. లక్షా 23వేల 640 కోట్ల రూపాయల అప్పులు తీర్చాలని స్పష్టం చేసింది. దీనికి సరైన వ్యూహం లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు తగ్గిపోతాయని రాష్ట్రాన్ని కాగ్‌ హెచ్చరించింది.

అప్పులు తీర్చేందుకే కొత్త రుణాలు: 2019-20 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ రుణాల్లో 71.71 శాతం మొత్తం పాత రుణాలు తీర్చేందుకే సరిపోయిందని.. 7.76శాతం నిధులు మాత్రమే ఆస్తుల సృష్టికి ఉపయోగించారని ఆందోళన వెలిబుచ్చింది. 2020-21 సంవత్సరంలో తీసుకున్న రుణాల్లో 77.12శాతం పాత అప్పులు తీర్చడానికి, 8.91శాతం మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేశారని చెప్పింది.

బడ్జెట్​లో చూపకుండా పెద్ద మొత్తంలో రుణాలు: ప్రతి సంవత్సరం రాష్ట్ర అప్పులు పెరుగుతూనే ఉన్నాయన్న కాగ్‌.. రెవెన్యూ వ్యయాన్ని భరించేందుకు రుణాల మొత్తాన్ని ప్రభుత్వం వాడుకుంటోందని విశ్లేషించింది. తీసుకున్న రుణాల్లో 81శాతం రెవెన్యూ ఖర్చులకే వాడుతున్నందున.. ఆస్తుల కల్పనకు ఆటంకం కలుగుతున్నట్లు తెలిపింది. బడ్జెట్‌లో చూపకుండా పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుంటూ.. మొత్తం అప్పులను ఏపీ తగ్గించి చూపుతోందని కాగ్‌ కుండబద్దలు కొట్టింది.

పీడీ ఖాతాలను తగ్గించాలి: పీడీ ఖాతాలకు పెద్ద మొత్తంలో నిధులు బదిలీ చేసినట్లు చూపుతున్నా.. నిధులు మాత్రం అక్కడ లేవు. దీని వల్ల సంబంధిత శాఖల సిబ్బంది ఖర్చు చేయడానికి కుదరడం లేదు. రాష్ట్రంలో భారీగా రెవెన్యూ లోటు కనిపిస్తుంటే, బడ్జెట్‌ కేటాయింపుల్లో మూడో వంతు మొత్తం పీడీ ఖాతాల్లో మిగిలిపోయినట్లు చూపుతున్నారని చెప్పింది. సంఘటిత నిధి నుంచి పీడీ ఖాతాలకు బదిలీ చేసి, వాస్తవంగా వాటిని ఖర్చు చేయడం లేదని తేల్చింది. వీటిపై శాసనపరమైన పరిశీలన లోపించిందని... బడ్జెట్‌ ప్రక్రియ పవిత్రతను కాపాడుకునేందుకు పీడీ ఖాతాలను తగ్గించడం అవసరమని కాగ్‌ తన నివేదికలో పేర్కొంది.

అది ఏపీ ఫైనాన్షియల్​ కోడ్​కు విరుద్ధం: రాష్ట్ర పథకాలు, కార్యకలాపాల అమలుకు పీడీ నిర్వాహకుల వద్ద నిధులను ఉంచడం... ఆంధ్రప్రదేశ్‌ ఫైనాన్షియల్‌ కోడ్‌కు విరుద్ధమని స్పష్టం చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌ కేటాయింపులు లేకుండానే 7 వ్యవహారాల్లో లక్షా 6 వేల 280 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని కాగ్‌ తప్పు బట్టింది. కేంద్ర పథకాలకు అందిస్తున్న నిధులను పీడీ ఖాతాలకు మళ్లించి, రాష్ట్ర ప్రభుత్వం సరిగా వినియోగించుకోవడం లేదన్న కాగ్‌.. దీనివల్ల కేంద్ర పథకాలు సరిగా అమలు కావట్లేదని పేర్కొంది.

కాగ్​కు చెప్పని గ్యారంటీ రుణాల మొత్తం: ప్రభుత్వ గ్యారంటీతో తీసుకునే రుణాల అంశం రహస్యంగానే ఉంటోంది. గ్యారంటీ రుణాల మొత్తం ఎంతన్నది వెల్లడించబోమని, బడ్జెట్‌ పుస్తకాల్లోనే చెబుతామని సాక్షాత్తూ సీఎంకు ఆర్థికశాఖ కార్యదర్శిగా ఉన్నవారూ ప్రకటిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు గ్యారంటీ రుణాలు ఎన్ని తెచ్చారో కాగ్‌ ప్రతి నెలా అడుగుతున్నా.. ప్రభుత్వం మాత్రం సమాధానం చెప్పడం లేదు. 2021 డిసెంబర్ తర్వాత ఈ లెక్కలను నవీకరించలేదు. రుణాలు, కార్పొరేషన్ల ఖాతాలు, ఖర్చులపై లెక్కలు ఆడిట్‌ చేసి.. కంపెనీస్‌ ఆఫ్‌ రిజిస్ట్రార్‌ వద్ద సమర్పించిన దాఖలాలు లేవు.

అప్పుల వివరాలు చెప్పని ప్రభుత్వం: 2022 మార్చి నాటికి ప్రభుత్వ గ్యారంటీతో తెచ్చిన అప్పులు ఎంతో తెలియదు. ఆ తర్వాత ఇంతవరకు 11 నెలల లెక్కలను తాము వెల్లడించినా.. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల వివరాలు చెప్పడం లేదని కాగ్‌ అంటోంది. కార్పొరేషన్ల ద్వారా తీసుకుంటున్న రుణాలను ప్రభుత్వ అవసరాలకు వాడుతున్నారు. రుణాలను ఆదాయంగా బడ్జెట్‌లో చూపడానికి వీల్లేదని ఆర్బీవో (RBO) తాజాగా స్పష్టం చేసింది. కొన్ని కార్పొరేషన్ల ద్వారా రుణాలు తీసుకువచ్చి, రాష్ట్ర పథకాలకు ఆదాయ వనరుగా చూపించిన ఉదంతాలు గత కొన్ని బడ్జెట్లలో చూస్తూ వస్తున్నాం. అప్పును రాబడిగా, పథకం అమలుకు ఆదాయంగా చూపడాన్ని ఆర్బీఐ (R.B.I) తప్పుబట్టింది.

కార్పొరేషన్ల అప్పులను ప్రభుత్వ అప్పులుగానే పరిగణించాలని 15వ ఆర్థిక సంఘం చెప్పింది. కార్పొరేషన్ల రుణాల అసలు, వడ్డీలను ప్రభుత్వమే చెల్లిస్తున్నందున ప్రభుత్వ రుణంగానే పరిగణించి... మొత్తం నికర రుణ పరిమితిలో వాటినీ కలపాలని చెప్పినా చేయడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే కార్పొరేషన్ల రుణాలు, బహిరంగ మార్కెట్‌ రుణాలు కలిపి... నికర రుణ పరిమితిని ఎప్పుడో దాటేసినట్లే కనిపిస్తోంది.

రహస్యంగానే కార్పొరేషన్ల మొత్తం అప్పు: 2021 మార్చి నెలాఖరుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీల ద్వారా 86వేల 259.82 కోట్ల రూపాయలను వివిధ బ్యాంకుల ద్వారా సమీకరించిందని.. 2022 మార్చిలో కాగ్‌ గిరీష్‌ చంద్ర ముర్ము పేర్కొన్నారు. వాటిని బడ్జెట్‌లో వెల్లడించలేదన్నారు. అప్పు అసలు, వడ్డీ కూడా రాష్ట్ర బడ్జెట్‌ నుంచి చెల్లిస్తున్నారని అన్నారు. ఇప్పటికీ కార్పొరేషన్ల మొత్తం అప్పు ఎంతనే దానిపై తాజా లెక్కలు రహస్యమే. రాష్ట్ర ప్రభుత్వం రెండు రకాలుగా రుణాలు సేకరిస్తోంది.

పబ్లిక్‌ అకౌంట్‌ నుంచి రుణాలు, బహిరంగ మార్కెట్‌ రుణాలు. బహిరంగ మార్కెట్‌ రుణాల లెక్కలు ఆర్బీఐ(R.B.I) అధికారికంగా వెల్లడిస్తూ ఉంటుంది. పబ్లిక్‌ అకౌంట్ రుణాల లెక్కలే తెలియట్లేదు. కార్పొరేషన్ల నుంచి తీసుకునే రుణాలు, ఉద్యోగుల నుంచి వివిధ మార్గాల్లో తీసుకునే మొత్తాలు కలిసి ఉంటాయి. ఈ వివరాలు వెల్లడించకపోవడంతో అప్పు ఎంతన్నది బయటపడటం లేదు. అయితే నాన్‌ గ్యారంటీ రుణాలకు, ప్రభుత్వానికి సంబంధం ఏంటని అధికారులు ప్రశ్నిస్తున్నారు. వాడుకున్న సబ్సిడీ మొత్తాలను ప్రభుత్వాలు చెల్లించకపోవడం వల్లే నాన్‌ గ్యారంటీ రుణాలు పెరుగుతున్నాయని కొందరు నిపుణులు వాదిస్తున్నారు.

ప్రతి ఆర్థిక సంవత్సరంలో పెండింగ్‌ బిల్లులు ఎంత?, తదుపరి ఆర్థిక సంవత్సరంలో ఎంత మొత్తం చెల్లింపులు సాగాయి?, కొత్తగా మళ్లీ ఎన్ని బిల్లులు పెండింగులో పడ్డాయనే అంశాలను ప్రభుత్వం సమగ్రంగా వెల్లడించడం లేదు. పెండింగు బిల్లులను తదుపరి బడ్జెట్లకు బదలాయించడం లేదు. సంవత్సరంలో 331 రోజులు రాష్ట్రం అప్పుల్లోనే ఉందని కాగ్‌ తేల్చేసింది. ఇది 2020-21 ఆర్థిక సంవత్సరం పరిస్థితి.

ఓవర్​ డ్రాఫ్ట్​ నుంచి బయటపడకపోతే ఖాతాలు స్తంభింపజేసే పరిస్థితి: 2022-23 కూడా ఇంతకన్నా మెరుగ్గా ఏమీ లేదు. దీనిపై RBI ఎన్నో సార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఓవర్‌ డ్రాఫ్ట్‌ నుంచి బయటపడకపోతే ఖాతాలు స్తంభింపజేసే పరిస్థితి వస్తుందని తెలిపింది. కార్పొరేషన్‌ నుంచి రుణం తీసుకుని... మళ్లీ అదే కార్పొరేషన్‌ అప్పు తీర్చిన సంఘటనలు గత నెల ఫిబ్రవరిలోనే ఉన్నాయి. ప్రత్యేక డ్రాయింగు సదుపాయం, వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సులు, ఓవర్‌ డ్రాఫ్ట్‌ వెసులుబాటును ఉపయోగించుకోకుండా, ఇందుకోసం అనవసరంగా వడ్డీల భారం పడకుండా.. నగదు నిర్వహణ వ్యవస్థ మెరుగుపరచాలని రాష్ట్ర ప్రభుత్వానికి కాగ్‌ సూచించింది.

ప్రభుత్వం సకాలంలో జీతాలు ఇవ్వట్లేదు కదా.. ఆర్థిక నిర్వహణ మెరుగ్గా ఉందని ఎలా చెబుతారని ముఖ్యమంత్రికి ఆర్థిక కార్యదర్శిగా ఉన్న నిపుణుడిని ప్రశ్నిస్తే.. అది వేస్‌ అండ్‌ మీన్స్‌ పరిస్థితిని బట్టి ఉంటుందని చెప్పడం గమనార్హం. ఒక వైపు వేస్‌ అండ్‌ మీన్స్‌ ఉపయోగించుకోకుండా రాష్ట్రం ఆర్థిక నిర్వహణ చేయాలని కాగ్‌ చెబుతుంటే, అప్పులు దొరికితేనే జీతాలు ఇవ్వగలుగుతున్నాం అని ఆర్థిక కార్యదర్శులు అధికారికంగానే చెప్పడం రాష్ట్ర పరిస్థితికి అద్దం పడుతోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.