ETV Bharat / state

మంత్రి ఉషశ్రీ భూదందాలు నిరూపిస్తామన్న టీడీపీ.. కళ్యాణదుర్గంలో ఉద్రిక్తత

author img

By

Published : Feb 10, 2023, 3:36 PM IST

Kalyanadurgam
Kalyanadurgam

Kalyandurgam TDP leaders arrest: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఉదయం నుంచి టీడీపీ నేతలపై పోలీసుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. మంత్రి ఉషశ్రీ చరణ్ భూ దందాలు చేస్తోందని, అందుకు సంబంధించిన ఆధారాలను బయటపెడతామని మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి చేసిన ప్రకటనతో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. దీంతో కళ్యాణదుర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

కళ్యాణదుర్గంలో ఉద్రిక్తత.. టీడీపీ నేతలు అరెస్ట్

Kalyandurgam TDP leaders arrest: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఈరోజు ఉదయం నుంచి టీడీపీ నేతలపై పోలీసుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీ చరణ్ భూ దందాలకు పాల్పడుతున్నారని, అందుకు సంబంధించిన ఆధారాలను బయటపెడతామని మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి నాలుగు రోజుల క్రితం ప్రకటన చేశారు. ఈ క్రమంలో ఆయన కుమారుడు మారుతి చౌదరి పట్టణంలోని టీ కూడలి వద్దకు వెళ్తుండగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో మారుతి చౌదరి భార్య వరలక్ష్మి టీ కూడలి వద్ద బైఠాయించి.. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీ కూడలికి చేరుకున్న పోలీసులు.. వరలక్ష్మిని, హనుమంతరాయ చౌదరి భార్య లక్ష్మీదేవిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించడంతో ఉద్రిక్తత నెలకొంది.

కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి నాలుగు రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి ఉష శ్రీ చరణ్ అవినీతి అక్రమాలపై ఆధారాలు బయటపెడతానని.. శుక్రవారం పట్టణంలోని టీ కూడలి వద్ద పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఆధారాలను బయటపెడతామన్నారు. హనుమంతరాయ చౌదరి ప్రకటనతో అప్రమత్తమైన పోలీసులు.. టీడీపీ శ్రేణులకు అర్థరాత్రి నుంచే 41 ఏ నోటీసులను అందించారు. అనంతరం కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లిలో ఈరోజు ఉదయం నడకకు వెళ్లిన హనుమంతరాయ చౌదరికి పోలీసులు నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు.

అనంతరం మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి మాట్లాడుతూ.. మంత్రి ప్రభుత్వ నిబంధలను ఉల్లంఘించి పెద్ద మొత్తంలో భూములను కొనుగోలు చేశారని ఆరోపించారు. ఒక వ్యక్తికి ప్రభుత్వ నిబంధన ప్రకారం.. 62 ఎకరాలకు మించిన భూమి ఉండకూడదనే నిబంధన సంబంధించి.. అక్రమ భూముల వివరాలను తాము బహిరంగంగా బయటపెడతామని వెల్లడిస్తామంటే.. పోలీసులు అడ్డుకోవడం శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అవినీతి అక్రమాలపై బహిరంగ చర్చకు రాకపోగా.. ఆధారాలతో సహా బయటపెడతామని పిలుపునివ్వడంతో మంత్రి పారిపోయారని పేర్కొన్నారు.

మరోవైపు మారుతి చౌదరి భార్య వరలక్ష్మి టీ కూడలి వద్దకు చేరుకొని మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి భూములకు సంబంధించిన పలు కాపీలను తీసుకురాగా.. పోలీసులు చించివేశారు. దీంతో ఆమె పోలీసుల తీరుపై ఆగ్రహిస్తూ.. వాగ్వాదానికి దిగారు. రాష్ట్ర ప్రజలకు సేవలు చేయాల్సిన మంత్రే అవినీతికి పాల్పడుతోందని.. ప్రభుత్వం స్పందించి మంత్రి పదవి నుంచి ఉష శ్రీ చరణ్‌ని బర్తరఫ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

తన కుటుంబం పట్ల పోలీసుల ప్రవర్తిస్తున్న తీరు అమానుషంగా ఉందని హనుమంతరాయ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుమారుడు, కోడలు, భార్యను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ఆయన తన స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పోలీసులు గతరాత్రి నుంచి కార్యకర్తల పట్ల, కుటుంబ సభ్యుల పట్ల వ్యవహరిస్తున్న తీరును తప్పు పట్టారు. తన కుమారుడు పూర్తి ఆధారాలతో మంత్రి అక్రమాస్తులను బయటపెడతానంటే.. పోలీసులు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.