ETV Bharat / state

రీబిల్డ్ ఏపీ పేరుతో పునర్నిర్మిస్తాం.. యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాం: నారా లోకేశ్

author img

By

Published : Feb 10, 2023, 1:26 PM IST

Nara Lokesh 15th day Padayatra Start: 'నా పాదయాత్ర.. రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం, దగా పడ్డ వివిధ వర్గాలకు తోడు కోసం' అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జనవరి 27వ తేదీన 'యువగళం' పేరుతో మహాపాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్ర మొదలైన రోజు నుంచి నేటివరకూ ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే 14 రోజులు పూర్తి చేసుకున్న 'యువగళం' పాదయాత్ర.. 15వ రోజున చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం రేణుకాపురం నుంచి ప్రారంభమైంది.

Nara Lokesh
Nara Lokesh

Nara Lokesh 15th day Padayatra Start: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి వారధిగా తాను నిలుస్తానంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జనవరి 27వ తేదీన 'యువగళం' పేరుతో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం లక్ష్మీపురంలోని వరదరాజస్వామి ఆలయం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్రలో భాగంగా ఆయన.. దాదాపు 125 నియోజకవర్గాల్లో 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్లు నడిచేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే 14 రోజులు పూర్తి చేసుకున్న 'యువగళం' పాదయాత్ర.. నేడు చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం రేణుకాపురం నుంచి ప్రారంభమైంది.

జగన్ పాలనలో జే ట్యాక్స్ బెదిరింపులకి భయపడి.. పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు ఇతర రాష్ట్రాలకు పారిపోతున్నారంటూ.. నారా లోకేశ్‍ 15వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. ముందుగా రేణుకాపురం విడిది కేంద్రంలో బెంగళూరులో స్థిరపడిన జిడి నెల్లూరు వ్యాపారులతో లోకేశ్ భేటీ అయ్యారు. అనంతరం గంగాధర నెల్లూరు నియోజకవర్గం శ్రీరంగరాజపురం మండలం రాణిపురం వద్ద వ్యవసాయ పొలంలో నాగలి పట్టి దున్నారు. జిల్లాలో అమరరాజా పరిశ్రమ వెళ్లిపోవడం వలన దాదాపు 20 వేల మంది రాయలసీమ యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారని మండిపడ్డారు.

అనంతపురంలో జాకీ పరిశ్రమను కూడా అక్కడ ఎమ్మెల్యే కమీషన్ల కోసం ఒత్తిడి చేసి, తరిమేశారని ఆరోపించారు. జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలన్ని కుప్పకూలిపోయాయన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. సుమారు రూ.10 లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని ఎద్దేవా చేశారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో రాష్ట్రం అధఃపాతాళానికి దిగజారిపోయిందని ధ్వజమెత్తారు. తన సొంత ప్రయోజనాలు, అవినీతి సొమ్ము కోసం.. జగన్ రాష్ట్ర ప్రయోజనాలను, యువత భవిష్యత్తును బలిపెట్టారని విమర్శించారు.

టీడీపీ అధికారంలోకి రాగానే.. రీబిల్డ్ ఏపీ పేరుతో రాష్ట్రాన్ని పునర్నిర్మించి.. అన్ని జిల్లాల్లో మైక్రో క్లస్టర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. దాంతోపాటు వివిధ దేశాల నుంచి పరిశ్రమలను రాష్ట్రంలో నెలకొల్పి.. స్థానికంగానే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు. ఎగువకమ్మకండ్రిగలో బెల్లం రైతులను కలిసిన లోకేశ్‌.. ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాల గురించి అడిగి తెలుకున్నారు. తమను వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని బెల్లం తయారీ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పక్కా రాష్ట్రాలకు వలసలు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే బెల్లం రైతులను ఆదుకుంటామన్న లోకేశ్ వారికి హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.