నీరజ్‌ ఈటెకు రూ.1.5 కోట్లు.. సింధు రాకెట్‌కు రూ.80 లక్షలు

author img

By

Published : Oct 8, 2021, 3:26 PM IST

PM Modi mementos e-auction to end today: highest bid for Neeraj Chopra's javelin
నీరజ్‌ ఈటెకు రూ.1.5 కోట్లు.. సింధు రాకెట్‌కు రూ.80 లక్షలు ()

టోక్యో ఒలింపిక్స్​(Tokyo Olympics), పారాలింపిక్స్​లో(Tokyo Paralympics) పాల్గొన్న భారత్​ అథ్లెట్లు ప్రధాని నరేంద్ర మోదీకి బహుకరించిన క్రీడా పరికరాలకు ఈ-వేలంలో(Modi Gifts Auction) విశేషాదరణ లభించింది. ఇందులో అత్యధికంగా జావెలిన్​ త్రో అథ్లెట్​ నీరజ్​ చోప్డా ఈటె రూ.1.5 కోట్ల ధర పలకడం విశేషం.

టోక్యో ఒలింపిక్స్‌లో(Tokyo Olympics) స్వర్ణం సాధించిన జావెలిన్‌ త్రో అథ్లెట్‌ నీరజ్‌ చోప్డా ఉపయోగించిన ఈటెకు ఈ-వేలంలో(Modi Gifts Auction) భారీ ధర లభించింది. ప్రధానమంత్రికి వచ్చిన బహుమతుల ఈ-వేలంలో భాగంగా నీరజ్‌కు, దేశానికి పసిడి పతకాన్ని అందించిన ఆ ఈటెను వేలానికి(Neeraj Chopra Javelin Auction) పెట్టగా.. రూ.కోటిన్నర ధర పలికింది. ఇక రెండు ఒలింపిక్స్‌ పతకాలు సాధించిన భారత తొలి మహిళగా నిలిచిన భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు రాకెట్‌కు రూ.80,00,100 ధర లభించింది.

టోక్యో ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌లో భారత్‌ తరఫున అద్భుత ప్రదర్శన చేసిన అథ్లెట్లు ప్రధాని మోదీకి బహూకరించిన క్రీడా పరికరాలతో పాటు ఆయనకు వివిధ సందర్భాల్లో వచ్చిన జ్ఞాపికలను ఆన్‌లైన్‌ వేదికగా వేలం(Modi Gifts Auction) వేసింది. కేంద్ర సాంస్కృతిక శాఖ pmmementos.gov.inలో ఈ వేలాన్ని నిర్వహించింది. మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని సెప్టెంబరు 17న మొదలైన ఈ-వేలం అక్టోబరు 7 గురువారంతో ముగిసింది. ఈ వేలంలో నీరజ్‌ ఈటె.. రూ.1.5కోట్లకు అమ్ముడైంది. ఈ-వేలంలో అత్యధిక ధర పలికిన వస్తువు ఇదే కావడం విశేషం. అయితే దీన్ని ఎవరు కొనుగోలు చేశారన్నది సాంస్కృతిక శాఖ బయట పెట్టలేదు. వేలం ఆరంభమైన రోజే ఈ ఈటెకు రూ.10 కోట్ల ధర పలికినప్పటికీ ఆ బిడ్‌ నకిలీదనే అనుమానంతో తొలగించారు.

PM Modi mementos e-auction to end today: highest bid for Neeraj Chopra's javelin
ఈటెను మోదీకి బహుకరించిన నీరజ్​
PM Modi mementos e-auction to end today: highest bid for Neeraj Chopra's javelin
బ్యాడ్మింటన్​ రాకెట్​ను మోదీకి బహుకరించిన సింధు

భవానీదేవి కత్తికి రూ.1.25కోట్లు..

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున ఫెన్సింగ్‌లో పోటీ పడ్డ మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించిన ఫెన్సర్‌ భవానీదేవి కత్తికి(Bhavani Devi Modi) ఈ-వేలంలో రూ.1.25కోట్ల ధర లభించింది. పారాలింపిక్స్‌లో పసిడి సాధించిన సుమిత్‌ బళ్లెం రూ.కోటి 25వేలు పలికింది. పారాలింపిక్స్‌ విజేతలు సంతకాలు చేసి ప్రధానికి బహూకరించిన కండువాకు రూ.కోటి ధర లభించింది. టోక్యో ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌ సంచలనం లవ్లీనా బోర్గొహేన్‌ చేతి గ్లౌజులు రూ.91లక్షల ధర పలికాయి.

PM Modi mementos e-auction to end today: highest bid for Neeraj Chopra's javelin
ఫెన్సింగ్ కత్తిని మోదీకి బహుకరించిన భవానీ దేవి

ఆటగాళ్ల క్రీడా పరికరాలతో పాటు మోదీకి పలు సందర్భాల్లో వచ్చిన జ్ఞాపికలు, బహుమతులను కూడా వేలం వేశారు. మొత్తం 1348 వస్తువులకు ఈ-వేలానికి ఉంచగా.. వీటికి 8600 బిడ్లు వచ్చాయి. ఈ కార్యక్రమం ద్వారా సమకూరిన నిధులను గంగా నది ప్రక్షాళన కోసం చేపట్టిన 'నమామి గంగే' కార్యక్రమం కోసం వెచ్చించనున్నారు.

ఇదీ చూడండి.. T20 World Cup 2021: మెగాటోర్నీలో ఎవరికైనా కరోనా సోకితే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.