ETV Bharat / sports

ఆసియాకప్​లో ఆ స్పెషల్​ బ్యాట్​తో కోహ్లీ, అదరగొట్టేనా

author img

By

Published : Aug 24, 2022, 2:14 PM IST

virat Kohli going to use special wizard bat
virat Kohli going to use special wizard bat

మైదానంలో పరుగుల వరద పారించే కోహ్లీ కొంత కాలంగా పేలవ ఫామ్​తో ఇబ్బంది పడుతున్నాడు. అయితే త్వరలోనే ప్రారంభంకానున్న ఆసియా కప్​లో అతడు ఈ సారి ఓ స్పెషల్​ బ్యాట్​తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఓ సారి ఆ బ్యాట్​ గురించి తెలుసుకుందాం.

Virat Kohli to use special Gold Wizard quality MRF bat: కొన్నేళ్లుగా టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ కోహ్లీ పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. మైదానంలో బ్యాట్​ పడితే సెంచరీల వరద పారించే అతడు దాదాపు ముడేళ్ల నుంచి ఒక్క శతకం కూాడా బాదలేకపోయాడు. గత నెలలో ఇంగ్లాండ్​తో జరిగిన సిరీస్​లో పేలవ ప్రదర్శన కనబరిచిన అతడు.. ఈ సారైనా త్వరలోనే ప్రారంభంకానున్న ఆసియా కప్​తో ఫామ్​లోకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ టోర్నీలో భాగంగా అతడు తన తొలి మ్యాచ్​ను పాక్​తో తలపడనున్నాడు. అయితే ఈ మ్యాచ్​లో అతడు సరికొత్త బ్యాట్‌తో బరిలోకి దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.

కెరీర్ ప్రారంభంలో నైక్ బ్యాట్ వాడిన విరాట్​.. ఆ తర్వాత ఎమ్మారెఫ్​ బ్యాట్ వాడటం ప్రారంభించాడు. అయితే ఈ సారి అతడు ఎమ్మారెఫ్​ స్పెషల్ గోల్డ్ విజార్డ్ బ్యాట్‌ను వాడనున్నాడు. ఈ బ్యాట్​ను ఇంగ్లీష్​ విల్లో ఉడ్​తో తయారు చేసింది. దీని ఖరీదు సుమారు రూ.22వేలు ఉంటుందని తెలిసింది. ఆసియా కప్​ ప్రారంభం కానున్న నేపథ్యంలో దీనిని ఎమ్మారెఫ్​ కంపెనీ అతడికి స్పాన్సర్​ చేయనుంది. దీంతో ఈ కొత్త బ్యాట్‌తోనైనా కోహ్లీ పాత ఫామ్‌లోకి వస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఒకవేళ అతడు మళ్లీ ఫామ్​లోకి వస్తే.. ఆసియా కప్‌లో ఫ్యాన్స్‌కు పునకాలు రావడం ఖాయం. ప్రత్యర్థులకు చుక్కలు తప్పవు.

ఊహించని సమాధానం.. టీమ్​ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌లకు ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్‌ ఉన్న విషయం తెలిసిందే. అయితే.. దాయాది దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా చాలాకాలంగా రెండు జట్ల మధ్య సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ, ఆసియా కప్‌ లాంటి టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి. ఈ రెండు జట్లు చివరిసారిగా గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పోటీపడ్డాయి. దీంట్లో భారత్‌పై పాక్‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ దాయాది దేశాలు మళ్లీ ఆసియా కప్​లో తలపడనున్నాయి. ఆగస్టు 28న భారత్‌, పాక్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి గతేడాది ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది. మరోవైపు, ఈ హైవోల్టెజీ మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధిస్తుందన్న దానిపై అప్పుడే విశ్లేషణలూ మొదలయ్యాయి.

ఈ క్రమంలోనే మ్యాచ్​పై పాక్‌ మాజీ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది స్పందించాడు. అతడు ఇటీవల ట్విటర్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. 'ఆసియా కప్‌లో భారత్‌, పాక్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ రెండు జట్లలో ఏ జట్టు బలంగా ఉంది..? ఎవరు గెలుస్తారు?' అని ఓ నెటిజన్‌ ప్రశ్నించాడు. అయితే, అఫ్రిది పాక్‌ మాజీ ఆటగాడు కాబట్టి.. సొంత దేశమే గెలుస్తుందని చెప్తాడని అందరూ అనుకున్నారు. కానీ, అతడు ఎవరూ ఊహించని సమాధానమిచ్చాడు. "ఎవరు తక్కువ తప్పులు చేస్తే వాళ్లే మ్యాచ్‌ గెలుస్తారు" అని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.

పోలీక సహజం.. కోహ్లీ, పాక్ కెప్టెన్ బాబర్ మధ్య పోలికల గురించి వసీమ్​ అక్రమ్​ స్పందించాడు. "ఇరు జట్ల ఆటగాళ్లను ఒకరి ఒకరిని పోల్చడం సహజం. గతంలో ఇంజమామ్‌- రాహుల్‌, సచిన్‌.. అంతకుముందు సునిల్ గావస్కర్‌-జావెద్ మియాందాద్‌, గుండప్ప విశ్వనాథ్-జహీర్‌ అబ్బాస్‌తో పోల్చి చెప్పేవారు. ఇక బాబర్ అజామ్ చాలా స్థిరంగా అన్ని ఫార్మాట్లలో ఆడుతున్నాడు. అద్భుతమైన టెక్నిక్‌తో పరుగులు రాబడుతున్నాడు. బ్యాటింగ్‌ను ఆస్వాదించడం కూడా ఓ కారణం. ఇంకా పరుగుల దాహంతోనే ఉన్నాడు. ఇప్పటికీ కుర్రాడే. మంచి ఫిట్‌నెస్‌తో ఉన్నాడు. ప్రస్తుతం పాక్‌కు అన్ని ఫార్మాట్లలో అతడే సారథి. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాడు. ఇక బాబర్‌ను కోహ్లీతో పోల్చడం అనేది తొందరపాటే అవుతుంది. బాబర్‌ కూడా కోహ్లీ ట్రాక్‌లోనే ఉన్నాడు. ప్రస్తుత గొప్ప క్రికెటర్ల జాబితాలో బాబర్ అజామ్‌ తప్పకుండా నిలుస్తాడని భావిస్తున్నా" అని వివరించాడు. కాగా, ఆసియా కప్‌లో చిరకాల ప్రత్యర్థులు ఇప్పటివరకూ 14 సార్లు తలపడగా.. 8 మ్యాచ్‌ల్లో భారత్‌ విజయం సాధించింది. పాకిస్థాన్‌ ఐదింటిలో గెలుపొందింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.


ఇదీ చదవండి:

లెజెండ్స్ లీగ్‌ క్రికెట్‌ సీజన్​ 2 షెడ్యూల్​ రిలీజ్​, వేదికలు ఇవే

రవిశాస్త్రి అలా అనడం కరెక్ట్​ కాదన్న బెన్ స్టోక్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.