అందుకే ఔట్ అయినప్పుడు నవ్వుతున్నా: కోహ్లీ

author img

By

Published : May 12, 2022, 7:00 AM IST

kohli double reaction

Kohli Smile reaction getting out: ఈ సీజన్​లో వరుసగా తక్కువ స్కోర్లకు వెనుదిరుగుతున్నపుడు కోహ్లీ నవ్వు ముఖం పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఆ స్పందనకు కారణమేంటో విరాట్‌ వెల్లడించాడు. దీంతోపాటే వచ్చే ఏడాది ఏబీ డివిలియర్స్ బెంగళూరు జట్టులో కోచింగ్‌ స్టాఫ్‌గా చేరొచ్చనే సంకేతాలను కూడా ఇచ్చాడు.

Kohli Smile reaction getting out: ఏ బ్యాట్స్‌మన్‌ అయినా ఔటైనపుడు బాధగా, నిరాశగా ముఖం పెడతాడు. కానీ విరాట్‌ కోహ్లి మాత్రం ఈ సీజన్లో వరుసగా తక్కువ స్కోర్లకు వెనుదిరుగుతున్నపుడు నవ్వు ముఖం పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సీజన్లో విరాట్‌ మూడుసార్లు గోల్డెన్‌ డక్‌ (తొలి బంతికే ఔట్‌) కావడం, ఆ సందర్భాల్లో అతను ఒక నవ్వు నవ్వి పెవిలియన్‌ చేరడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ స్పందనకు కారణమేంటో విరాట్‌ వెల్లడించాడు. "నా కెరీర్లో ఇలా ఇంతకు ముందెన్నడూ జరగలేదు. అందుకే నేనలా నవ్వా. ఆట ఏమేం చూపిస్తుందో అవన్నీ నేను చూసేశానని అనిపించింది" అని కోహ్లి చెప్పాడు. తన పేలవ ఫామ్‌పై టీ20 లీగ్‌ వ్యాఖ్యాతల నుంచి వస్తున్న విమర్శల గురించి కూడా అతను స్పందించాడు. "విమర్శకులు నా స్థానంలో ఉండి ఆలోచించలేరు. నేనేమనుకుంటున్నానో వాళ్లు తెలుసుకోలేరు. విమర్శలకు ప్రభావితం కాకుండా ఉండడానికి రెండు దారులున్నాయి. ఒకటి టీవీ రిమోట్‌లో మ్యూట్‌ బటన్‌ నొక్కడం, లేదంటే ఎవరేమంటున్నారో పట్టించుకోకుండా ఉండిపోవడం. నేను ఈ రెండు పనులూ చేస్తా" అని విరాట్‌ అన్నాడు. మరోవైపు చాలా ఏళ్ల పాటు తనతో కలిసి బెంగళూరు జట్టుకు ఆడిన ఏబీ డివిలియర్స్‌ ఈ సీజన్‌ నుంచి ఐపీఎల్‌కు దూరం కావడంపై విరాట్‌ మాట్లాడాడు. వచ్చే ఏడాది అతడు బెంగళూరు జట్టులో కోచింగ్‌ స్టాఫ్‌గా చేరొచ్చనే సంకేతాలను కూడా ఇచ్చాడు. "ఏబీ లేని లోటు చాలా కనిపిస్తోంది. నేను అతడితో తరచుగా మాట్లాడుతుంటా. అతను అమెరికాలో కుటుంబంతో కలిసి గోల్ఫ్‌ చూస్తున్నాడు. అదే సమయంలో బెంగళూరు ప్రదర్శనను గమనిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏదో రకంగా జట్టులో అతను భాగమవుతాడని ఆశిస్తున్నా" అన్నాడు.

Kohli du plessis: టీ20 లీగ్‌లో చాలా కాలంపాటు చెన్నై జట్టుకి ఆడిన డుప్లెసిస్‌ ఈ ఏడాది బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో అతడి స్థానంలో డుప్లెసిస్‌ను నియమించింది బెంగళూరు జట్టు యాజమాన్యం. అతడి సారథ్యంలో బెంగళూరు 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. బ్యాటర్‌గా కూడా డుప్లెసిస్‌ మెరుగైన ఆటతీరును కనబరుస్తున్నాడు. 12 ఇన్నింగ్స్‌ల్లో 389 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలోనే డుప్లెసిస్‌ కెప్టెన్సీపై విరాట్ కోహ్లీ స్పందించాడు. డుప్లెసిస్‌ కెప్టెన్సీపై గౌరవం ఉందని, కొన్ని సార్లు తన సూచనలకు అతడు నో చెప్పేవాడని విరాట్​ పేర్కొన్నాడు.

"డుప్లెసిస్‌ సౌతాఫ్రికా కెప్టెన్‌గా ఉన్నప్పుడు, మిగతా సందర్భాల్లో కూడా మేం బాగా కలిసి ఉండేవాళ్ళం. అతడికి మైదానంలో పూర్తి అధికారం ఉంది. కొన్నిసార్లు నేను ఇచ్చిన సూచనలకు నో చెప్పి అలా చేయకూడదని చెప్తాడు. దాన్ని నేను గౌరవిస్తాను. ఇలా చేయడం కెప్టెన్‌ గౌరవాన్ని పొందేలా చేస్తుంది" అని విరాట్ కోహ్లి అన్నాడు.

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు కోహ్లీకి విశ్రాంతి.. టీ20 లీగ్‌లో పేలవమైన ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీకి సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కు విశ్రాంతి ఇవ్వనున్నారు. ఇంగ్లాండ్‌ పర్యటనకు కోహ్లి పూర్తిస్థాయిలో సిద్ధమయ్యేందుకు ఈ విశ్రాంతి దోహదపడుతుందని భావిస్తున్నారు. గత రెండు నెలలుగా బయో బబుల్‌లో ఉంటున్న కోహ్లీకి ఆట నుంచి విరామం అవసరమని చేతన్‌శర్మ సారథ్యంలోని జాతీయ సెలెక్షన్‌ కమిటీ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. కెరీర్‌లోనే అత్యంత పేలవమైన ఫామ్‌లో ఉన్న కోహ్లి.. గత మూడేళ్లలో అంతర్జాతీయ క్రికెట్లో ఒక్క సెంచరీ కూడా సాధించలేదు.

ఇదీ చూడండి: ఐపీఎల్​ నుంచి జడేజా ఔట్​- కావాలనే తప్పించారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.